AP Mega Cities Plan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, అభివృద్ధి విషయంలో ఇప్పుడు వినిపిస్తున్న నినాదం ఒకటే. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని. ఇన్నాళ్లూ ఏపీ రాజధాని అంటే ఏదో చెప్పుకోలేకపోయామని, ఇప్పుడు గర్వంగా అమరావతి పేరు చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చామన్నారు సీఎం చంద్రబాబు.
ఎస్.. ఏపీ రాజధాని అమరావతే. మరి.. అమరావతిని మాత్రమే అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలను విస్మరిస్తారా? అన్న సందేహాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫుల్స్టాప్ పెట్టారు. రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి ఫలాలు అందాలనే లక్ష్యంతో, అమరావతిని పరిపాలన రాజధానిగా ఉంచుతూనే.. ఏపీని మూడు మెగా సిటీల కేంద్రంగా తీర్చిదిద్దే భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. ఇప్పుడు స్టేట్ మొత్తం ఈ డెవలప్మెంట్ మోడల్ గురించే చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏ మోడల్ బెటర్ అన్న పాయింట్.. రాష్ట్ర రాజకీయాల్లో కీ పాయింట్గా మారింది. ఆంధ్రప్రదేశ్లో సమగ్ర, సమతుల్య అభివృద్ధి సాధించడానికి సీఎం చంద్రబాబు మూడు నగరాలను మెగా సిటీలుగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. అవే.. విశాఖ, అమరావతి, తిరుపతి. విశాఖ కేంద్రంగా ఏలూరు వరకు, అమరావతి కేంద్రంగా ప్రకాశం వరకు, తిరుపతి కేంద్రంగా రాయలసీమ మొత్తాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మూడు మెగా సిటీలు వస్తాయని, గ్రీన్ ఎనర్జీ, హార్టికల్చర్ హబ్, నాలెడ్జ్ ఎకనామీకి చిరునామాగా రాయలసీమ మారబోతుందన్నారు.
ఈ మధ్యే మాజీ సీఎం జగన్.. అమరావతికి ఆల్టర్నేట్గా మావిగన్ కారిడార్ని తెరపైకి తెచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపే 110 కిలోమీటర్ల డెవలప్మెంట్ కారిడార్ని జగన్ ప్రతిపాదించారు. రాష్ట్ర అమరావతి లాంటి గ్రీన్ ఫీల్డ్ సిటీ కోసం 2 లక్షల కోట్లు ఖర్చు చేయడం కంటే, ఇప్పటికే ఉన్న మౌలిక వసతులను వాడుకుంటూ ఈ కారిడార్ని అభివృద్ధి చేస్తే లక్షా 90 వేల కోట్లు ఆదా అవుతాయనేది జగన్ వాదన. విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా బలోపేతం చేస్తూనే, ఈ కారిడార్ను.. ఆర్థిక హబ్గా మార్చాలని ప్రతిపాదించారు.
అయితే, మావిగన్ పట్ల ఏపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయ్. ఇప్పుడు చంద్రబాబు ప్రస్తావించిన మెగా సిటీలను ఐటీ, టూరిజం, మౌలిక వసతులు, హాస్పిటాలిటీ రంగాల్లో అంతర్జాతీయ స్థాయి హబ్లుగా మార్చేలా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఓవరాల్గా అమరావతి ఒక్కటే రాజధానిగా ఉంటుంది. అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రధాన కేంద్రాల ద్వారా ఆర్థిక వృద్ధిని సాధించే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు సీఎం చంద్రబాబు.
రాజధాని అంటే, ఇటుకలు, సిమెంట్ కాదని, ఆంధ్రుల ఆత్మగౌరవమని చెబుతున్నారు. చంద్రబాబు విజన్లో అమరావతి ఓ నాలెడ్జ్ ఎకానమీ హబ్. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుతో పరిపాలనా కేంద్రంగా ఉంటుంది. ఇన్నర్ రింగ్ రోడ్లు, మెట్రో రైల్ ప్రాజెక్టులతో అమరావతిని గ్లోబల్ సిటీగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దడమే బాబు ప్లాన్ గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలతో కలిసి.. విశాఖను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మార్చనున్నారు. పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, ఫార్మా రంగాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా ఉపాధి కల్పనకు అవకాశాలున్నాయ్. అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా వైజాగ్ని తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇక రాయలసీమ అభివృద్ధికి తిరుపతిని కేంద్ర బిందువుగా మార్చబోతున్నారు. ఇప్పటికే ఉన్న మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను విస్తరించి, తిరుపతిని ఇండియాలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ హబ్గా మార్చే ఆలోచనతో ఉన్నారు సీఎం. అనంతపురం నుంచి చిత్తూరు వరకు ఉన్న ప్రాంతాన్ని ఆటోమొబైల్ హబ్గా డెవలప్ చేయాలనే ప్లాన్తో ఉన్నారు. అంతేకాదు, ఆధ్యాత్మికతతో పాటు సర్వీస్ సెక్టార్ను పెంచి ఆర్థికంగా బలోపేతం చేయనున్నారు. చంద్రబాబు విజన్ వెరీ క్లియర్. రాజధాని వికేంద్రీకరణ కంటే, అభివృద్ధి వికేంద్రీకరణతోనే ఎక్కువ మేలు జరుగుతుందని నమ్ముతన్నారు. పరిపాలన అంతా రాజధాని అమరావతి నుంచి జరుగుతుంది. సంపద సృష్టి మాత్రం.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి జరిగేలా భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదించిన మూడు మెగా సిటీల ప్రణాళిక.. ఏపీ భవిష్యత్తుకు ఓ బ్లూ ప్రింట్ లాంటిది. ఇది, కేవలం భవనాల నిర్మాణమే కాదు. రాబోయే తరాల తలరాతను మార్చబోయే ప్రణాళిక. ఇది గనక వర్కవుట్ అయితే.. రాబోయే కొన్నేళ్లలోనే ఏపీ రూపురేఖలు మారిపోవడం ఖాయం. ఎప్పుడైతే అభివృద్ధి రాష్ట్రమంతటా విస్తరిస్తుందో.. అప్పుడే అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు, ప్రజలందరికీ సమాన అభివృద్ధి ఫలాలు దొరుకుతాయ్. అందుకోసమే.. సీఎం చంద్రబాబు మెగా సిటీల అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు. ఒక్క అమరావతిపైనే కాకుండా, విశాఖ, తిరుపతి నగరాలను కూడా సమాన స్థాయిలో ఎకనమిక్ గ్రోత్ ఇంజిన్లుగా మార్చాలనేదే బాబు మాస్టర్ ప్లాన్.
