Visakha: విశాఖ సిటీలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో పేలిన గ్యాస్ బండ దుర్ఘటనపై లోతుగా దర్యాప్తు జరుగుతోంది. పేలుడు వెనుక గ్యాస్ బండ కారణం కాదని తెలుస్తోంది. అయితే ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సముద్రంలో మత్స్యకారులకు దొరికిన ఓ వస్తువుని కట్ చేస్తుండగా ప్రమాదం జరిగిందట. దీనిపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.
విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలో గురువారం సాయంత్రం ఓ వెల్డింగ్ షాపులో భారీపేలుడు సంభవించింది.ఈ ఘటనలో స్పాట్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. బుక్కా వీధిలో బీచ్ రోడ్డును సమీపంలో గణేష్ కుమార్ వెల్డింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. వేటకు వెళ్లి వచ్చిన బోట్లు దెబ్బ తింటే వాటి విడి భాగాలకు మరమ్మతులు చేస్తుంటాడు.
ఆ షాపులో గణేష్తోపాటు శ్రీను, ఎల్లాజీ, ముత్యాలు, సన్యాసిరావుతోపాటు మరో ముగ్గురు పని చేస్తున్నారు. వెల్డింగ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు చోటు చేసుకుంది. పేలుడు ధాటికి వెల్డింగ్ షాప్ తునాతునకలై పోయింది. పక్కనున్న రెండు షాపులు దెబ్బతిన్నాయి. షాప్ యజమాని గణేష్ కుమార్, శ్రీను కాలిపోవడంతో స్పాట్లో మృతిచెందారు. ఎల్లాజీ దాదాపు 90 శాతం కాలిపోయాడు.
ముత్యాలు కాలు విరిగిపోయి వేరొక చోట పడగా, ముఖం, ఛాతీ, చేతులు కాలిపోయాయి.కేజీహెచ్లో చికిత్స అందిస్తుండగా ముత్యాలు ప్రాణాలు కోల్పోయాడు. ఈ స్థాయి ఘటన వెనుక అసలు ఏం జరిగింది? అన్నదే అసలు ప్రశ్న. ప్రమాదానికి గ్యాస్ సిలిండర్ పేలుడు కారణం కాదని అంటున్నారు.
ALSO READ: పులివెందులలో హై టెన్షన్.. సునీత సంచలన వ్యాఖ్యలు
రీసెంట్గా సముద్రంలో కొంతమంది మత్స్యకారులు వేటకు వెళ్లారు. వారికి దొరికిన వస్తువు కట్ చేస్తుండగా పేలుడు సంభవించిందన్నది స్థానికుల మాట. పేలుడు జరిగినప్పుడు భారీ శబ్దం వచ్చిందని, గ్యాస్ సిలిండర్ పేలితే ఆ స్థాయి శబ్దం రాదని అంటున్నారు. కేజీహెచ్ సమీపంలోని ప్రాంతాల వరకు పేలుడు శబ్దం వినిపించిందని అంటున్నారు.
రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్ టీంలతో కలిసి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. చాలా శాంపిల్స్ని సేకరించింది స్పెషల్ టీమ్. దాదాపు 20కు పైగానే శాంపిళ్లను ల్యాబ్కు పంపించిందని తెలుస్తోంది. మృతుల శరీరంలో ఇతర కెమికల్స్ ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో గ్యాస్ బండ పేలుడికి సంబంధించి ఆధారాలు కనిపించలేదని అంటున్నారు స్థానికులు.
పేలుడు సంభవించినా మంటలు అంటుకున్న ఛాయలు లేవంటున్నారు. జాలర్లకు దొరికిన వస్తువు ఏంటి? ఎవరికి దొరికింది? ఈ విషయం పోలీసులకు ఎందుకు చెప్పలేదు? దాని కారణంగా ఈ ఘటన జరిగిందా? పోలీసులైతే స్థానికుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా దర్యాప్తులో నిమగ్నమయ్యారు. ల్యాబ్ నుంచి నివేదిక వచ్చిన తర్వాత కారణమేంటన్నది తెలియాల్సివుంది.