సీఎం రేవంత్రెడ్డి ఇవాళ చేసిన కామెంట్స్ చర్చకు తెర తీశాయి. కొడంగల్లో తనను ఓడించడం ద్వారా .. రాష్ట్ర స్థాయిలో రాజకీయంగా నిర్బంధించే కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాదు.. సర్ ప్రక్రియ ముసుగులో తన సొంత నియోజకవర్గం కొడంగల్లో దొంగ ఓట్ల డ్రామా ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు.
దీని వెనుక బీఆరెస్, బీజేపీ రెండూ ఉన్నాయన్నారాయన. ఒక పార్టీకి నా ద్వారా అధికారం పోయిందని కసి, మరో పార్టీకి అధికారంలోకి రాకుండా తనే అడ్డంకి అనే కోపం.. అంటూ బీఆరెస్, బీజేపీల గురించి ఇండైరెక్టుగా ఆయన కామెంట్ చేశారు. వీరిద్దరూ కలసి .. తనను ఇక్కడే పునాది దశలోనే కొండగల్లో పూర్తిగా కంట్రోల్ చేయాలని దొంగదెబ్బ తీసేందుకు రెడీ అయ్యారని.. అందుకే ఓట్ల నమోదులో కొడంగల్లో తీవ్ర వ్యత్యాసం కనిపిస్తున్నదని కూడా ఆరోపించారు.
సీఎం కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. కొండగల్ మొత్తం ఓట్లకు గాను ఇప్పటి వరకు 78 శాతం వరకే ఓట్లు నమోదయ్యాయని, మరో 22 శాతం.. అంటే 54, 635 ఓట్లు ఇంకా పెండింగ్లో పెట్టారన్నారు. దీన్ని బట్టి చూస్తే.. మొన్న ఢిల్లీకి వెళ్లి 35వేల ఓట్లు కొడంగల్లో దొంగ ఓట్లుగా ఉన్నాయని బీఆరెస్ ఆరోపించడం వెనుక.. కుట్ర ఏమిటో మీరు తెలుసుకోవాలని కొడంగల్ ప్రజలను ఆయన కోరారు.
అంతకు ముందు కవిత కూడా.. కొడంగల్లో రేవంత్ ..పక్కరాష్ట్రం కర్ణాటక నుంచి వచ్చి ఓట్లు నమోదు చేయించుకున్నారని, ఇవన్నీ దొంగ ఓట్లేనని ఆరోపించారు. అక్కడా ఇక్కడా రెండు చోట్ల ఓట్లున్న వీరి ద్వారానే రేవంత్రెడ్డికి 35వేల మెజారిటీ వచ్చిందని ఆమె ఆరోపించారు. పరోక్షంగా ఈ అంశాన్ని కూడా రేవంత్రెడ్డి ప్రస్తావించారు. తనకు వచ్చిన 35వేల ఓట్ల మెజారిటీలో ఇప్పటి వరకు సర్ ప్రక్రియ ద్వారా నమోదు కానీ 54వేల ఓట్లు పోతే.. తనకు మరో 20వేల ఓట్లు తక్కువగా వస్తాయని, ఈ లెక్కన బీఆరెస్, బీజేపీ ఎంత పకడ్బందీగా తన ఓటమికి తెర వెనుక ఇద్దరూ ఏకమై వ్యూహ రచన చేస్తున్నారో అర్థం చేసుకోవాలని ఆయన లోకల్ ప్రజలకు వివరించారు.
ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ కనీస ఉనికి లేకున్నా.. జెండా పట్టేవాడే లేకున్నా.. బీఆరెస్ పార్టీనే బీజేపీ జెండా మోసిందని, వారిని గెలిపించేందుకు రాష్ట్రం మొత్తం ఇట్లనే వ్యవహరించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా వారు భవిష్యత్లో కలిసే అవకాశం పుష్కలంగా ఉందని, అందుకే వారిద్దరికీ బద్ద శత్రువైన నన్ను ఇక్కడే ఓడగొట్టడం ద్వారా తమకు రాష్ట్ర రాజకీయాల్లో ఆటంకాలు లేకుండా చేసుకోవచ్చనుకుంటున్నారన్నారు సీఎం.
ఓటుగా నమోదు కాకపోతే బతికున్నా చచ్చిన శవంతో సమానమని, సంక్షేమ పథకాలు పూర్తిగా నిలిపివేస్తారని కూడా సీఎం అనడం.. చర్చకు తెర తీసింది. కార్యకర్తలు గ్రౌండ్ వర్క్ చేయాలని, బీఎల్వోల మీద ఆధారపడవద్దని, ఓటర్లుగా నమోదు కానీ వివరాలు సేకరించి, వాటికి కావాల్సిన సాంకేతిక సమస్యలను తీర్చి పరిష్కరించాలని లోకల్ కాంగ్రెస్ క్యాడర్ను ఆయన వేడుకోవడం కూడా పరిస్థితి తీవ్రతను తెలియజేసింది.