Tirupati Hotel Bomb Threat: తిరుపతిలో బాంబు బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా నగరంలోని మూడు ప్రముఖ హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. కపిలతీర్థం సమీపంలోని రాజ్ పార్క్ హోటల్, పాయ్ వైస్రాయ్ హోటల్, ఉప్పరపల్లి వద్ద ఉన్న ఎస్ఆర్బీ (SRB) హోటల్ను పేల్చివేస్తామంటూ అజ్ఞాత వ్యక్తుల నుండి సందేశాలు అందాయి. ఈ హోటళ్లలో తరచూ ప్రముఖులు విడిది చేస్తుండటంతో పోలీసులు ఈ విషయాన్ని అత్యంత సీరియస్ గా తీసుకున్నారు.
సమాచారం అందిన వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఆయా హోటళ్లలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. గంటల తరబడి గాలించినా ఎక్కడా అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని తేలింది. కేవలం హోటళ్లకే కాకుండా, నిన్న (మార్చి 3, 2026) చిత్తూరు కోర్టుకు కూడా ఇలాంటి బాంబు బెదిరింపు రావడం గమనార్హం. నిత్యం ఏదో ఒక ప్రముఖ ప్రాంతానికి బెదిరింపు మెయిల్స్ రావడం.. పోలీసులు తనిఖీలు చేయడం.. చివరకు ఏమీ లేదని వెళ్ళిపోవడం ఇప్పుడు తిరుపతిలో సర్వసాధారణంగా మారింది.
తిరుపతిలో ఇటువంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది కాలంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో కూడా నగరంలోని సుమారు 10కి పైగా హోటళ్లకు విదేశీ సర్వర్ల ద్వారా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అప్పట్లో ‘జాఫర్ సాదిక్’ అనే డ్రగ్ కింగ్ పిన్ పేరుతో ఈ మెయిల్స్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. పర్యాటక రంగాన్ని దెబ్బతీయడానికి లేదా పోలీసు యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికి సైబర్ నేరగాళ్లు ఇటువంటి పనులకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు.
Read Also: Mahesh Kumar Goud: డీసీసీలకు మహేష్ కుమార్ గౌడ్ కీలక ఆదేశాలు