Hidden Treasure Under the Pacific Ocean: పసిఫిక్ మహాసముద్రం అడుగున ఉన్న కొన్ని విచిత్రమైన రాళ్లు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, మైనింగ్ కంపెనీల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా ఆపిల్ పరిమాణంలో కనిపించే ఈ రాళ్లను పాలిమెటాలిక్ నాడ్యూల్స్ అని పిలుస్తున్నారు. ఇవి సముద్రగర్భంలో లక్షల సంవత్సరాలుగా నెమ్మదిగా ఏర్పడుతూ వచ్చాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలకు అవసరమైన కీలక లోహాలు వీటిలో అధికంగా ఉండటంతో వీటి ప్రాముఖ్యత మరింత పెరిగింది.
ఈ నాడ్యూల్స్ ఎక్కువగా క్లారియన్ క్లిప్పర్టన్ జోన్ (CCZ) అనే ప్రాంతంలో ఉన్నాయి. ఇది హవాయి, మెక్సికో మధ్య ఉన్న విస్తారమైన సముద్రగర్భ ప్రాంతం. సుమారు 5,000 మీటర్ల లోతులో ఉన్న ఈ ప్రాంతం దాదాపు 60 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఇక్కడ బిలియన్ల టన్నుల విలువైన లోహాల నిల్వలు ఉన్నాయి.
ఈ రాళ్లలో ప్రధానంగా మాంగనీస్, నికెల్, కోబాల్ట్, కాపర్ లాంటి లోహాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీలకు ఈ లోహాలు చాలా అవసరం. అందుకే భవిష్యత్తులో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ ను తీర్చడానికి ఈ సముద్రగర్భ వనరులు కీలకంగా మారే అవకాశం ఉందని ఆటో ఇండస్ట్రీ భావిస్తోంది.
ప్రస్తుతం ఈ లోహాల కోసం ప్రపంచం ప్రధానంగా భూభాగంలోని గనులపైనే ఆధారపడుతోంది. కోబాల్ట్ లో ఎక్కువ భాగం ఆఫ్రికాలోని కాంగో దేశం నుంచి వస్తోంది. నికెల్ సరఫరాలో ఇండోనేషియా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఈ ప్రాంతాల్లో గనుల తవ్వకాల వల్ల పర్యావరణ నష్టం, అడవుల నరికివేత, మానవ హక్కుల సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శలు ఉన్నాయి. అందువల్ల సముద్రగర్భంలో ఉన్న నాడ్యూల్స్ ను ప్రత్యామ్నాయ వనరుగా మైనింగ్ కంపెనీలు చూస్తున్నాయి.
ఈ ప్రణాళికపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఈ నాడ్యూల్స్ ఉన్న సముద్రగర్భ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత తక్కువగా అధ్యయనం చేయబడిన వ్యవస్థలలో ఒకటి. ఈ నాడ్యూల్స్ అనేక సముద్ర జీవులకు నివాసంగా పనిచేస్తాయి. స్పాంజ్లు, చిన్న సముద్ర జీవులు, ఇతర సూక్ష్మజీవులు ఈ రాళ్లపైనే ఆధారపడి జీవిస్తాయి. ఒకవేళ మైనింగ్ కోసం వీటిని తొలగిస్తే, ఆ జీవుల నివాస ప్రాంతాలు కూడా నాశనం కావచ్చు. అందుకే, శాస్త్రవేత్తలు దీనిని పెద్ద పర్యావరణ ప్రమాదంగా భావిస్తున్నారు. పూర్తి శాస్త్రీయ సమాచారం అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలని అవి సూచిస్తున్నాయి.
మరోవైపు మైనింగ్ కంపెనీలు మాత్రం ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తుకు అవసరమైన లోహాలను సమకూర్చుకోవాలనుకుంటే ఈ వనరులను వినియోగించాల్సిందేనని వాదిస్తున్నాయి. దీంతో ఒకవైపు స్వచ్ఛమైన ఇంధన భవిష్యత్తు, మరోవైపు సముద్ర జీవవైవిధ్య పరిరక్షణ మధ్య సమతుల్యత ఎలా సాధించాలనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Read Also: ఈ కారు హెడ్ లైట్లు సినిమా చూపించేస్తాయ్.. వామ్మో.. ఇదేం టెక్నాలజీ భయ్యా!