Good News for Highway Travellers: జాతీయ రహదారులు, ఎక్స్ ప్రెస్ వేలపై ప్రయాణించే వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) శుభవార్త చెప్పింది. ప్రయాణం మధ్యలో వాహనం పాడవడం, టైర్లు పంక్చర్ కావడం వంటి సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే సహాయం అందేలా కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇకపై హైవేల వెంట ఉన్న వేసైడ్ అమెనిటీస్ (WSA) కేంద్రాల్లో వాహన మరమ్మతు దుకాణాలు, పంక్చర్ సేవలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఇప్పటి వరకు చాలా మంది ప్రయాణికులు హైవేలపై వాహనాలు పాడవడంతో గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ ప్రెస్ వేలపై సమీపంలో మెకానిక్లు, సర్వీస్ సెంటర్ లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో NHAI ఈ కీలక నిర్ణయం తీసుకుంది. NHAIకి చెందిన అనుబంధ సంస్థ నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్(NHLML) ఇప్పటికే తమ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వేసైడ్ అమెనిటీ కేంద్రాల్లో వీలైనంత త్వరగా వెహికల్ రిపేర్ సర్వీసులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
సాధారణంగా ప్రతి 40 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఈ వేసైడ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. ఇవి ప్రయాణికులకు విశ్రాంతి కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేంద్రాల్లో పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు, మరుగుదొడ్లు, ఈవీ ఛార్జింగ్ పాయింట్లు, ట్రక్ డ్రైవర్ల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా మెకానిక్ షాపులు, పంక్చర్ సర్వీసులను కూడా యాడ్ చేయనున్నారు.
NHAI తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై హైవేల మీద వాహనాలు నిలిచిపోయే సమయం తగ్గుతుంది. ప్రయాణికులు గంటల తరబడి సహాయం కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ సదుపాయాలు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నారు. హైవేలపై ట్రాఫిక్ రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా రోడ్డు పక్కన అత్యవసర సేవలు కూడా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని NHAI అధికారులు చెబుతున్నారు. వాహనం అకస్మాత్తుగా పాడైతే వెంటనే సాయం అందించడం ద్వారా రహదారి భద్రతను కూడా మెరుగుపడుతుందని వాళ్లు వెల్లడించారు.
ప్రస్తుతం NHLML పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) మోడల్లో దేశవ్యాప్తంగా ఆధునిక వేసైడ్ సౌకర్యాలను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఉన్న ఒప్పందాల ప్రకారం ఆయా సెంటర్ల నిర్వాహకులకు రిపేర్ సేవల ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని NHAI ఆదేశించింది. హైవే ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుదూర ప్రయాణాలు చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాలను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావాలని NHAI భావిస్తోంది.
Read Also: పెట్రోల్ కారులో పొరపాటున డీజిల్ పోశారా? వెంటనే చేయాల్సిన పని ఇదే!