New Yamaha Aerox-E Electric Scooter: యమహా అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఏరాక్స్-E ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్ లోకి అడుగుపెట్టింది. గత ఏడాది ప్రదర్శించిన ఈ స్కూటర్ ను ఇప్పుడు అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.2.82 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. ఈ ధరతో ప్రస్తుతం భారత్ లో అమ్మకానికి ఉన్న యమహా బ్రాండ్ లోనే అత్యంత ఖరీదైన టూ వీలర్ గా కొనసాగుతోంది.
ఏరాక్స్-Eలో పనితీరుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది యమహా. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 117 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. స్కూటర్ మొత్తం బరువు 139 కిలోలు. ఇది పెట్రోల్ ఏరాక్స్ 155తో పోలిస్తే కొద్దిగా ఎక్కువ బరువుగా ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్ కారణంగా మంచి పనితీరును అందిస్తుంది. ఇందులో 9.5kW సామర్థ్యం గల ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. ఇది గరిష్టంగా 48Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మంచి పికప్ కావాలని కోరుకునే రైడర్లను దృష్టిలో పెట్టుకుని ఈ మోటార్ను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ స్కూటర్ లో మరో ప్రత్యేకత డ్యూయల్ 1.5kWh రిమూవబుల్ బ్యాటరీలు. అవసరమైతే బ్యాటరీలను తీసి విడిగా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ బ్యాటరీల్లో హై ఎనర్జీ సెల్స్ ను ఉపయోగించడం వల్ల మెరుగైన పనితీరు లభిస్తుంది.
ఇక ఈ స్కూటర్ లో రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ ను మరింత మెరుగుపరచడానికి ఇందులో ఎకో, స్టాండర్డ్, పవర్ అనే మూడు మెయిన్ రైడింగ్ మోడ్ లతో పాటు బూస్ట్ మోడ్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా హైవే మీద, ఓవర్ టేక్ చేసే సమయంలో ఈ బూస్ట్ మోడ్ అదనపు పవర్ ను అందించి వేగంగా ముందుకు దూసుకెళ్లేలా చేస్తుంది. భద్రత విషయంలో కూడా యమహా రాజీ పడలేదు. ఫ్రంట్ చక్రానికి ABSతో కూడిన డిస్క్ బ్రేక్, వెనుక చక్రానికి డిస్క్ బ్రేక్ ను అందించింది. బ్రేకింగ్ మరింత భద్రంగా ఉంటుంది.
డిజైన్ పరంగా చూస్తే, కొత్త ఏరాక్స్-E దాదాపు పెట్రోల్ ఏరాక్స్ 155ను పోలి ఉంటుంది. ట్విన్ LED హెడ్ లైట్లు, LED టెయిల్లైట్లు అలాగే కొనసాగించారు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో మాత్రం పెద్ద మార్పులు చేశారు. సాధారణ LCD డిస్ ప్లే స్థానంలో యాప్ కనెక్టివిటీతో కూడిన TFT డిస్ ప్లేను అందించారు. రైడింగ్ వివరాలు మరింత స్పష్టంగా కనిపించడంతో పాటు స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఢిల్లీ, బెంగళూరు, ముంబై, పుణే, చెన్నై నగరాల్లో విక్రయానికి అందుబాటులో ఉంది. బెంగళూరు, ఢిల్లీలో దీని ధర రూ.2.81 లక్షలు, ముంబై, పుణే, చెన్నైలో రూ.2.82 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కొనసాగుతోంది.
Read Also: నిస్సాన్ టెక్టన్ వచ్చేసింది.. ఇంత తక్కువ ధరలో అన్ని క్రేజీ ఫీచర్లా?