Telangana Politics: స్వేచ్ఛ బ్యూరో: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మళ్లీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా.. ‘ప్రాంతీయ సెంటిమెంట్’అనే పదునైన ఆయుధాన్ని రాజకీయ పార్టీలు మళ్లీ దూసేందుకు సిద్ధమవుతున్నాయి. నిన్నమొన్నటి వరకు సైలెంట్గా ఉన్న తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా ‘ఆంధ్ర పార్టీలు – తెలంగాణ అస్తిత్వం’అనే పాత నినాదం వైపు మళ్లుతోంది. మొన్న టీడీపీ ఇచ్చిన హింట్లు, తాజాగా జనసేన చేసిన ప్రకటనలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ సమీకరణాలు పూర్తిగా మారిపోయేలా కనిపిస్తున్నాయి. తెలంగాణలో తమ ఉనికిని చాటుకునేందుకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి భాగస్వామ్య పక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో పట్టు కోల్పోయిన కేడర్ను మళ్లీ యాక్టివ్ చేసేందుకు, రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవ్వాలంటూ తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం నుంచి అంతర్గతంగా సంకేతాలు వచ్చినట్లు తెలిసింది.
దీనిలో భాగంగానే గత కొన్ని రోజుల నుంచి టీటీడీపీ నేతల తెలంగాణలో తమ వాయిస్ను బలంగా వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేగాక తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ పై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నట్లు ప్రకటించడం, ఇక్కడ కమిటీల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఈ రెండు పార్టీలు ఇప్పటికే ఏపీ కూటమీలో భాగస్వామీగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలకు అదనంగా బీజేపీ కూడా భాగస్వామీగా ఉన్నది. దీంతో రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ ఈ మూడు పార్టీలు భాగస్వామీగా ఉండే ఛాన్స్ ఉన్నదనే ప్రచారం కూడ జరుగుతుంది. అయితే ఈ పరిణామాలపై తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్తో పాటు, ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఒకే లైన్లో రియాక్ట్ అవుతుండటం గమనార్హం.
దీంతో పాటు తాజాగా ప్రజల్లోకి వచ్చిన తెలంగాణ రక్షణ సేనా కూడా జన సేనకు వ్యతిరేకంగా రియాక్ట్ అయింది. సోషల్ మీడియాల్లోనూ ఈ పార్టీలు టీడీపీ, జనసేనాపై విరుచుపడుతున్నాయి. “తెలంగాణ ఆత్మగౌరవాన్ని మళ్లీ ఆంధ్ర పార్టీల చేతుల్లో పెట్టాలా?” అంటూ ఉమ్మడిగా ఎటాక్ మొదలు పెట్టడం గమనార్హం. అంతేగాక గతంలో ఈ రెండు పార్టీలు తెలంగాణ పై స్పందించిన విధానాలను వీడియోల రూపంలో తెరమీదకు తెచ్చి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. తెలంగాణలో నిర్ణయాధికారం ఇక్కడి నేతల చేతుల్లోనే ఉండాలని, పక్క రాష్ట్రంలో అధికారంలో ఉంటూ, ఇక్కడ రాజకీయం చేస్తామంటే తెలంగాణ సమాజం ఒప్పుకోదంటూ హెచ్చరిస్తున్నాయి. బీఆర్ఎస్ మళ్లీ తన పాత ‘తెలంగాణ సెంటిమెంట్’ అస్త్రాన్ని నమ్ముకోగా, కాంగ్రెస్ సైతం ఏపీ పార్టీల ఎంట్రీ ఇక్కడి స్థానిక సమీకరణాలను దెబ్బతీస్తుందని కోణంలో ప్రచారాన్ని తీవ్రం చేస్తోంది.
