Amaravati: రాజధానిపై అమరావతిపై దశాబ్దానికి పైగా ఉన్న అనిశ్చితి తొలగిపోయింది. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతే అని భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయినా వైసీపీ గ్రోత్ కారిడార్లు, మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రకరణ అంటూ.. కొత్తకొత్త ప్రాతిపదనలు తెస్తూ విదండవాదం చేస్తూనే ఉంది. అమరావతిని అధికారికంగా గుర్తించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినా ఇంకా వైసీపీ సీనియర్లు ధర్మాన ప్రసాదరావు వంటి వారు వాదిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించడానికి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ఆమోదం కోసం పంపింది. పార్లమెంటు ఉభయసభలు ఆ తీర్మానంపై చర్చ జరిపి, దాన్ని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. తాజాగా ఆ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో భారత్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో ఇక మున్ముందు ఎవరు వచ్చినా రాజధానిని మార్చలేరని, అమరావతి ఏపీకి ఏకైక రాజధానని, ఇకపై తమది రాజధాని లేని రాష్ట్రం కాదని ప్రజలు అనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే అసెంబ్లీకి హాజరై రాజధానిపై తమ వైఖరి స్పష్టం చేయని వైసీపీ మాత్రం పూటకో మాట, రోజుకో నిర్ణయం అన్నట్లు అమారవతిపై అక్కసు వెల్లగక్కుతూనే ఉంది. అమరావతిని రాజధానిగా నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు.. పార్లమెంట్ ఉభయసభల్లోనూ ఆ పార్టీ ఎంపీలు తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది. అయితే వారు చట్టసభల్లో మాట్లాడకుండా వాకౌట్ చేశారు. ఒకవైపు పార్లమెంటులో చర్చ జరుగుతుండగానే, మాజీ సీఎం రాజధానిపై ప్లాన్ బి ప్రకటించి కలకలం రేపారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని నేషనల్ హైవే అనుసంధానంగా .. ‘మావిగన్’ అనే కొత్త రాజధానిని జగన్ ప్రతిపాదించారు. తన పేరు కలిసి వచ్చేలా మావిగన్ ప్రపోజల్ని ప్లాన్-బి అంటున్న జగన్ .. తాను అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అసలు ఆ ప్రస్తావనే తేలేదు. మూడు రాజధానుల మంత్రం పఠిస్తూ.. ఆ అయిదేళ్లు ఏపీకి రాజధాని ఏదో తెలియకుండా గందరగోళం సృష్టించారు.
మాజీ సీఎం కొత్త ప్రతిపాదనపై విమర్శలు వచ్చి.. మావిగన్ తెగ ట్రోల్ అవుతుండటంతో వైసీపీ డిఫెన్స్లో పడాల్సి వచ్చింది. దాంతో వైసీపీ నేతలు డ్యామేజ్ కంట్రోల్కు రంగంలోకి దిగి.. మావిగన్ తక్కువ ఖర్చుతో అద్భుతమైన కేపిటల్ అవుతుందని ప్రాపగాండా మొదలుపెట్టారు. ఎక్కడ రాజధాని నిర్మాణాలు చేయలన్నా మౌళిక సదుపాయాలు, సకల సదుపాయాలు కల్పించాల్సిందే. భూముల కోసం ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా రైతులు రాజధాని కోసం ఇచ్చిన భూముల్లో ప్రస్తుతం పనులు వేగవంతంగా సాగుతున్నాయి.
ఇప్పుడు కొత్త రాజధాని అంటే మళ్లీ భూ సేకరణ దగ్గర నుంచి ప్రక్రియ మొదలెత్తుకోవాలి. అమరావతి ప్రాంత రైతులు ఉదారంగా ఇచ్చినట్లు.. జాతీయ రహదారి పక్కన స్థలాలు ఉన్న వారు ప్రభుత్వానికి భూములిచ్చే పరిస్థితి ఉండదు. అసలే ఇప్పటికే బందరు నుంచి గుంటూరు వరకు హైవే పక్కన ఖాళీ స్థలాలు కనిపించని పరిస్థితి. నిర్మాణాలు పెరిగిపోయి, జాతీయ రహదారికి ఇరువైపులా రియల్ బూమ్ ఒక రేంజ్లో ఉంది. అయినా వైసీపీ నేతలు మాత్రం అవేమీ పట్టించుకోకుండా, అమరావతికి లక్షల కోట్లు ఎందుకు… మావిగన్ రాజధాని అయితే రూ20 వేల కోట్లతో పనులు అయిపోతాయని వాదిస్తున్నారు. ఆ గందరగోళం అలా ఉంటే ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు అమరావతి రాజధాని చట్టానికి వ్యతిరేకం గళంవిప్పుతూ, ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు.
