IBomma: తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న భారీ పైరసీ రాకెట్కు సంబంధించి తెలంగాణ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ రాకెట్ వెనుక కీలక సూత్రధారిగా భావిస్తున్న ఇమంది రవిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతని కార్యకలాపాల వల్ల టాలీవుడ్ పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగానే కాకుండా, విదేశాల నుంచి కూడా రవి ఈ నెట్వర్క్ను నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ అరెస్ట్ వార్త తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది.
ఈ అరెస్ట్పై విశాఖపట్నంలో నివసిస్తున్న రవి తండ్రి అప్పారావు ‘బిగ్ టీవీ’తో మాట్లాడుతూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “నా కొడుకు రవిని పోలీసులు అరెస్టు చేశారని బంధువులు చెబితే తెలిసింది. పేపర్లలో, యూట్యూబ్లో వీడియోలు చూసి అరెస్ట్ అయిన విషయం తెలుసుకున్నాను.” అని ఆవేదన చెందారు. “డిగ్రీ వరకు చదివించి ఉద్యోగం కోసం పంపించాను. వాడు హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడని మాత్రమే నాకు తెలుసు. విదేశాల్లో ఉన్నాడనే విషయం నాకు తెలియదు. రిటైర్డ్ అయిన తర్వాత ఈ చిన్న ఇంట్లోనే ఉంటున్నాను.” అని తెలిపారు. చివరిసారిగా రెండేళ్ల క్రితం స్నేహితుడి ఫంక్షన్ కోసం రవి వైజాగ్ వచ్చాడని, తన భార్యతో విడాకులు తీసుకుంటున్నాడని కూడా తెలిసిందన్నారు. “నా కొడుకుని శిక్షించమని చెప్పను, వద్దని చెప్పను. చట్టం ఎలా ఉంటే అలా చేస్తుంది.” అని అప్పారావు నిస్సహాయంగా వ్యాఖ్యానించారు.
రవి అరెస్ట్ వ్యవహారం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ఇతని పైరసీ నెట్వర్క్ కారణంగా తెలుగు సినీ పరిశ్రమ గత కొన్నేళ్లుగా వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసిందని నిర్మాతల మండలి వర్గాలు ఆరోపిస్తున్నాయి. సినిమాలు విడుదలైన కొద్ది గంటల్లోనే హెచ్డీ ప్రింట్లను ఆన్లైన్లో పెట్టడం ద్వారా నిర్మాతలను దారుణంగా దెబ్బతీశారని సమాచారం. రవి అరెస్టుతో ఈ భారీ పైరసీ ముఠాకు అడ్డుకట్ట పడుతుందని, ఇది పరిశ్రమకు పెద్ద ఊరట అని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Read Also: Premisthunnaa: మేనేజర్ పై చేయి చేసుకున్న హీరోయిన్ తండ్రి , కారణం వింటే షాక్ అవ్వాల్సిందే