ఏపీ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. మొత్తానికి వారికంటూ ఓ రాజధాని ఫిక్సయింది. కూటమి సర్కార్ పుణ్యమా అని ఇప్పుడు ఎవరైనా మీ రాజధాని ఏంటని అడిగితే వారు ‘అమరావతి’ అని గుండెల మీద చేయి వేసుకుని మరి చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది.కానీ, ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయాక హైదరాబాద్ రాజధాని తెలంగాణకు వెళ్లిపోయింది. దీంతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిలిగింది. ఆ తర్వాత ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో మధ్యలో రాజధాని ఉండేలా ప్లాన్ చేసి అమరావతిని సూచించింది. నిర్మాణాలు కూడా చేపట్టింది. చంద్రబాబు ఉన్నంతవరకు తమ రాజధాని అమరావతి అని చెప్పుకున్న ప్రజలకు ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు.
చంద్రబాబు టర్మ్ ముగియగానే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో విచిత్రపరిస్థితులను తీసుకువచ్చింది. గత ప్రభుత్వం నిర్ణయించిన అమరావతిని రాజధానిగా కొనసాగించేందుకు జగన్ సర్కార్ ఇష్టపడలేదు. ఫలితంగా రాజధాని అమరావతి మీద రూపాయి ఖర్చు చేసేందుకు వెనుకాడింది. ఒకే దగ్గర పెట్టుబడి పెట్టడం కరెక్టు కాదని.. మూడు రాజధానుల అంశాన్ని జగన్ తెరమీదకు తెచ్చారు. ఆ తర్వాత అమరావతిని పెద్దగా పట్టించుకోలేదు. కేవలం తాత్కాలిక అసెంబ్లీ, హైకోర్టు, కొన్ని భవన నిర్మాణాలు మాత్రమే పాలన కోసం వినియోగించారు.విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించిన జగన్.. అక్కడి నుంచే పాలన కొనసాగించారు. కేవలం అసెంబ్లీ సెషన్స్ కోసం మాత్రం అమరావతికి వచ్చేవారు.దాంతో ఏపీ రాజధాని ఏంటో కూడా ప్రజలు చెప్పుకోలేకపోయారు.
ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలో ఉన్నందున రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేశారు. ఎన్డీయేలో ఆయన కీలక భాగస్వామి అయినందున కేంద్రంతో మాట్లాడి పార్లమెంటులో బిల్లుకు ఆమోదం పొందగలిగారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ నిన్న రాష్ట్రపతి కార్యాలయం గెజిట్ నోట్ రిలీజ్ చేయడంతో ఇక ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి నిలవనుంది. మరల ఏ ప్రభుత్వం కొలువుదీరిన కేంద్రం దృష్టిలో మాత్రం అమరావతే ఏపీ రాజధాని..రాజధాని అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వాలంటే వాటిని అమరావతిలోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొత్తానికి రాజధాని రైతులు కోరుకున్నది జరిగింది. రాజధాని అక్కడే రూపుదిద్దుకోనుంది.
ఇండియాలో స్విట్జర్లాండ్ను తలపించే.. 5 రైలు ప్రయాణాలు, సిద్ధమైపోండి మరి
ఇప్పుడు వారికి ఏం కావాలనే అంశం తెరమీదకు వచ్చింది. ఇంతకాలం అమరావతి వేదికగానే రాజధాని కావాలని వారు డిమాండ్ చేశారు. అక్కడి రైతులు సైతం ఉద్యమించారు. ఎందుకంటే వారంతా రాజధాని కోసం భూములు ఇచ్చారు. ఏడాదికి మూడు పంటలు పండే భూములు ఇవ్వడంతో వారికి సర్కారు నుంచి ఇంకా పరిహారం రాలేదు. అందుకే వారు పోరాటాల బాటపట్టారు. ఇప్పుడు వారు సర్కారు నుంచి పరిహారం ఆశిస్తున్నారు. భూమికి బదులు భూమి, పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని నాడు తెలుగుదేశం పార్టీ అమరావతి కోసం భూములు ఇచ్చిన వారికి హామీ ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా మరో 50వేల ఎకరాలు ల్యాండ్ పూల్ చేయాలని సర్కారు భావిస్తున్నది. గతంలో సేకరించిన భూమికి పరిహారం ముందు చెల్లించాకే భూముల జోలికి రావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరి సర్కారు మదిలో ఏముంది? ఏం చేయనుందో తెలియాలంటే వేచిచూడాల్సిందే.