AP Govt’s Green Initiative: పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఆంధ్రా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ-సైకిళ్లను సబ్సిడీ మీద అందించాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయడమే కాకుండా పర్యావరణాన్ని కూడా కాపాడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయకుడు ఈ పథకాన్ని ప్రారంభించారు.
రీసెంట్ గా కుప్పం నియోజకవర్గంలో ఈ పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఒకేసారి 5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా మధ్యతరగతి, చిన్న వ్యాపారులు, ఉద్యోగులకు ఈ సైకిళ్లు ఎంతో ఉపయోగపడుతాయని వెల్లడించారు.
నిజానికి ఈ-సైకిల్ అసలు ధర సుమారు రూ.35,000 ఉంటుంది. అయితే ప్రభుత్వం రూ. 11,000 వరకు సబ్సిడీ అందిస్తోంది. ఆ తర్వాత లబ్ధిదారుడు చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ. 24,000 వరకు తగ్గుతుంది. ఈ మొత్తాన్ని కూడా ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం రూ. 5,000 డౌన్ పేమెంట్ చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ లోన్ ద్వారా 24 నెలల వరకు EMI రూపంలో చెల్లించే అవకాశం ఉంది.
ఇక ఈ-సైకిల్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇది ఆధునిక టెక్నాలజీతో తయారు చేశారు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 40 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈ సైకిల్ గరిష్ట వేగం గంటకు 30 కిలోమీటర్లు ఉంటుంది. బ్యాటరీని సులభంగా తీసి ఇంట్లోనే ఛార్జ్ చేసుకునే సౌకర్యం ఉంది. ఫుల్ ఛార్జ్ కావడానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. అంతేకాదు, స్పీడ్, దూరం, బ్యాటరీ లెవెల్ లాంటి వివరాలను చూపించే డిజిటల్ మీటర్ కూడా ఉంటుంది. ఒకవేళ బ్యాటరీ అయిపోతే, సాధారణ సైకిల్ లా తొక్కుకుంటూ వెళ్లే అవకాశం ఉంటుంది.
ఈ పథకానికి డ్వాక్రా మహిళలు, చిన్న వ్యాపారులు, ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు అర్హులు. రోజువారీ పనుల కోసం ప్రయాణం చేసే గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. దరఖాస్తు ప్రక్రియ కూడా సింఫుల్ గా ఉంటుంది. ఇందుకోసం ముందుగా సమీపంలోని గ్రామ లేదంటే వార్డు సచివాలయంలో లేదంటే DRDA కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ ఈ-సైకిల్ పథకం కోసం అప్లికేషన్ ఫారం తీసుకుని, వివరాలు నింపాలి. ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ పాస్ బుక్ కాపీలను అప్లికేషన్ తో యాడ్ చేయాలి. అప్లికేషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత రూ. 5,000 డౌన్ పేమెంట్ చెల్లించాలి. మిగిలిన మొత్తానికి బ్యాంక్ ద్వారా EMI సౌకర్యం కల్పిస్తారు.
Read Also: స్మార్ట్ టెక్నాలజీతో కారు కవర్, ఇక మీ వెహికల్ భద్రతకు ఢోకా లేదు!