చంద్రబాబు విజన్ ఇప్పుడు ఒకటే. వన్ క్యాపిటల్ – త్రీ గ్రోత్ ఇంజిన్స్. ఇదే కాన్సెప్ట్ని ఫాలో అవుతున్నారు. అమరావతి పరిపాలనా రాజధానిగా ఉన్నప్పటికీ, విశాఖ, తిరుపతిని గ్లోబల్ హబ్లుగా తీర్చిదిద్దడం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజధాని అమరావతిని.. అత్యాధునిక టెక్నాలజీకి నిలయమైన క్వాంటం వ్యాలీగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎడ్యుకేషన్, రీసెర్చ్, సుస్థిరమైన నగర జీవనానికి ఇది కేరాఫ్. ఇక.. విశాఖను గ్లోబల్ డేటా సెంటర్ హబ్గా మార్చేందుకు గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలతో భారీ ఒప్పందాలు చేసుకున్నారు. ఇది ఏపీకి ఐటీ, పారిశ్రామిక ఊపిరిగా నిలవనుంది. తిరుపతిని.. ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా, మొబైల్ మాన్యుఫాక్చరింగ్, స్పేస్ టెక్నాలజీ, సెమీ కండక్టర్ల హబ్గా తిరుపతిని అభివృద్ధి చేస్తున్నారు. గతంలో మూడు రాజధానుల చర్చ జరిగినప్పుడు పరిపాలన వికేంద్రీకరణపై దృష్టి ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం.. అభివృద్ధి వికేంద్రీకరణ మీద దృష్టి పెట్టింది.
ప్రాంతీయ సమానత్వం కోసమే.. చంద్రబాబు ఈ 3 మెగా సిటీల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమైతే మిగిలిన ప్రాంతాల్లో వెనుకబాటుతనం, అసంతృప్తి పెరుగుతాయి. 3 మెగా సిటీల వల్ల ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలకు సమాన ప్రాధాన్యత దక్కుతుంది. ప్రకృతి వైపరీత్యాలు గానీ, ఇతర కారణాల వల్ల ఒక నగరం ప్రభావితమైనా, మిగిలిన ఆర్థిక కేంద్రాలు రాష్ట్రాన్ని ఆదుకుంటాయి. అయితే, రాజధాని అమరావతి నిర్మాణానికి, విశాఖలో ఇన్ఫ్రాకు వేల కోట్లు కావాలి. కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉన్నప్పటికీ, ప్రైవేటు పెట్టుబడులు భారీగా రావాల్సి ఉంది. ఇక, మూడు నగరాల మధ్య హై స్పీడ్ కనెక్టివిటీ ఉండాలి. ఎయిర్పోర్టులు, ఎక్స్ప్రెస్వేల ప్రణాళికలు కాగితాలు దాటి రియాలిటీలోకి రావాలి. ఇలాంటి మెగా ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే.. కొంత సమయం పడుతుంది. పరిపాలనలోనూ, ప్రభుత్వంలోనూ స్థిరత్వం ఉండాలి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారితే.. పెట్టుబడిదారులు వెనకడుగు వేస్తారు.
చంద్రబాబు మెగా సిటీస్ విజన్ గనక వర్కవుట్ అయితే, ఏపీ సన్ రైజ్ స్టేట్.. స్టేటస్ నుంచి సూపర్ పవర్ స్టేట్గా మారుతుంది. వరల్డ్ క్లాస్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాక్-టు-వర్క్ కల్చర్ లాంటివి.. ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతాయి. గ్రీన్ హైడ్రోజన్, చిప్ డిజైనింగ్, ఏఐ రంగాల్లో ఏపీ గ్లోబల్ లీడర్ అయ్యే అవకాశం ఉంది. మూడు ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగితే, ఆదాయ అసమానతలు తగ్గి అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ మూడు మెగా సిటీలను.. టూరిజం, ఐటీ సహా వివిధ పరిశ్రమలకు కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి.. ఈ మెగా సిటీలను నివాసయోగ్యంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి. అమరావతి రాజధానిగా ఉంటే.. ఏపీకి ఓ అడ్రస్ క్రియేట్ అవుతుంది. మూడు మెగాసిటీల ప్రణాళిక అమల్లోకి వస్తే.. రాష్ట్రానికి ఆదాయం, యువతకు ఉద్యోగాలు లభిస్తాయ్.
Also Read:ప్రకాశం జనసేనలో ‘మూడు ముక్కల’ రాజకీయం.. త్వరలో రాబోయే ముప్పు ఇదేనా?
Story by: Anup, Big Tv