Asha Kiran Ranga: దివంగత ప్రజానేత వంగవీటి మోహన రంగా కుమార్తె ఆశా కిరణ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చకు తెరలేపారు. విశాఖలో నిర్వహించిన ‘రంగా నాడు’ పేరుతో జరిగిన భారీ బహిరంగ సభలో.. ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. రంగా 37వ వర్ధంతి సందర్భంగా జరిగిన ఈ సభలో, తన తండ్రి ఆశయాలను కొనసాగించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆశా కిరణ్ స్పష్టం చేశారు.
ప్రసంగంలో ఆమె అన్ని ప్రధాన రాజకీయ పార్టీలను ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రంగా ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతారు. కానీ రంగా కోసం మీరు ఏం చేశారు? అంటూ వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలను నిలదీశారు. రంగా పేరును రాజకీయ లబ్ధికి మాత్రమే వాడుకుంటున్నారని, కానీ ఆయన ఆశయాలను అమలు చేసే ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాకు రంగా పేరు ఎప్పుడు పెడతారు? అని ప్రశ్నిస్తూ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.
వంగవీటి రంగా అంటే పేదల పక్షపాతి అని గుర్తు చేసిన ఆశా కిరణ్, రోజూ అనేక మంది ప్రజలు సహాయం కోసం ఆయన వద్దకు వచ్చేవారని చెప్పారు. అలాంటి ప్రజానేతను హత్య చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చీకటి అధ్యాయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రంగా ఆశయాలు పేదలకు ఇల్లు, ఉచిత విద్య, వైద్యం, మహిళలకు రాజకీయ ప్రాధాన్యత, బడుగు బలహీన వర్గాలకు గౌరవం ఇవన్నీ నేటికీ సమాజానికి అవసరమైన లక్ష్యాలేనని ఆమె పేర్కొన్నారు.
విశాఖలో జరిగిన సభను అడ్డుకునేందుకు కొన్ని అరాచక శక్తులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. ఆటంకాలు సృష్టించాయని ఆశా కిరణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు ప్రజలు రాకుండా భయపెట్టే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. మూడు సార్లు సభా స్థలాన్ని మార్చాల్సి వచ్చిందని, అయినప్పటికీ రంగా మీద అభిమానంతో పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారని అన్నారు. ఇది రంగా ప్రజల్లో ఎంత బలంగా ఉన్నారనే దానికి నిదర్శనమని ఆమె చెప్పారు.
మేము ఎవరికీ భయపడే వాళ్లం కాదు. రంగా రక్తం మా నరాల్లో ఉంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలకు సభా ప్రాంగణం హోరెత్తింది. అధికార అడ్డంకులు తమను ఆపలేవని, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. రంగా ఆలోచనలను అణచివేయాలనుకునే శక్తులకు ఇది స్పష్టమైన సమాధానమని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా రాధా రంగా మిత్ర మండలికి మళ్లీ ఊపిరి పోస్తామని, రాష్ట్రమంతా పర్యటించి రంగా లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆశా కిరణ్ ప్రకటించారు. త్వరలోనే ఏపీ వ్యాప్తంగా పర్యటన ప్రారంభిస్తానని వెల్లడించారు. రంగా ఆశయాలే తమ రాజకీయ, సామాజిక కార్యాచరణకు మార్గదర్శకమని చెప్పారు.
Also Read: పవన్ కళ్యాణ్ పై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
ప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తిగత లాభాల కోసం కాకుండా, ప్రజల కోసం పోరాడే నాయకత్వం అవసరమని ఆశా కిరణ్ అభిప్రాయపడ్డారు. రంగా పేరు చెప్పుకుంటూ రాజకీయాలు చేయడం కాదు, ఆయన ఆశయాలను అమలు చేయడమే నిజమైన నివాళి అని అన్నారు. ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించాలని, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.