Bajaj Electric Bike: బాజాజ్ ఆటో తన ఈవీ (EV) బిజినెస్ను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో (FY28) కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ బైక్ ను భారత మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవల జరిగిన Q1 FY27 ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇప్పటికే ‘చేతక్’ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలోకి అడుగుపెట్టిన బాజాజ్.. ఈ విభాగంలో మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో చేతక్ ఒకటిగా నిలిచింది. పెరిగిన డిమాండ్ కు తగినట్లుగా సరఫరా అందించేందుకు ప్రతి నెలా ఉత్పత్తి సామర్థ్యాన్ని 50,000 యూనిట్ల నుండి 60,000 యూనిట్లకు పెంచాలని ఇప్పటికే కంపెనీ నిర్ణయించింది.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో టీవీసీఎస్, హీరో మోటోకార్ప్, ఏథర్ వంటి దిగ్గజాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే ఎలక్ట్రిక్ బైక్స్ విభాగంలో ప్రధాన కంపెనీల ప్రాతినిధ్యం తక్కువగా ఉంటూ వస్తోంది. ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకునేందుకే బజాజ్ తన మొదటి ఈవీ బైక్ను FY28లో తీసుకురావాలని నిర్ణయించింది. కాబట్టి బ్రాండెడ్ కంపెనీల నుంచి మంచి ఎలక్ట్రిక్ బైక్ ను కోరుకునేవారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
Also Read: కంటిలో చిప్ పెడితే.. చూపు వచ్చేస్తుందట.. ఏమన్నా టెక్నాలజీనా!
ఇదిలా ఉంటే ఏప్రిల్ – జూన్ 2026 త్రైమాసికంలో బాజాజ్ ఎగుమతులు ఏకంగా 7 లక్షల మార్కును దాటి కొత్త రికార్డు సృష్టించాయి. ముఖ్యంగా ఆఫ్రికా మార్కెట్లో అమ్మకాలు రెండింతలు కాగా నైజీరియాలో మూడు రెట్లు పెరిగాయి. బజాజ్ ప్రీమియం బైక్స్ విభాగంలోని పల్సర్, అవెంజర్, డోమినార్ అమ్మకాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. కేటీఎమ్ (KTM), ట్రయంఫ్ (Triumph) బ్రాండ్ల ఆదాయం 60% పెరిగింది. కొత్తగా వచ్చిన ట్రయంఫ్ ట్రాకర్ 400, 350 cc పోర్ట్ఫోలియో ఈ ఫలితాలకు ఎంతగానో బూస్టప్ ఇచ్చాయని బజాజ్ ఆటో వర్గాలు తెలిపాయి.
Also Read: రైల్వేలో కొత్త రూల్.. టీసీలకు బాడీ కెమెరాలు.. తప్పు చేస్తే దొరికేస్తారు!