భారత ప్రభుత్వం అంతర్ రాష్ట్ర వాహన బదిలీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రాష్ట్ర RTOకి సమర్పించడానికి వాహనం ప్రస్తుతం నమోదు చేయబడిన రాష్ట్రం నుంచి NOC పొందాలనే రూల్ ను తొలగించే అవకాశం కనిపిస్తోంది. ఈ విధానం ద్వారా అంతర్ రాష్ట్ర వాహన బదిలీల ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ఈ మేరకు నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన ఆర్థికేతర నియంత్రణ సంస్కరణలపై ఉన్నత స్థాయి కమిటీ ఆటో జనరేటెడ్ క్లియరెన్స్ సిస్టమ్ ద్వారా అంతర్ రాష్ట్ర వాహన బదిలీలను ప్రారంభించాలని సిఫార్సు చేసింది.
రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నీతి ఆయోగ్ ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తమ వాహనాలను బదిలీ చేయాలనుకునే వ్యక్తులకు ఈ సంస్కరణ భారీ ఉపశమనం కలిగిస్తుంది. ప్రస్తుతం, అంతర్ రాష్ట్ర వాహన బదిలీలకు ఎటువంటి రోడ్డు పన్నులు, చలాన్లు, ఇతర బకాయిలు లేవని నిర్ధారించుకోవడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరి కావాల్సి ఉంటుంది. దీనిని ఏ రాష్ట్రంలో వాహనాన్ని రిజిష్ట్రేషన్ చేసుకున్నారో అక్కడి RTO ఇవ్వాల్సి ఉంటుంది. వాహన యజమానులు పన్ను రసీదు, రిజిస్ట్రేషన్, ఫిట్ నెస్ సర్టిఫికెట్లను కొత్త RTOకి సమర్పించాలి. వారు పరివాహన్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో లేదంటే RTO కార్యాలయాన్ని స్వయంగా సందర్శించడం ద్వారా NOC కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Also: ఇండియాలో అత్యంత చౌకైన ఆటోమేటిక్ కార్లు, జస్ట్ రూ. 4.75 లక్షల నుంచే..
కొత్త RTO కి NOC సమర్పించిన తర్వాత మాత్రమే కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వాహన సంబంధిత పత్రాలు కేంద్రీకృత వాహన్ డేటా బేస్ లో సురక్షితంగా నిల్వ చేయబడతాయి. తద్వారా NOC హార్డ్ కాపీ అవసరం లేదని నీతి ఆయోగ్ వెల్లడించింది. తాజాగా సిఫార్సులు అమల్లోకి వస్తే, వాహనదారులకు ఇతర రాష్ట్రాలకు వాహనాలను ట్రాన్స్ ఫర్ చేసుకోవడం మరింత సులభంగా మారుతుంది. కేంద్ర రవాణాశాఖ ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేలా చర్యలు చేపడుతుంది.
Read Also: కారు విండోస్ ఓపెన్ చేసి కారు నడిపితే తక్కువ పెట్రోల్ ఖర్చవుతుందా? ఏసీతో నడిపితేనా?