Shyamala on Chiranjeevi: బ్రహ్మా ఆనందం సినిమా రిలీజ్ సంధర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ పై విమర్శలు వినిపిస్తుండగా, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కూడ స్పందించారు. సినిమా రిలీజ్ వేడుకలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ.. తన ఇంట్లో తాను లేడీస్ హాస్టల్ వార్డెన్ ఉన్నట్లుగా ఉంటుందని, నెక్స్ట్ తన వారసత్వాన్ని కొనసాగించేందుకు రామ్ చరణ్ మగబిడ్డను ఇవ్వాలని అన్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. పలువురు మహిళా సంఘాల నేతలు.. మెగాస్టార్ ఇలాంటి కామెంట్స్ చేయకుండ ఉండాల్సిందని అభిప్రాయ పడుతున్నారు. వారసత్వంను కుమార్తెలు కూడ కొనసాగిస్తారని వెంటనే, తన కామెంట్స్ ను మెగాస్టార్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా మెగాస్టార్ చేసిన కామెంట్స్ పై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కూడ స్పందించారు. శ్యామల మాట్లాడుతూ.. వారసుడు కొడుకే అవుతాడా.. కూతుర్లు కారా.. అంటూ ప్రశ్నించారు. మెగాస్టార్ చిరంజీవి ఏ ఉద్దేశ్యంతో అన్నారో తనకు తెలియదని ఇలాంటి కామెంట్స్ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాయో తెలీదా అంటూ స్పందించారు. వారసుడు అనేవాళ్ళు కొడుకు అనే ఉద్దేశ్యంలో నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది.. అప్పుడే మహిళలు అభివృద్ధి చెంది ముందుకు వెళ్తున్నారన్నారు. మెగా ఇంటి కోడలిగా ఉపాసన అన్నీ చక్కగా నడుపుతున్నారని, అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారన్నారు.
వారసులు అంటే ఒక్క కొడుకే కానక్కరలేదనేది తన వ్యక్తిగత అభిప్రాయంగా శ్యామల అన్నారు. అలాగే లైలా మూవీ రిలీజ్ సంధర్భంగా నటుడు పృథ్వీ రాజ్ చేసిన కామెంట్స్ పై కూడ శ్యామల స్పందించారు. ఒక్కరి వ్యాఖ్యల వల్ల సినిమా పరిశ్రమ దెబ్బతినకూడదని, పృథ్వీ వ్యాఖ్యల వల్ల కొందరికి కోపం వచ్చింది.. సినిమా చూడం అంటున్నారు.. దానివల్ల నిర్మాతకు నష్టం కలుగుతుందన్నారు. ఏపీలో మహిళలకు రక్షణ కరువైందని, రోజురోజుకు ఆడపిల్లలపై దాడులు, మహిళలను వేధించే ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
Also Read: బర్డ్ ఫ్లూ కల్లోలం.. మరి గుడ్డు తినొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
విద్యార్ధులకు ఇచ్చే పథకాలు ఆపేసి వారి జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందన్నారు. గతంలో మద్యంపై వచ్చే ఆదాయం ప్రభుత్వానికి వచ్చేదని, ఇప్పుడు ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారని శ్యామల విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండేవారని, ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ మోసపోయాం అంటూ ప్రజలు నిట్టూరుస్తున్నారన్నారు. ఏపీ అభివృద్ధి జగన్ తోనే సాధ్యమవుతుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన శ్యామల పలు చిత్రాలలో నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి అనతి కాలంలోనే వైసీపీలో అధికార ప్రతినిధిగా ఎంపికయ్యారు. మెగాస్టార్ కామెంట్స్ పై శ్యామల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.