Also Read: జనసేన అధినేత వ్యాఖ్యలు.. ఆపై కేటీఆర్ రియాక్ట్, ఏయే అంశాలు ఒక్కసారి
ఈ సరికొత్త ప్రాంతీయ వార్ కారణంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ ఉండగా.. ఇప్పుడు టీడీపీ, జనసేన ఫ్యాక్టర్స్ కూడా తోడైతే ఓట్ల చీలిక ఎవరిని ముంచుతుందో, ఎవరిని తేలుస్తుందో అనే ఉత్కంఠ మొదలైంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, సెటిలర్స్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. అంతేగాక ఈ దఫా రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకమైన పొత్తులు కాకుండా, జిల్లాలు వారీగా లోకల్ ఈక్వేషన్స్ బట్టి పొత్తులు మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్తో పాటు గ్రేటర్ హైదరాబాద్లోనూ పొలిటికల్ ఈక్వేషన్స్ మారనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో సెటిలర్స్, ఐటీ ఉద్యోగులు అత్యధికం. ఇక్కడ టీడీపీ, జనసేన ప్రభావం చూపవచ్చని.. బీజేపీ , కాంగ్రెస్తో లోకల్ అండర్స్టాండింగ్ ఉండే ఛాన్స్ ఉన్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు.
ఇక ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్లో కమ్మ, కాపు సామాజికవర్గాలు ప్రభావితం చూపుతాయి. అంతేగాక ఏపీ మూలలు కలిగిన పబ్లిక్ అత్యధికంగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఏపీ కూటమీ ఇక్కడ బలంగా ప్రభావితం చేసే ఛాన్స్ ఉన్నది. ఉమ్మడి నల్గొండ, వరంగల్ తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండే ప్రాంతాలు. ఇక్కడ ప్రాంతీయ సెంటిమెంట్తో కాంగ్రెస్, బీఆర్ఎస్ గట్టిగా డిఫెండ్ చేసుకునే ఛాన్స్ ఉన్నది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆయా జిల్లాల్లో విభిన్న రీతిలో పొలిటికల్ పొత్తులు జరిగాయి. కొన్ని చోట్ల బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా అంతర్గత పొత్తులు పెట్టి ఎన్నికల్లో విజయం సాధించాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో పొలిటికల్ పార్టీల ముఖచిత్రం ఎలా ఉంటుందో? ఇప్పుడు అంచనా వేయడం కష్టమని సీనియర్లు చెప్తున్నారు. అయితే ఆంధ్రా-తెలంగాణ సెంటిమెంట్ మరోసారి తెరపైకి వస్తే, అది ఏ పార్టీకి మైలేజ్ ఇస్తుంది? ఏ పార్టీకి నష్టం చేకూరుస్తుంది? అనేది తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. కానీ, రాబోయే రోజుల్లో పొలిటికల్ వార్ మాత్రం పీక్స్కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
జనసేనా, టీడీపీ ముందస్తు ప్రకటనలు జీహెచ్ ఎంసీ ఉద్దేశించే అని కొంత మంది లీడర్లు చెప్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో తమ సత్తా చాటాలని ఆ రెండు పార్టీలు బలంగా భావిస్తుస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కోర్ సిటీలోని నాయకులతో ఈ రెండు పార్టీల ముఖ్య నేతలు కామన్ మీటింగ్ కూడా నిర్వహించినట్లు సమాచారం. ఏపీ పొత్తు తరహాలోనే ఇక్కడ కంటిన్యూ కావాలని భావిస్తున్నారు. జనసేనా, టీడీపీ ఒక క్లారిటీతో ఉన్నప్పటికీ, బీజేపీ నుంచి కూటమీపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదని ఆ పార్టీ ముఖ్య నాయకులు చెప్తున్నారు. ఇక జీహెచ్ ఎంసీ తర్వాత జిల్లాల్లోనూ ఫోకస్ పెట్టనున్నారు. గతంలో వివిధ పార్టీల నుంచి టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నేతలకు గాలం వేయనున్నారు. ఇప్పటికే విడతల వారీగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆసక్తిగల వారిని విడతల వారీగా పార్టీల్లోకి చేర్చుకోవాలని భావిస్తున్నారు. ఏపీ బోర్డర్లలోని జిల్లాల్లో గట్టి క్యాండిడేట్లను నిలపెట్టాలని ఏపీ కూటమీలోని పార్టీలు భావిస్తున్నాయి.