Marathi Crime Drama on OTT: రైతుల భూములు పోతే వారి జీవితాలు మాత్రమే కాదు, తర్వాతి తరం భవిష్యత్తు కూడా ఎలా మారిపోతుందో కళ్లకు కట్టినట్లు చూపించిన పవర్ఫుల్ మరాఠీ క్రైమ్ డ్రామానే ‘ముల్షీ ప్యాటర్న్’ (Mulshi Pattern). 2018లో విడుదలైన ఈ సినిమా మరాఠీ చిత్ర పరిశ్రమలో సంచలన విజయాన్ని అందుకుంది. కేవలం గ్యాంగ్స్టర్ కథలా కాకుండా, భూమిని కోల్పోయిన ఒక రైతు కుటుంబం పరిస్థితులు ఒక యువకుడిని నేర ప్రపంచంలోకి ఎలా నెట్టాయనే అంశాన్ని చాలా రా అండ్ రియలిస్టిక్గా చూపించడం ఈ సినిమాకు ప్రత్యేకత. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
పూణే నగర శివార్లలోని ముల్షీ ప్రాంతంలో కథ మొదలవుతుంది. నగరం విస్తరిస్తున్న కొద్దీ అక్కడి వ్యవసాయ భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడుతుంది. అభివృద్ధి పేరుతో స్థానిక రైతుల నుంచి భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేస్తుంటారు. అదే పరిస్థితికి సఖారామ్ అనే రైతు కుటుంబం కూడా బలవుతుంది. తమకు ఉన్న భూమి కోల్పోవడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో పడుతుంది.
సఖారామ్ కొడుకు రాహుల్ తన తండ్రి పడుతున్న కష్టాలను దగ్గర నుంచి చూస్తుంటాడు. ఒకప్పుడు తమకంటూ భూమి, గౌరవం ఉన్న కుటుంబం. పరిస్థితులు మారడంతో ఇతరుల ముందు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితులు రాహుల్ మనసులో సమాజంపై తీవ్రమైన కోపాన్ని పెంచుతాయి. అక్కడి నుంచే అతని జీవితం మరో మలుపు తిరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశ, తన తండ్రిని అవమానించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే కసి అతన్ని నేర ప్రపంచం వైపు నడిపిస్తాయి. మొదట చిన్నచిన్న నేరాలతో ప్రారంభమైన అతని ప్రయాణం క్రమంగా పెద్ద క్రిమినల్ నెట్వర్క్లోకి తీసుకెళ్తుంది.
ఒక సాధారణ రైతు కొడుకుగా ఉన్న రాహుల్ చివరకు పూణేలోనే భయంకరమైన గ్యాంగ్స్టర్గా ఎలా ఎదిగాడు ? డబ్బు, అధికారం వచ్చిన తర్వాత అతని జీవితం నిజంగా సంతోషంగా మారిందా ? క్రైమ్ ప్రపంచంలోకి వెళ్లిన తర్వాత అతను ఎదుర్కొన్న ప్రమాదాలు ఏమిటి ? అతన్ని పట్టుకోవడానికి రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్తో అతని పోరాటం ఎలాంటి మలుపులు తీసుకుంది ? చివరకు రాహుల్ జీవితానికి ఎలాంటి ముగింపు దక్కింది ? అనేదే సినిమాలో చూసి తెలుసుకోవలసిన కథ.
హీరోగా ఓం భూత్కర్ రాహుల్ పాత్రకు ప్రాణం పోశారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో దర్శకుడు ప్రవీణ్ తార్డే కూడా ఆకట్టుకున్నారు. ఉపేంద్ర లిమాయే, మోహన్ జోషి కీలక పాత్రల్లో నటించారు. ప్రవీణ్ తార్డే దర్శకత్వం వహించిన ఈ సినిమా యాక్షన్, క్రైమ్ డ్రామా అంశాలతో సాగుతుంది. ముఖ్యంగా రైతుల భూములు కోల్పోవడం, పేదరికం, అవమానం, యువతలో పెరిగే కోపం చివరకు వారిని నేరాల వైపు ఎలా నడిపిస్తాయనే సామాజిక కోణాన్ని సినిమా బలంగా చూపిస్తుంది. ఈ కథకు ఉన్న ప్రభావంతోనే తర్వాత సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ ప్రధాన పాత్రల్లో ‘అంతిమ్: ది ఫైనల్ ట్రూత్’ పేరుతో హిందీలో రీమేక్ కూడా వచ్చింది. తీవ్రమైన హింస, అసభ్య పదజాలం కారణంగా ఈ సినిమాను చిన్న పిల్లలతో కలిసి చూడకపోవడమే బెటర్. ‘ముల్షీ ప్యాటర్న్’ రా అండ్ రియలిస్టిక్ క్రైమ్ డ్రామాలను ఇష్టపడే పెద్దలకు ఈ మూవీ మంచి ఛాయిస్. ప్రస్తుతం ZEE5లో ఒరిజినల్ మరాఠీ వెర్షన్లో అందుబాటులో ఉంది.
Read Also: రోడ్డు పేరుతో రైతుల భూములు కొట్టేయాలని ప్లాన్… మహిళ తిరుగుబాటుతో మొత్తం సిస్టమ్ షేక్