ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నేడు కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని లోక్ భవన్ పరిసరాల్లో భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు సమర్పించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునివ్వడంతో.. రాష్ట్రం నలుమూలల నుండి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, నాయకులు విజయవాడకు తరలివచ్చారు. కార్యకర్తల తాకిడి పెరగడంతో పోలీసులు లోక్ భవన్ పరిసరాల్లో ముందస్తుగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బారికేడ్లు నిర్మించి, అదనపు బలగాలను రంగంలోకి దించారు. లోక్ భవన్ వైపు వచ్చే రహదారులన్నీ జనసంద్రంగా మారాయి.
వైసీపీ శ్రేణుల నిరసనల మధ్య వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజ్భవన్కు చేరుకుని గవర్నర్ను కలిశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందని.. సామాన్యులకు వైద్య సేవలు భారం అవుతాయని ఆయన గవర్నర్కు వివరించారు. ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల ప్రతులను ఈ సందర్భంగా గవర్నర్కు అందజేసి, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని వైసీపీ నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలను నియంత్రించడం పోలీసులకు సవాలుగా మారింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లోక్ భవన్ ప్రాంతంలో ఆంక్షలు కఠినతరం చేశారు.
ALSO READ: Ibomma Ravi: తీగ లాగితే డొంక కదిలింది, ఐ బొమ్మ రవి కేసులో దిమ్మతిరిగే నిజాలు