ఆ క్రమంలో మరోసారి సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఉత్తరాంధ్ర, రాయలసీయ ప్రాంతాలు ఇంకా వెనబడే ఉన్నాయన్న ధర్మాన.. మీరంటున్న ప్రజల రాజధాని అమరావతిలో.. వెనుకబడిన వారికి ఓ ఎకరా భూమి అయినా వస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే…ఆ ప్రాంతం మాకే చెందాలనే దురాశ అక్కడి వారిలో కలుగుతుందని, అప్పుడు ఇంకో రాష్ట్రం కావాలనే ఉద్యమం రానున్న రోజుల్లో మొదలవుతుందని తనదైన స్టైల్లో హెచ్చరిస్తున్నారు.
ధర్మాన వ్యాఖ్యలకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు.
రాజధాని విషయంలో వైసీపీ నేతల మధ్యనే సమన్వయం లేదని, ఎన్నికల ముందు వారు మూడు రాజధానుల నినాదంతో ప్రజల్లోకి వెళ్తే.. విశాఖలో ఎన్నడూ లేని విధంగా 5లక్ష ఓట్ల మెజార్టీతో టీడీపీ ఎంపీని ప్రజలు గెలిపించారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలోనే వైజాగ్ వెళ్లి అమరావతే రాజధాని అని టీడీపీ చెప్పిందని, దాన్ని ప్రజలు ఆమోదించారన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతా ప్రజలు కూటమికి అఖండ విజయం అందించి, అమరావతిని రాజధానిగా ఆమోదించారని పేర్కొన్నారు. అలాగని హైదరాబాద్ లాంటి రాజధానిని…దాము కోరుకోవడంలేదని, అభివృద్ధి వికేంద్రీకరణ విధానంలోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
మరోవైపు ఏపీ సమగ్రాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందు నుంచి చెప్తున్నారు. విశాఖ కేంద్రంగా ఏలూరు వరకూ… అమరావతి కేంద్రంగా ప్రకాశం వరకూ… తిరుపతి కేంద్రంగా రాయలసీమ మొత్తం అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించి ఉన్నారు. రాష్ట్రంలో మూడు మెగా సిటీలు వస్తాయని, గ్రీన్ ఎనర్జీ, హార్టికల్చర్ హాబ్, నాలేడ్జ్ ఎకనామికి చిరునామాగా రాయలసీమ మారబోతుందని స్పష్టం చేశారు.
అయితే చంద్రబాబు మూడు మెగా సిటీల ప్రతిపాదనపై కూడా వైసీపీ కౌంటర్లు మొదలుపెట్టింది. ఆ పార్టీ నేత, మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ జగన్ ఆలోచనల్ని చంద్రబాబు కాపీ కొడుతున్నారని విమర్శిస్తున్నారు. జగన్ మాట్లాడిన ‘మావిగన్’గ్రోత్ కారిడర్ గురించి వినగానే.. ప్రభుత్వం గ్రోత్ కారిడార్ల నినాదం ఎత్తుకుందంట. జగన్ ప్రతిపాదనపై చాలా మంది ట్రోల్ చేస్తున్నారు అంటూనే.. జగన్ పవర్ ఎంటో.. ఆ ఒక్క ప్రెస్మీట్తో స్పష్టమైందని కన్నబాబు అంటున్నారు. మావిగన్ ప్రతిపాదనతో రాష్ట్రం ప్రభుత్వం భయపడుతోందంట.
అసలు రాజధాని అమరావతిపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినా.. ఇంకా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏంటన్న చర్చ జరుగుతోంది. ఎప్పటికైనా వైసీపీ అధికారంలోకి వస్తే అప్పుడు వారు రాజధాని గురించి మాట్లాడినా అర్ధం ఉంటుందని… ఇక రాజధానికి కదల్చడం అసాధ్యమని తెలిసే.. ఈ వితండవాదాలు కొనసాగిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Also Read:హస్తినాపురంలో కారు బీభత్సం.. పీకలదాకా తాగి డ్రైవింగ్.. ముగ్గురు స్పాట్
Story by: Apparao, Big Tv