Vellampalli Srinivas: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను కళ్ళకు కట్టినట్టు వివరిస్తూ.. ఇది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు.
రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. గంటల తరబడి, కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో ప్రజలు వేచి చూడాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని, దీనికి కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మండిపడ్డారు. కేవలం ‘సంపద సృష్టి’ అనే ముసుగులో పెట్రోల్, డీజిల్ను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని వెల్లంపల్లి తీవ్ర ఆరోపణలు చేశారు.
రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని, పంట కోతలు కోసే సమయంలో డీజిల్ దొరకక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విచిత్రమేమిటంటే, ఒకవైపు ప్రజలు అల్లాడుతుంటే, సివిల్ సప్లైస్ కమిషనర్ మాత్రం అసలు కొరతే లేదని చెప్పడం హాస్యాస్పదమని, ఆ మాటలు చెప్పడానికి సిగ్గుండాలని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నామని చెప్పుకునే టీడీపీ నేతలు, ఈ సంక్షోభంపై ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు.
ఇక నారా లోకేష్ ఎక్కడ ఉన్నారంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు. ‘వారం రోజులుగా లోకేష్ కనిపించడం లేదు. ఆయన దోచుకున్నది దాచుకోవడానికి వెళ్లారా లేక విహార యాత్రలకు వెళ్లారా?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డీలర్లతో ప్రభుత్వం కుమ్మక్కు కావడం వల్లే ఈ కృత్రిమ కొరత సృష్టించారని ఆయన ఆరోపించారు. ప్రజల ఇబ్బందులతో ఆడుకుంటున్న ఈ మూడు పార్టీల కూటమి భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా, వెంటనే స్పందించి రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరాను పునరుద్ధరించాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు.
Also Read:కేటీఆర్కు కవిత ‘రేగు కంప’.. మందుల సామెల్ సంచలన వ్యాఖ్యలు!