YCP Social Media Activist: వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్లు పెట్టిన అశోక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం నిజామాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని మంగళగిరి తరలించి.. కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించి.. గుంటూరు జైలుకు తరలించారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాల్లోని ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టింగులు పెట్టాడు అశోక్. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్పై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టాడు.
ఏపీలో సోషల్ మీడియా వ్యవహారం పొలిటికల్గా అగ్గిరాజేస్తోంది. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. తప్పుడు రాతలు రాసేది ఎంతటివారైనా ఉపేక్షించబోమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు.. పెద్దిరెడ్డి సుధారాణి, హరికృష్ణారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు.
గతంలో పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ మీద.. తొడగొట్టి మీసం మెలేసిన కేసులో హరికృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో తనపై చేయి చేసుకున్నారని కోర్టు ముందు పెద్దిరెడ్డి సుధారాణి చెప్పారు. తమపై ఒంగోలు పోలీసులు దురుసుగా వ్యవహరించినట్టు ఆమె న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఇద్దరికీ 14 రోజుల పాటు రిమాండ్ విధించగా.. వైద్య పరీక్షలు చేసి.. అనంతరం జిల్లా జైలుకు తరలించారు.
Also Read: బోరుగడ్డ అనిల్ చాప్టర్ క్లోజేనా..?
వైసీపీ సోషల్ యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డికి ఉచ్చు బిగుస్తుంది. ఇప్పటికే పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై.. ఆదివారం నాడు మరో కేసు నమోదైంది. పులివెందులలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు బాధితులు. కర్నూల్ డీటీసీలో వర్రా విచారణ జరుగుతుంది. రేపు అమరావతి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో వర్రాను చంపుతారని బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. తన భర్తను పావుగా వాడుకుంటున్నారని వర్రా సతీమణి ఆరోపిస్తుంది. ప్రభుత్వ పెద్దలతో తన భర్తకు హాని ఉందంటూ ఆరోపిస్తుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు వర్రా రవీంద్రారెడ్డి చుట్టు తిరుగుతున్నాయి. సోషల్ మీడియా ప్రతినిధులు చాలామందే అరెస్ట్ అవుతున్నా ఒక్క వర్రాపైనే చాలామంది ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా జగన్, అవినాష్ రెడ్డి వర్రాపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. వర్రా నోరు విప్పితే జగన్, అవినాష్ రెడ్డికి ముప్పు ఉంటుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
మరోవైపు YCPకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్లకు సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా సైకోలు అంటూ సంభోదించి ఎవ్వరినీ వదలే ప్రసక్తే లేదన్నారు. ఆడబిడ్డలపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే వ్యక్తులకు తగిన శాస్తి చేస్తామని చంద్రబాబు నేరుగానే వార్నింగ్ ఇచ్చారు. అభివృద్ధి కోసం తాము ముందుకు సాగుతుంటే.. తమపై సోషల్ మీడియా కేంద్రంగా విషం కక్కుతున్నారన్నారు. ప్రపంచంలో ఉండే చట్టాలను అధ్యయనం చేసి.. ప్రజాస్వామ్యబద్దంగానే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.