Raghunandan Rao: తెలంగాణ సెంటిమెంట్ ను బీఆర్ఎస్ ఫ్యాషన్ గా పెట్టుకుందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. బీజేపీని బద్నామ్ చేసేలా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ చెబుతున్నట్లు బీఆర్ఎస్ కు 90 సీట్లు కాదు కదా.. 9 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ముక్కలయ్యే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. సొంతపార్టీని కాపాడుకోలేక కేటీఆర్.. మీడియాతో గంటల కొద్ది మాట్లాడుతున్నారని రఘునందన్ రావు విమర్శించారు. తెలంగాణ భూమిపుత్రులుగా రాష్ట్రాని ఏం చేయాలో అదే బీజేపీ నేతలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
అటు కాంగ్రెస్ పాలనపై కూడా రఘునందన్ రావు తీవ్ర మండిపడ్డారు. తెలంగాణలో ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి అవే చివరి ఎన్నికలు అవుతాయని జోస్యం చెప్పారు. ప్రతిపక్షంలో ఉండాలని కాంగ్రెస్ నేతలు మెంటల్ గా ఫిక్స్ అవుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ కోసం తాము పోరాడతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను ఎవరు అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత.. బీజేపీకి ఓటు వేయాలని ప్రజలు భావిస్తున్నారని రఘునందన్ రావు అన్నారు.
మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య విడదీయరాని బంధం ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులకు కచ్చితంగా ప్రజలు శిక్షిస్తారని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ ఒక్క సీటు గెలవదని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు అనడాన్ని రఘునందన్ రావు తప్పుబట్టారు. కమ్యూనిస్టులు ఎవరితో పొత్తు లేకుండా ఒక్క సీటు గెలిచి చూపించాలని సవాలు విసిరారు. కమ్యూనిస్టులు ఉన్న రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలిచిన విషయాన్ని మెదక్ ఎంపీ గుర్తుచేశారు. దేశ ప్రజలు.. లెఫ్ట్ పార్టీలను లెఫ్ట్ చేశారని సెటైర్లు వేశారు. ఖమ్మంలో ఎంపీ, ఎమ్మెల్యేలు గెలిచి చూపిస్తామని కూనంనేనికి ఛాలెంజ్ విసిరారు.
Also Read: కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి
తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ నాయకత్వం కృషి చేస్తుందని రఘునందన్ రావు అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ సొంతంగా పోటీ చేస్తుందని పేర్కొన్నారు. తమ బలం సరిపోదు అన్న దగ్గర మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. తన స్వరాష్ట్రమైన గుజరాత్ కంటే తెలంగాణకు రెట్టింపు నిధులు ఇచ్చామని ప్రధాని మోదీ స్వయంగా చెప్పారని రఘునందన్ రావు గుర్తుచేశారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న ఆలోచనలో ప్రస్తుతం తాము ఉన్నట్లు రఘునందన్ రావు చెప్పుకొచ్చారు.
Also Read: రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!