వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ రేంజులో వెలుగువెలిగిన నేతలంతా ప్రస్తుతం నానా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తున్నది. ఒకప్పుడు వారు చేసే పనులకు అడ్డు చెప్పేవారే లేరు. అధికార బలం అండగా ఉండటంతో ఇష్టానుసారంగా వ్యవహరించారని వారికి పేరుంది. తీరా అధికారం పోయాక కేసులు వెంటాడుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కాలం వెల్లదీస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన రైట్ హ్యాండ్గా పేరొందిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, తన పోలీసు వృత్తికి రాజీనామా చేసి వైసీపీ గుర్తుపై గెలిచిన గోరంట్ల మాధవ్ ప్రస్తుతం చిక్కుల్లో పడినట్టు తెలుస్తున్నది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి.. ఆయన ఎంత చెబితే పార్టీలో అంత అనేలా ఉండేది. సీఎం జగన్ తర్వాత ఆయనదే నడిచేది. టికెట్ల విషయంలోనూ, టెండర్లు, ప్రాజెక్టులు, పథకాల అమలు వంటివి ఆయనే దగ్గరుండి చూసుకునేవారని పేరుంది. అయితే, 2019 నుంచి 2024 వరకు ఏపీలో కొత్తగా మద్యం పాలసీని తెచ్చారు. గతంలో టీడీపీ హయాంలో ఉన్న మద్యం పాలసీని రద్దు చేసి.. తెచ్చిన పాలసీలో స్కాం జరిగిందని ఈడీ గుర్తించింది. అందులో విజయసాయిరెడ్డి పేరుతో పాటు మరికొందరి పేర్లు వచ్చాయి. మద్యం సరఫరా దారులు, డిస్టిలరీ నుంచి ఆయన భారీగా ముడుపులు తీసుకుని విదేశాలకు ఆ డబ్బును తరలించినట్టు ఈడీ గుర్తించింది. మనీ లాండరింగ్ కేసులో ఆయనపై అభియోగాలు వచ్చాయి. దీంతో విచారణకు రావాలని ఈడీ ఆయనకు తాజాగా నోటీసులు పంపింది.
వైసీపీ హయాంలో ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్.. ఆయన ఆడిందే ఆట పాడిందే పాటగా నడిచింది. ఎంపీగా ఆయన చేసి అభివృద్ధి శూన్యమని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. కానీ, ఆయన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని ఆయనపై చాలా ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఓ మహిళతో న్యూడ్ వీడియోకాల్ మాట్లాడిన విజువల్స్ బయటకు రావడంతో పెద్దఎత్తున మహిళా సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి తోడు అత్యాచారానికి గరైన ఓ మైనర్ బాలిక పేరును రివీల్ చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుతో విజయవాడ కోర్టు ఆయన్నువిచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇవ్వగా.. పలుమార్లు గైర్హాజరవ్వడంతో తాజాగా ఆయన మీద నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.
వీరిద్దరితో పాటు మరికొందరు వైసీపీ నేతల మీద నమోదైన కేసుల విచారణలు జరుగుతున్నాయి. పవర్ ఉంది కదా అని విచ్చలవిడిగా విర్రవీగితే కాలం అన్నింటికీ సమాధానం చెబుతుందని పలువురు విమర్శిస్తున్నారు. ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకోని అడ్డగోలుగా అవినీతికి, అక్రమాలకు వైసీపీ నేతలు, అప్పటి మంత్రులు పాల్పడ్డారని.. ప్రస్తుతం తగిన శిక్ష అనుభవిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు విమర్శలు చేస్తున్నారు. జగన్ సైతం త్వరలోనే సీబీఐ విచారణకు హాజరవ్వాల్సి ఉంటుందని కూటమి నేతలు జోస్యం చెబుతున్నారు. వాళ్లు చేసిన పాపానికి తగిన శిక్ష అనుభవించి తీరాల్సిందేనని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. నాడు తగ్గేదెలే అన్న వారంతా ఇప్పుడు తగ్గుతామని వేడుకుంటున్నా కూటమి సర్కార్లో చట్టం తన పనిని తాను చేసుకుని పోతుందని పలువురు నేతలు పేర్కొంటున్నారు.