Tirumala: కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులపై భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో పెరిగింది. ఈ వేసవి కాలంలో శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తులు తమ మొక్కులను భారీగా చెల్లించుకుంటున్నారు. ముఖ్యంగా స్వామివారికి తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య ఈసారి రికార్డు స్థాయికి చేరింది. మే 27వ తేదీ నాటికి దాదాపు 12.43 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం విశేషం. ఇక మే 23న ఒక్కరోజే ఏకంగా 57,580 మంది భక్తులు తలనీలాలు సమర్పించారంటే రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
భక్తుల రద్దీ ఎంత పెరిగినా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) క్షేత్రస్థాయిలో అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం ప్రధాన కళ్యాణకట్టతో పాటు మరో 11 మినీ కళ్యాణకట్టలను అందుబాటులోకి తెచ్చింది. తిరుమలకు వచ్చే భక్తులకు నిరంతరాయంగా సేవలు అందించేందుకు 1,152 మంది క్షురకులు (నాయీ బ్రాహ్మణులు) షిఫ్టుల వారీగా శ్రమిస్తున్నారు. రద్దీ పెరగడంతో అదనపు సిబ్బందిని కూడా విధుల్లోకి దించి పనులను వేగవంతం చేశారు.
కళ్యాణకట్టల్లో భక్తుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ పరిశుభ్రతకు పెద్దపీట వేశారు. తలనీలాలు సమర్పించిన తర్వాత భక్తులు స్నానాలు చేయడానికి వేడి నీటి వసతి, స్నానపు గదులను సిద్ధం చేశారు. అలాగే, సంప్రదాయం ప్రకారం తలపైన రాసుకోవడానికి చందనం బిళ్లలను కూడా అందిస్తున్నారు. గంటల తరబడి లైన్లలో నిల్చోకుండా టోకెన్ విధానాన్ని బలోపేతం చేయడంతో పాటు, వేచి ఉండే చోట తాగునీరు, కూర్చునే సదుపాయాలను టీటీడీ చక్కగా నిర్దేశించింది. భక్తులంతా ఈ ఏర్పాట్ల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఎవరీ వైభవ్ సూర్యవంశీ? 15 ఏళ్ల వయసులోనే క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన ఐపీఎల్ స్టార్!