YS Sharmila Files Nomination from Kadapa Lok Sabha Seat in Ap Election 2024: ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో కడప అసెంబ్లీలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. 2009 వరకు టీడీపీ, కాంగ్రెస్లు, 2014 నుంచి 2019 వరకు వైసీపీ, టీడీపీలు మధ్య నువ్వా నేనా అని తలపడుతూ వస్తున్న కడపలో ఈసారి త్రిముఖ పోరు జరగనుంది. రాష్ట్ర విభజన పరిణామాలతో తుడిచిపెట్టుకుపోయినట్లు కనిపించిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల పీసీసీ ప్రెసిడెంట్ పగ్గాలు చేపట్టడంతో పుంజుకుంటుంది. ఆమె స్వయంగా కడప ఎంపీ అభ్యర్ధిగా పోటీకి దిగి కడప సహా జిల్లాలోని పలు సెగ్మెంట్లలో బలమైన అభ్యర్ధులను బరిలోకి దింపడంతో రాజకీయ సమీకరణలు మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
కడప పార్లమెంటు స్థానం నుంచి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీలో ఉండటంతో ఈ ఎన్నికల్ల ఆమె ప్రభావం గణనీయంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో కడప అసెంబ్లీ స్థానం నుంచి మంచి పట్టున్న అభ్యర్థిని నిలబెడితే కాంగ్రెస్ నుంచి వైసీపీ వైపు మళ్ళీన ఓట్లతో పాటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంత తమవైపు తిప్పుకోవచ్చని.. వ్యూహాత్మకంగా పావులు కదిపిన కాంగ్రెస్ పార్టీ పావులు కదిపి సక్సెస్ అయింది.
కడప అసెంబ్లీ సెగ్మెంట్లో గెలుపోటములను శాసించేది ముస్లీం ఓటు బ్యాంకే అందుకే రెండు దశాబ్దాలుగా అక్కడ అన్ని ప్రధాన పార్టీలు ముస్లీం అభ్యర్ధులకే టికెట్ ఇస్తూ వచ్చాయి. ఈ సారి కూడా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే , డిప్యూటీ సీఎం అంజాద్ బాషాని రంగంలోకి దించింది. టీడీపీ ఈ సారి ఆ ఆనవాయితీని పక్కనపెట్టి రెడ్డప్పగారి మాధవిరెడ్డికి టికెట్ ఇచ్చింది ఆ క్రమంలో కాంగ్రెస్ స్థానికంగా ముస్లీంలలో మంచి పట్టున్న సీనియర్ నేత అఫ్జల్ఖాన్ను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చింది. పార్టీలో చేరగానే టికెట్ దక్కించుకున్న అఫ్జల్ ఎంపీగా షర్మిల, ఎమ్మెల్యేగా తాను గెలవడం ఖాయమంటున్నారు.
Also Read: ఆర్డర్.. ఆర్డర్.. కడప భగభగ
అఫ్జల్ఖాన్ 2009లో పీఆర్చీతరపున పోటీ చేసి కడపలో 13,989 ఓట్లు సాధించారు. అంటే 10.24 శాతం ఓట్లు ఆయన దక్కించుకున్నారు. ఆ తర్వాత కొంత కాలానికి వైసీపీకి దగ్గరైన ఆయన కొన్ని సంవత్సరాలుగా వైసీపీలో క్రియాశీలకంగా ఉంటూ వచ్చారు. గత ఎన్నికల్లో అంజాద్ బాషా విజయంలో కీలకంగా వ్యవహరించారు. అయితే అంజాద్ బాషా గెలిచిన తర్వాత వ్యవహరిస్తున్న తీరు నచ్చక ఆయనకు ఈ సారి టికెట్ ఇవ్వకూడదని వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయినా అంజాద్కే టికెట్ దక్కడంతో వైసీపీకి దూరమయ్యారు. తాజాగా షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కడప ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని వైసీపీ ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
వైఎస్ షర్మిల కడప ఎంపీ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన రోజే అఫ్జల్ఖాన్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అఫ్జల్ఖాన్ చేరికతో కడప ఎంపీ స్థానంతో పాటు అసెంబ్లీ సెగ్మెంట్లో సైతం త్రిముఖ పోటీ జరగనుంది. కడప జిల్లాలోని పది అసెంబ్లీ సెగ్మెంట్లలో రాజంపేట, కమలాపురం మినహా మిగిలిన అన్ని చోట్లు కాంగ్రెస్ బలమైన అభ్యర్థులనే బరిలో దింపింది. దాంతో కాంగ్రెస్ చీల్చుకునే ఓట్లతో వైసీపీ ఓటుబ్యాంకుకు గండి పడే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కడప అసెంబ్లీ స్థానంలో అఫ్జల్ ఖాన్ మైనార్టీ ఓట్లు చీలిస్తే వైసీపీకి డ్యామేజ్ తప్పదంటున్నారు. అలాంగే కాంగ్రెస్ చీల్చే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో టీడీపీకి కూడా నష్టం తప్పదని అంచనా వేస్తున్నారు. మరి చూడాలి కడప ఓటర్లు ఎవరికి పట్టం కడతారో?