Amiravathi : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతిలో.. ఏపీ బ్రాండ్ టెంపుల్ గా అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. రోజూ లక్షల మంది దర్శించుకునే తిరుమల శ్రీవారి ఆలయాన్ని రాజధానిలో అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కూటమి సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే.. టీటీడీ అనుసరిస్తున్న విధానాలతో, తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవాన్ని రాజధాని ప్రాంతంలో నిర్వహించారు. ఇప్పుడు.. ఆలయాన్ని సైతం అంతే దీటుగా నిర్మించాలని భావిస్తున్నారు. ఇప్పటికే.. ఇందుకు కార్యచరణ పూర్తికాగా, నిర్మాణ పనుల్ని వేగవంతం చేయడమే తరువాయి అంటున్నారు అధికారులు.
ఏపీ రాజధానిలో బ్రాండ్ టెంపుల్ గా తిరుమల శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం రూ.185 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధం కాగా.. ఇప్పటికే ఆలయానికి సంబంధించిన ఇంజినీరింగ్ డ్రాయింగులు పూర్తయ్యాయి. రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన రాజధాని ప్రాంతంలో నిర్మించే ఆలయం కావడంతో ఆలయం చుట్టూ భారీ ప్రాకారం, ప్రధాన ముఖద్వారం దగ్గర 7 అంతస్తులుతో మహారాజ గోపురం.. మిగతా మూడు దిక్కుల్లో ఐదు అంతస్తులతో గోపురాలు నిర్మించనున్నారు.
తిరుమల శ్రీవారి రోజు మాఢవీధుల్లో విహరించినట్లుగానే.. అమరావతిలోని ఆలయంలోనూ మాడ వీధులు, పుష్కరిణి నిర్మించాలని నిర్ణయించారు. అలాగే.. పూజా విధానాలలోనూ తిరుమల ఆచారాలనే కొనసాగించేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. స్వామి వారికి నిత్య కైంకర్యాలు, ప్రముఖ రోజుల్లో నిర్వహించే పూజల విషయంలో టీటీడీ పద్ధతుల్ని అనుసరించనుంది.
జగన్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిలిచిపోయిన అమరావతి రాజధాని నిర్మాణ పనుల్ని.. కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించనుంది. ఈ పనులతో పాటుగానే వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని రూపొందించాలని భావిస్తున్నారు. ఇప్పటికే.. ఆలయ నిర్మాణ ప్రణాళికల్ని సీఎం చంద్రబాబుకు వివరించగా..ఆయన ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు. దాంతో.. మంచి ముహుర్తం చూసుకుని ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించడమే తరువాయి అంటున్నారు.
చంద్రబాబు తొలిసారి సీఎంగా ఉన్న సమయంలోనే అమరావతిలో టీటీడీ ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చింది. అప్పుడు ప్రభుత్వం సైతం 25 ఎకరాల్ని కేటాయించి, పనులు ప్రారంభించేందుకు సహకరించింది. రూ. 150 కోట్ల అంచనా వ్యయంతో తిరుమల ఆలయం మాదిరిగా గుడిని నిర్మించేందుకు పనుల్ని ప్రారంభించారు. ప్రణాళికలు సిద్ధమై పనులు ప్రారంభించిన కొన్నాళ్లకే.. రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది.
Also Read : Tirumala News: వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. శ్రీవారి సేవల టికెట్లు విడుదల
ప్రభుత్వం మారిపోవడంతోనే అమరావతిలోని ఆలయ నిర్మాణానికి బ్రేకులు పడ్డాయి. అంతుకు ముందు రూ.150 కోట్ల అంచనా వ్యయాన్ని కాస్త.. రూ.36 కోట్లకు కుదించారు. ప్రధాన ఆలయం, లోపాలి ప్రాకారం, ఒక రాజగోపురం, ధ్వజస్తంభ మండపాలు మాత్రమే నిర్మించి, పూర్తి నిర్మాణ ప్రణాళికల్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు తిరిగి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం.. జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ సైతం హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడుతున్న సందర్భంలో ఏడేళ్ల నాటి ఆలయ ప్రణాళికల్ని అమలు చేసేందుకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నారు.