Accident Cases: కొడుకు తప్పు చేస్తే.. తండ్రి దండించైనా దారిలోకి తెస్తాడు. కానీ, అధికారాన్ని అడ్డం పెట్టుకున్న ఈ నేతలు మాత్రం.. కొడుకులు చేసిన దారుణమైన తప్పులను కప్పిపుచ్చేందుకు వ్యవస్థలనే వెపన్లుగా మార్చుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… ఒక కేసులో తండ్రిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన పోలీసులు, మరో కేసులో మాత్రం కనీసం ముట్టుకోవడానికి కూడా సాహసించడం లేదు.
సాక్ష్యాలు తారుమారు..
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు.. యాక్సిడెంట్ కేసు నుంచి తన కొడుకు ఆరవ్ను తప్పించేందుకు సాక్ష్యాలు తారుమారు చేశారంటూ పోలీసులు అరెస్ట్ చేసి జైల్కి పంపించారు. ఇప్పుడు పాతపట్నంలో ఎమ్మెల్యే కుమారుడు చేసిన యాక్సిడెంట్ బయటకు వచ్చింది. 2024లో పాతపట్నం టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు సాయి గణేశ్.. కారుతో ఓ ఆటోను ఢీకొట్టాడు. ప్రమాదంలో చేపల భోగయ్య ప్రాణాలు విడిచాడు. ఎమ్మెల్యే గోవిందరావు కూడా సేమ్ సీదిరి అప్పలరాజు ప్లానే అమలు చేశారు. కొడుకు ప్లేస్లో మరో డ్రైవర్ను నిలబెట్టారు.
బాధితులతో సీక్రెట్ సెటిల్మెంట్..
బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయలు, ఉద్యోగం ఇప్పిస్తామంటూ బాధితులతో సీక్రెట్ సెటిల్మెంట్ చేసుకున్నారు. ఏడాది దాటిపోయినా బాధితులకు న్యాయం అందలేదు. దీంతో ఆనాడు ఎమ్మెల్యే చేసిన సెటిల్మెంట్ వీడియోను బయటపెట్టారు బాధితులు. సీదిరి విషయంలో విరుచుకుపడిన చట్టం.. ఎమ్మెల్యే గోవిందరావు ముంగిట ఎందుకు మోకరిల్లుతోందని నిలదీస్తున్నారు. దానయ్య ప్రాణానికి ఒక న్యాయం.. భోగయ్య ప్రాణానికి మరో న్యాయమా? అనే ప్రశ్నల ప్రవాహం మొదలైంది.