Tirumala News: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలకు సంబంధించి రికార్డ్ స్థాయిలో భక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. మొదటి మూడు రోజులకు 24 లక్షల మందికి పైగానే నమోదు చేసుకున్నారు. అందులో కేవలం లక్షా 76 వేలమందికి మాత్రమే స్వామి దర్శన భాగ్యం కలగనుంది.ఈ-డిప్లో ఎంపికైన భక్తుల వివరాలను మంగళవారం మధ్యాహ్నం రెండుగంటలకు విడుదల చేయనుంది టీటీడీ.
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం
తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి ఒకటి వరకు ఉచితంగా భక్తులకు వైకుంఠద్వార దర్శన భాగ్యం కలగనుంది. దీనికి సంబంధించి భక్తుల రిజిస్ట్రేషన్ సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. నవంబర్ 27 ఉదయం 10 గంటల డిసెంబర్ ఒకటి సాయంత్రం ఐదు గంటల వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగాయి.
అత్యధికంగా టీటీడీ మొబైల్ యాప్ ద్వారా 13 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. టీటీడీ వెబ్సైట్ లో 9. 3 లక్షలు, ఏపీ గవర్నమెంట్ వాట్స్ యాప్ ద్వారా 1.5 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. దాదాపు 9 లక్షల 55 వేల రిజిస్ట్రేషన్ల ద్వారా 24 లక్షల మంది భక్తుల వివరాలు సమర్పించినట్లు టీటీడీ ఐటీ డీజీఎం తెలిపారు.
రికార్డ్ స్థాయిలో రిజిస్ట్రేషన్లు
మొదటి మూడు రోజులు ఆన్లైన్ ఈ-డిప్లో ఎంపికైన భక్తుల వివరాలను మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రకటనించనుంది టీటీడీ. ఇందులో ఎంపికైన భక్తులకు ఫోన్ ద్వారా సందేశం పంపుతారు. అందులో లింక్ ఓపెన్ చేసి ఉచితంగా టోకెన్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
డిసెంబర్ 30న 57 వేలు భక్తులు, 31న 64వేలు, జనవరి ఒకటి 55 వేల టోకెన్లు అందుబాటులో ఉంచిందట టీటీడీ. మిగతా వారం రోజులు ఎలాంటి టోకెన్లు లేని భక్తులను నేరుగా అనుమతించనున్నారు. అదే సమయంలో రోజుకు 15 వేల మందికి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కల్పించనున్నారు. అలాగే 1000 శ్రీవాణి దర్శన టికెట్ల కోటా డిసెంబర్ 5న వాటిని ఆన్లైన్లో విడుదల చేయనుంది.
ALSO READ: ఢిల్లీలో మంత్రి లోకేష్, పార్టీ ఎంపీలతో భేటీ
మిగిలిన ఏడు రోజులు జనవరి 2 నుండి 8 వరకు సర్వ దర్శనాలు యథాతథంగా కొనసాగనున్నాయి. చివరి మూడు రోజులు అంటే జనవరి 6, 7, 8 తేదీల్లో స్థానికుల కోసం రోజుకు 5 వేల టోకన్లు డిసెంబర్ నెల 10న విడుదల చేయనుంది టీటీడీ. వైకుంఠద్వార దర్శనాల్లో ఈసారి సామాన్య భక్తులకు పెద్ద పీట వేసింది టీటీడీ.
మరోవైపు శ్రీవారి దర్శన టికెట్లకు సంబంధించి పేమెంట్ గేట్ వే పని చేయలేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీఐపీ బ్రేక్, ఎస్ఈడీ దర్శనాలకు సంబంధించి నగదు చెల్లింపులకు సోమవారం సాయంత్రం చాలామందికి ఫోన్లకు సందేశాలు వచ్చాయి.
ఈ క్రమంలో ఎంబీసీ-34లో నగదు చెల్లించి టికెట్లను నేరుగా కొనుగోలు చేయాలని సూచన చేసింది టీటీడీ. పేమెంట్ గేట్ వేకు సంబంధించి బ్యాంక్ నెట్వర్క్ పని చేయకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం జియో పేమెంట్ నెట్వర్క్ అందుబాటులో ఉంది. త్వరలో యూనియన్ బ్యాంక్, పేటీఎం ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ నెట్వర్క్లను అందుబాటులోకి తీసుకురానుంది టీటీడీ.