ఉన్నది నలుగురు. తలోదారి. ఎవరి గ్రూపులు వారివి. ఒకరిని కాదని మరొకరు ఫైరవీలు. ఒకరిపై మరొకరు దుష్ప్రచారాలు, గోతులు తవ్వుకోవడాలు.. ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కామన్ అయిపోయాయి. మొన్నటి వరకు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ నెలకొన్నది. నిజామాబాద్ ఎంపీ అర్వింద్, సీనియర్ నేత ఈటల రాజేందర్ల మధ్య పోటీ ఉండే. దాదాపుగా ఈటల రాజేందర్కు ఈ పదవి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడి సీనియర్లు అది కానీయలేదు. కిషన్రెడ్డి దీనికి ప్రధాన అడ్డంకిగా మారాడనే ప్రచారం జరిగింది. బండి సంజయ్ను అనుకోకుండా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తరువాత పార్టీలో అనిశ్చితి నెలకొన్నది.
ఆ తరువాత అది ఈటల రాజేందర్కే ఇస్తారని అంతా భావించారు. కానీ కిషన్రెడ్డి చక్రం తిప్పి.. రాంచంద్రారావుకు ఇప్పించుకున్నాడు. ఇక ఇప్పట్లో అతన్ని మార్చేది ఉండదు. మళ్లీ ఎన్నికల నాటి ముచ్చట అది. కానీ ఇప్పుడు కేంద్ర కేబినెట్ విస్తరణ జరుగుతుందనే ప్రచార నేపథ్యంలో.. మళ్లీ ఈ గ్రూపుల లొల్లి తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. కిషన్రెడ్డి పలుకుబడి అధిష్టానం వద్ద మరింత పెరిగింది. బండి సంజయ్ అతని కొడుకు కేసులో మంత్రి పదవి నుంచి తప్పిస్తారేమోనని అంతా అనుకున్నారు. కానీ అది జరిగేలా లేదు. దీంతో మరొకరికి ఇస్తారని ప్రచారం జరుగుతున్నది. ఈ రేసులో ప్రధానంగా ఈటల రాజేందర్, డీకే అరుణ పేర్లు వినిపిస్తున్నాయి. అర్వింద్ కూడా ఆశిస్తున్నా.. అతన్ని పెద్దగా అధిష్టానం పట్టించుకోవడం లేదు. అర్వింద్ ఏ ఒక్కరితో కూడా పార్టీలో కలిసి ముందుకు సాగడం లేదు.
తన పంథా తనది. అప్పుడప్పుడు పార్టీ లైన్ను కూడా దాటి నడుచుకోవడంతో సీనియర్లు గుర్రుగా ఉన్నారు. దీంతో అతనికి చాన్స్ లేనట్టే. ఇక ఉన్నది ఇద్దరు ప్రధానంగా. ఈటల రాజేందర్ మొదటి నుంచి ఈ పార్టీలో పట్టింపు లేకుండా ఉన్నాడు.అతని అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇకనైనా కేంద్ర పదవి ఇస్తే.. పార్టీని మరింత బలోపేతం చేయొచ్చనే విధంగా అధిష్టానం వద్ద ఒత్తిడి పెంచుతున్నారు. అధిష్టానం వద్ద ఈటలకు మంచి పేరే ఉన్నది. సమీకరణలన్నీ కలిసి వస్తే.. తనకే ఆ కేంద్ర మంత్రి పదవి అని ఈటల అనుకుంటున్నాడు.
కానీ ఇంతలోనే ఈటల పై హైదరాబాద్లో పోస్టర్లు వెలిశాయి. పార్టీకి అతని వల్ల నష్టమే తప్ప.. ఎలాంటి లాభం లేదనే విధంగా వేసిన పోస్టర్లు కలకలం రేపాయి. ఇది పార్టీ వర్గాల కుట్రేనని ఈటల వర్గం దీనిపై భగ్గుమంటోంది. ఈటలకు ఈ విషయంలో మద్దతు వెల్లువలా లభిస్తోంది. ఆ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందో కానీ.. ఎవరికి వారుగా విడిపోయి.. గ్రూపుల వారీగా తలోదారి చూసుకుంటున్నారు. ఇంటి గుట్టు బయట పెట్టుకుని ఒకరిపై ఒకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో తెలంగాణ బీజేపీ నేతల వ్యవహారం ఇప్పుడు అధిష్టానానికి తలనొప్పిగా మారింది.