Toyota Hybrid Cars 3 Lakh Sales Milestone: భారత్ లో హైబ్రిడ్ కార్లకు కొనుగోలుదారుల నుంచి మంచి సపోర్టు లభిస్తోంది. ముఖ్యంగా టయోటా కంపెనీ హైబ్రిడ్ కార్ల అమ్మకాల్లో దూసుకెళ్తోంది. దేశ వ్యాప్తంగా మొత్తం 3 లక్షల హైబ్రిడ్ కార్ల అమ్మకాలను దాటినట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది. పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణంపై అవగాహన, మెరుగైన మైలేజ్ కోసం వినియోగదారులు హైబ్రిడ్ టెక్నాలజీ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఈ సక్సెస్ సాధించినట్లు తెలిపింది.
భారత మార్కెట్లో సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా ఎక్కువ మైలేజ్, తక్కువ కాలుష్యం, సాఫ్ట్ డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్, ఛార్జింగ్ టెన్షన్ లేకపోవడం లాంటి కారణాలతో వినియోగదారులు హైబ్రిడ్ కార్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగా బయట నుంచి ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేకపోవడం కూడా ఈ టెక్నాలజీకి పెద్ద ప్లస్గా మారింది.
టయోటా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా హైబ్రిడ్ టెక్నాలజీలో ప్రముఖ కంపెనీగా గుర్తింపు పొందింది. కంపెనీకి ఈ రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. భారత్ లో టయోటా ప్రస్తుతం పలు హైబ్రిడ్ మోడళ్లను అమ్ముతోంది. అందులో అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఇన్నోవా హైక్రాస్, క్యామ్రీ హైబ్రిడ్, వెల్ ఫైర్ లాంటి టాప్ మోడళ్లు ఉన్నాయి. వీటికి నగరాల్లోనే కాకుండా కుటుంబ వినియోగదారుల్లో కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఇన్నోవా హైక్రాస్, హైరైడర్ లాంటి మోడళ్లు మంచి మైలేజ్ కారణంగా ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి.
భారతదేశంలో 3 లక్షల హైబ్రిడ్ వాహనాల అమ్మకాలు సాధించడం పట్ల కంపెనీ గర్వంగా ఫీలవుతున్నట్లు టయోటా సేల్స్, సర్వీస్, యూజ్డ్ కార్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సబరి మనోహర్ వెల్లడించారు. టయోటా హైబ్రిడ్ టెక్నాలజీపై వినియోగదారులలో నమ్మకం బాగా పెరుగుతోందని తెలిపారు. మాస్ ఎలక్ట్రిఫికేషన్ లక్ష్యంతో అందరికీ ఉపయోగపడే, సులభమైన మొబిలిటీ సొల్యూషన్లు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు.
టయోటా హైబ్రిడ్ సిస్టమ్ లో పెట్రోల్ ఇంజిన్తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కలిసి పనిచేస్తాయి. కారు అవసరానికి అనుగుణంగా ఈ రెండు పవర్ సోర్సులు ఆటోమేటిక్ గా మారుతూ పని చేస్తాయి. తక్కువ వేగంలో కారు ఎక్కువసేపు ఎలక్ట్రిక్ మోడ్ లో నడవడం వల్ల ఇంధన వినియోగం తగ్గుతుంది. అదే సమయంలో డ్రైవింగ్ కూడా సాఫీగా ఉంటుంది. ఇందులో ఉన్న సెల్ఫ్ ఛార్జింగ్ టెక్నాలజీ కారణంగా బ్యాటరీలు బ్రేకింగ్ సమయంలో, ఇంజిన్ ద్వారా ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతాయి. వాహనాన్ని ప్రత్యేకంగా ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల వినియోగదారులకు రేంజ్ టెన్షన్ కూడా ఉండదు. వినియోగదారుల నమ్మకాన్ని పెంచేందుకు టయోటా తన హైబ్రిడ్ బ్యాటరీలపై 8 సంవత్సరాల వారంటీ కూడా అందిస్తోంది.
Read Also: రోజువారీ ప్రయాణానికి బెస్ట్ హైబ్రిడ్ కార్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్!