Simple Arrive Launch Date: సింపుల్ ఎనర్జీ భారత మార్కెట్లో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకురాబోతోంది. సింపుల్ అరైవ్ పేరుతో వస్తున్న ఈ స్కూటర్ ను కంపెనీ సెప్టెంబర్ 2న అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు పనితీరుకు ప్రాధాన్యత ఇస్తూ, సింపుల్ వన్ లాంటి మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీ, ఇప్పుడు కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త స్కూటర్ ను తీసుకొస్తోంది.
సింపుల్ అరైవ్ స్కూటర్ ను పూర్తిగా సింపుల్ ఎనర్జీ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ టీమ్ రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. రోజువారీ ప్రయాణాలను సులభతరం చేసేలా ఈ మోడల్ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ వెల్లడించింది. మంచి రైడింగ్ ఎక్స్ పీరియెన్స్, అత్యాధునిక టెక్నాలజీ, ఉపయోగించడానికి ఈజీగా ఉండే ఫీచర్లతో ఈ స్కూటర్ ను అందించనున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం కంపెనీ పూర్తి సాంకేతిక వివరాలను ప్రకటించకపోయినా, ఇప్పటికే బయటకు వచ్చిన డిజైన్ పేటెంట్లు, స్పై ఫొటోల ద్వారా స్కూటర్ కు సంబంధించిన కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. సింపుల్ అరైవ్ కు లేటెస్ట్ స్టైల్ లో రూపొందించిన బాడీ ప్యానెల్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లతో కూడిన LED హెడ్ ల్యాంప్, ప్రత్యేకమైన LED డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఉండనున్నాయి. రైడర్తో పాటు వెనుక కూర్చునే వ్యక్తికి కూడా సౌకర్యంగా ఉండేలా పొడవైన సీటును అందించనుంది. కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి ఇది మరింత ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది.
సింపుల్ ఎనర్జీకి ఇది మూడో మోడల్ కానుంది. ప్రస్తుతం కంపెనీ సింపుల్ వన్ను విక్రయిస్తుండగా, ఇటీవల సింపుల్ అల్ట్రా మోడల్ ను కూడా పరిచయం చేసింది. ఆ స్కూటర్ ఒకసారి పూర్తి ఛార్జ్ తో 400 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ రెండు మోడళ్ల అభివృద్ధి ద్వారా పొందిన సాంకేతిక అనుభవాన్ని ఇప్పుడు అరైవ్ స్కూటర్ లో కూడా ఉపయోగిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
కొత్త అరైవ్ ప్రధానంగా రోజువారీ ప్రయాణాలకు అనువుగా, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో, సరసమైన ధరలో ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించింది. అందుకే ఇందులో ప్రాక్టికాలిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
భారత మార్కెట్లో ఈ స్కూటర్ విడుదలైన తర్వాత బజాజ్ చేతక్ C25, TVS ఆర్బిటర్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సింపుల్ ఎనర్జీ కూడా ఈ సెగ్మెంట్లో తన వాటాను పెంచుకోవాలని చూస్తోంది.
Read Also: రాయల్ ఎన్ఫీల్డ్ డబుల్ గేమ్.. ఒకవైపు ఈవీలు.. మరోవైపు పెట్రోల్ బైక్లు!