Gujarat Floods: పశ్చిమ మధ్యప్రదేశ్పై ఏర్పడిన సైక్లోనిక్ సర్క్యులేషన్ ప్రభావంతో గుజరాత్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వడోదర, భరూచ్, సూరత్, నవ్సారీ, వల్సాద్, నర్మదా, తాపీ, అహ్మదాబాద్, ఆనంద్, భావ్నగర్, బొటాడ్, పంచ్మహల్ సహా 15 జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి.
అహ్మదాబాద్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కేవలం రెండు గంటల్లోనే 177 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో నగరం మొత్తం అతలాకుతలం అయింది. దక్షిణ–పశ్చిమ జోన్లో 22.86 సెంటీమీటర్లు, పశ్చిమ జోన్లో 20.32, సెంట్రల్ జోన్లో 16.51 సెంటీమీటర్లు, దక్షిణ జోన్లో 10 సెంటీమీటర్లు వర్షం కురిసింది. ప్రధాన రహదారులు నదులను తలపించగా.. వందలాది వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. అంబ్లీ, బోపాల్ ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది.
వర్షాల కారణంగా సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. 10 చోట్ల చెట్లు కూలడం, 2 చోట్ల గోడలు కూలడం, 8 విద్యుత్ షార్ట్సర్క్యూట్లు జరిగాయి. నగరంలోని 15 ప్రధాన రహదారులపై ప్రయాణాలు నిలిపివేయగా, 8 అండర్పాస్లను తాత్కాలికంగా మూసివేశారు. సబర్మతి నది నీటి మట్టం తగ్గించేందుకు వాస్నా బ్యారేజ్ మూడు గేట్లను ఎత్తివేశారు.
భారీ వర్షాలతో జూలై 24న అహ్మదాబాద్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు. స్థానిక పరిస్థితులను బట్టి జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని… చెట్ల కింద, నీటి ప్రవాహాల దగ్గర ఉండొద్దని ఐఎండీ హెచ్చరించింది.
ప్రస్తుత వర్షాలతో ఇప్పటివరకు పెద్ద ఎత్తున ప్రాణనష్టం నమోదైనట్లు అధికారికంగా ప్రకటించలేదు. అయితే పలు ప్రాంతాల్లో ఇళ్లు, వాహనాలు, ప్రజా మౌలిక వసతులకు భారీ నష్టం జరిగింది. పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. మరో 2 నుంచి 4 రోజుల పాటు గుజరాత్, దక్షిణ రాజస్థాన్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగనున్నాయని ఐఎండీ హెచ్చరించడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
Also Read: దిగొచ్చిన పసిడి ధరలు.. ఇది తాత్కాలిక షాకా.. కొనుగోలుకు గోల్డెన్ ఛాన్సా?