రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా రవాణా శాఖ కీలక చర్యలకు దిగింది. ఫిబ్రవరి 20 నుంచి అన్ని రవాణా వాహనాలకు క్యూఆర్ కోడ్ ఆధారిత రిఫ్లెక్టివ్ టేపులు, రియర్ మార్కింగ్ ప్లేట్లను తప్పనిసరి చేశారు. నాణ్యత లేని సాధారణ టేపుల వాడకాన్ని అరికట్టి, రాత్రిపూట వాహనాలు స్పష్టంగా కనిపించేలా ఈ కొత్త టేపులను ప్రవేశపెట్టారు. మోటారు వాహనాల నియమాల ప్రకారం టేపులపై తెలంగాణ రవాణా శాఖ లోగో, హోలోగ్రామ్, సీరియల్ నంబర్తో కూడిన QR కోడ్ ఉంటుంది. ఈ నిబంధన పాటించని వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికేట్ జారీ చేయబోమని అధికారులు స్పష్టం చేశారు.
రావాణాశాఖ కొత్త రూల్స్ ఏం చెప్తున్నాయంటే?
ఇప్పటి వరకు వాహనాలకు సాధారణ రిఫ్లెక్టివ్ టేపులు వాడుతున్నారు. నాణ్యత లేకపోవడం, నకిలీ టేపుల వాడకం వల్ల పెద్దగా ఉపయోగడం ఉండటం లేదని ప్రభుత్వం గుర్తించింది. అందుకే 1989 కేంద్ర మోటారు వాహనాల నియమాలు ప్రకారం, కొత్తగా క్యూఆర్ ఆధారిత మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో టేపులపై తెలంగాణ రవాణా శాఖ లోగో, హోలోగ్రామ్, ప్రత్యేక సీరియల్ నంబర్ తో కూడిన QR కోడ్ ఉంటుంది. అధికారులు దీన్ని స్కాన్ చేయడం ద్వారా అది అసలైనదా కాదా అని వెంటనే గుర్తిస్తారు.
ప్రస్తుతం ప్రభుత్వం 5 కంపెనీలను ఎంపానెల్ చేసింది. అందులో ఎం ఇండియా లిమిటెడ్, ఒరఫఫోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అవెరి డెన్నిసన్ ఇండియా, గ్లోడియన్ రిఫ్లెక్టివ్, డోమింగ్ రిఫ్లెక్టివ్ మెటీరియల్స్ సంస్థలకు చెందిన అధీకృత డీలర్ల దగ్గర మాత్రమే వాహనదారులు రిప్లెక్టివ్ టేపులు వేయించుకోవాల్సి ఉంటుంది. వాహన యజమానుల నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూళు చేయకుండా ప్రభుత్వం ధరలను ఖరారు చేసింది. ఇందులో అఫిక్సేషన్, సర్టిఫికేట్ ఛార్జీలు కూడా కలిసి ఉంటాయి. CT 20MM మీటరుకు రూ.79.80 నుంచి రూ.85, CT 50MM మీటరుకు రూ.145 నుంచి రూ151.80, C3/C4 ప్లేట్లు జతకు రూ.2500 నుంచి రూ.2,900 వరకు, రిఫ్లెక్టర్లకు రూ.35 నుంచి రూ.60 వరకు ధర చెల్లించాల్సి ఉంటుంది. వాహనాలకు టేపులు అమర్చిన తర్వాత డీలర్లు కనీసం 2 ఏళ్ల వారంటీతో కూడిన అఫిక్సేషన్ సర్టిఫికేట్ ఇస్తారు.
తనిఖీల సమయంలో రవాణా అధికారులు QR కోడ్ స్కాన్ చేస్తారు. అసలైనదా? నకిలీదా అని తేల్చుతారు. ఒకవేళ నకిలీదని తేలితే సదరు సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటారు. తయారీ సమయంలోనే టేపులు ఉన్న కొత్త వాహనాలకు ఈ వెరిఫికేషన్ అవసరం లేదు. రవాణా వాహనాల యజమానులు గడువులోపు తమ వాహనాలకు అధీకృత డీలర్ల దగ్గర రిఫ్లెక్టివ్ టేపులు వేయించుకోవాలని అధికారులు సూచించారు. రోడ్డు భద్రతలో వాహనదారులు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
Read Also: షాకింగ్.. ఆ రూట్లో వందే భారత్ రైళ్ల సేవల్ ఇక బంద్, రైల్వే కీలక నిర్ణయం!