YS Sharmila latest speech(Andhra politics news): రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ, కేంద్ర అధికార పార్టీ బీజేపీపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను మరచి ఏపీ ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు.
రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ఇస్తామన్న ప్రత్యేక హోదాను సాధించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని వైఎస్ షర్మిల అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, వైసీపీలు కుమ్మక్కై రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శింగనమల నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.
ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ, టీడీపీలు ప్రత్యేక హోదాను ఓ అస్త్రంగా చేసుకుని వాడుకుంటున్నాయని అన్నారు. అంతే కానీ, ఈ రెండు పార్టీలకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదన్నారు. ఈ రెండు పార్టీలు వారి లబ్ధి కోసమే తప్ప.. హోదాను సాధించడం కోసం ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపించారు.
ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి గుండెకాయ లాంటిదని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. దాన్ని ప్రజలే తమ ఓటు హక్కుతో సాధించుకోవాలన్నారు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఓటు అనే ఆయుధాన్ని.. ఎన్నికల్లో ఆలోచించి వినియోగించాలని సూచించారు.
Also Read: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ.. టీడీపీ నేతల్లో ఉత్కంఠ!
వైసీపీ, బీజేపీలు రాష్ట్రానికి గుండెకాయ లేకుండా చేశారని అన్నారు. అధికారంలోకి రాకముందు జగన్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో లిక్కర్, భూ మాఫియా దందా నడుస్తోందని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, రాజధాని నిర్మాణం పూర్తి కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని వైఎస్ షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు.