Kuppam: చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతానికి చెందిన శ్రీనాథ్ ఐదేళ్ల క్రితం బెంగళూరులో స్థిర పడ్డాడు. వరుసకు సోదరుడైన ప్రభాకర్కు శ్రీనాథ్ మధ్య లావాదేవీలు జరిగాయి. దీంతో గత కొన్ని రోజులుగా శ్రీనాథ్ కనిపించక పోవడంతో అతని భార్య నీల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తుండగా.. అనుమానితుడు ప్రభాకర్, మరో వ్యక్తి ని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనాథ్ను హత్యచేసినట్లు సమాచారంతో కుప్పం జగనన్న కాలనీలో నిర్మాణ దశలో ఉన్న ఓ ఇంట్లో కర్ణాటక పోలీసులు తవ్వకాలు చేపట్టారు. అక్కడ కుళ్లిన మృతదేహాన్ని వెలికి తీసి.. పోస్టుమార్టంకు తరలించారు. సుత్తితో తలపై కొట్టి హతమార్చినట్టు విచారణలో తెలిసినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని బంధువులను అప్పగించి నిందితులను కర్ణాటకకు తరలించారు. శ్రీనాథ్ను పథకం ప్రకారం ప్రభాకర్ హత్య చేశాడని.. కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.