Toyota Hilux Facelift Spotted: టయోటా పాపులర్ పికప్ ట్రక్ హిలక్స్ కు న్యూ జెనరేషన్ వెర్షన్ ను భారత మార్కెట్ లోకి తీసుకురావడానికి రెడీ అవుతోంది. ఈ కొత్త మోడల్ ఇటీవల దేశంలో తొలిసారిగా కనిపించింది. న్యూఢిల్లీలో ఓ టీవీ కమర్షియల్ యాడ్ షూటింగ్ లో ఈ వెహికల్ దర్శనం ఇచ్చింది. త్వరలోనే టయోటా ఈ కొత్త హిలక్స్ ను అధికారికంగా పరిచయం చేసే అవకాశం ఉందని ఆటో నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం అమ్మకాల్లో ఉన్న హిలక్స్ తో పోలిస్తే కొత్త మోడల్ లో పలు డిజైన్ మార్పులు కనిపిస్తున్నాయి. ముందుభాగంలో పెద్ద గ్రిల్, కొత్త LED హెడ్ ల్యాంప్స్, మరింత బలమైన స్టైలింగ్ ను అందించారు. కొత్త బంపర్ తో పాటు స్కిడ్ ప్లేట్ కూడా ఉండటంతో వెహికల్ కు మరింత రగ్గడ్ లుక్ వచ్చింది. సైడ్ ప్రొఫైల్ లో డబుల్ క్యాబ్ డిజైన్ కొనసాగించినప్పటికీ, కొత్త అల్లాయ్ వీల్స్, వీల్ ఆర్చ్ లు, సైడ్ స్టెప్స్ ను యాడ్ చేశారు. వెనుక భాగంలో కూడా కొత్త లైటింగ్ డిజైన్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే పాత మోడల్ కంటే మరింత లేటెస్ట్ గా ఆకట్టుకునేలా కనిపిస్తోంది.
అటు ఇంటీరియర్కు సంబంధించిన ఫోటోలు ఇంకా బయటకు రాలేదు. అయితే, అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న తాజా టయోటా మోడళ్ల మాదిరిగా ఇందులో కూడా అనేక కొత్త ఫీచర్లు ఉండనున్నాయని తెలుస్తోంది. పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్ లెస్ ఛార్జింగ్ లాంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
భారత మార్కెట్ కోసం 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్తో పాటు 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ను అందించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ సుమారు 204 PS పవర్, 500 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండొచ్చని తెలుస్తోంది. ఫోర్ వీల్ డ్రైవ్ వ్యవస్థను టయోటా ఇందులో అలాగే కొనసాగించనుంది. కఠినమైన రోడ్లు, ఆఫ్ రోడ్ ప్రయాణాలకు మరింత అనుకూలంగా ఉంటుంది. మల్టీ టెర్రైన్ సెలెక్ట్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, హిల్ డిసెంట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా లాంటి ఫీచర్లు కూడా అందించే అవకాశం ఉంది.
భద్రత పరంగా కూడా కొత్త హిలక్స్ లో గణనీయమైన అప్డేట్లు ఉండనున్నాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఆటో హై బీమ్ అసిస్ట్ వంటి ఆధునిక ADAS ఫీచర్లు ఇందులో ఉంటాయని తెలుస్తోంది. ఈ సంవత్సరం చివర్లో ఈ పికప్ ట్రక్ను మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త ఫీచర్లు, హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా ప్రస్తుత మోడల్ కంటే ధర కొంత పెరిగే అవకాశం ఉంది. కొత్త హిలక్స్, ఇసుజు డి మ్యాక్స్ వి క్రాస్ లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
Read Also: కవాసకి నింజా బైక్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా రూ.2.89 లక్షల వరకు తగ్గింపు!