TDP vs YSRCP: ఏపీలో నేతల విమాన ప్రయాణాలు కాక రేపుతున్నాయ ?…ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న వైసీపీ ఆరోపణల్లో నిజం ఎంత..? గతంలో విచ్చలవిడిగా జగన్ విమాన ప్రయాణాలు చేశారంటూ టీడీపీ బయటపెట్టిన ఆధారాలు సరైనవేనా..? దీంతో సోషల్ మీడియాలో వైసీపీ, టీడీపీ మధ్య నెలకొన్న వార్..ఎటువైపు దారి తీస్తుంది..?
ఏపీ రాజకీయం నిత్యం కుతకుతలాడుతూనే ఉంటుంది. ఏదో ఒక టాపిక్.. రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తూనే ఉంటుంది. తాజాగా విమాన ప్రయాణాలపై ఏపీ రాజకీయంలో నిప్పు రాజుకుంది. గత ప్రభుత్వం చేసిన.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న విమాన ఖర్చులపై రచ్చ నెలకొంది.
కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ పర్యటనలకు విచ్చలవిడిగా విమానాలు, హెలికాఫ్టర్లు వాడుతున్నారని వైసీపీ నేతలు తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు ప్రతివారం తమ ప్రైవేటు పర్యటన కోసం హైదరాబాద్ వస్తూ భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కొంతకాలంగా వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ విమానంలో పర్యటనల లెక్కలు చెబుతూ సోషల్ మీడియాలో పెట్టడం చర్చకు దారితీసింది. ఇక విమాన ప్రయణాల ఖర్చులను బినామీలు ఖర్చు పెడుతున్నారని వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఆరోపించారు. ఎవరు డబ్బు ఖర్చు చేస్తే విమానాల్లో తిరుగుతున్నారో చేప్పే దైర్యం ఉందా అని ప్రశ్నించారు పేర్ని నాని.
ముఖ్యంగా మంత్రి లోకేశ్ పర్యటనలను టార్గెట్ చేస్తూ..వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక…80 సార్లకు పైగా మంత్రి లోకేష్ విమాన ప్రయాణాలు చేశారని…ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడుతోంది.
వైసీపీ సోషల్ మీడియాకు టీడీపీ సోషల్ మీడియా ఆర్టీఐ నుంచి సేకరించిన సమాచారం ద్వారా కౌంటర్ ఎటాక్ చేస్తోంది. మంత్రిగా లోకేశ్ తన విమాన ప్రయాణాలకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆధారాలు బయటపెట్టింది. లోకేశ్ రాష్ట్రమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన అధికారిక కార్యక్రమానికి వెళ్లినా తన సొంత ఖర్చులతోనే ప్రయాణాలు చేస్తున్నారని వెల్లడించింది. వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా మంత్రి లోకేశ్ విమాన టూర్లకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోలేదని టీడీపీ కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు.
ఈ క్రమంలో 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రి గా ఉన్న జగన్..ప్రజాధానాన్ని దుర్వినియోగం చేశారంటూ టీడీపీ సోషల్ మీడియా ఆర్టీఐ సమాచారంతో ట్రోలింగ్ మొదలు పెట్టింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో 222 కోట్ల రూపాయల ప్రజాధనంతో విమాన ప్రయాణాలు చేశారని టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజాధనంతో హెలికాఫ్టర్లు, ప్రత్యేక విమానాల్లో తిరిగారని, ఏడాదికి సరాసరి 50 కోట్లు ఖర్చు చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. అంతేకాకుండా కరోనా కాలంలో కూడా జగన్ హెలికాప్టర్లలోనే విలాసంగా తిరిగారని మండిపడుతోంది. ఇక ఆయన వ్యక్తిగతంగా లండన్ వెళ్లిన సందర్భంలోనూ ప్రభుత్వ ధనాన్నే వినియోగించారని టీడీపీ సోషల్ మీడియా చురకలంటిస్తోంది. జగన్ నివాసం ఉన్న తాడేపల్లి నుంచి పక్కనే ఉన్న గుంటూరు వెళ్లాలన్నా.. హెలికాఫ్టర్ వినియోగించారని సెటైర్లు వేస్తోంది.
అయితే టీడీపీ, వైసీపీలు ..అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా…ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా నేతలు వ్యవహారిస్తున్నారనే చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తుందట. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలందూ హైదరాబాద్లోనే మకాం వేశారని ఫ్యాన్ పార్టీ నేతలు అప్పట్లో ఆరోపించిన సందర్భాలున్నాయి. ఏపీకి వాళ్లకు సంబంధంలేదనే విధంగా వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక అధికారం కొల్పోయిన తర్వాత కూటమి నేతలు…వైసీపీ నేతలనుద్దేశించి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. ఓడిపోయిన తర్వాత జగన్ ..తన మకాంను బెంగుళూరుకు మార్చేశారనే….చుట్టం చూపుగా రాష్ట్రానికి వస్తున్నారని కూటమి నేతల ప్రస్తుతం విమర్శిస్తున్నారు. జగన్ వీకెండ్ పొలిటిషన్గా మారిపోయారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు.
మొత్తానికి విమాన ప్రయాణాలపై సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ మధ్య వార్ అయితే నడుస్తోంది. మీరు వృథా ఖర్చు అంటే…కాదు కాదు..మీదే వృథా ఖర్చంటే…ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అయితే రెండు పార్టీల విమర్శల మధ్య ప్రజలు మాత్రం..తాము పన్నులు కడుతుంటే..వీళ్లు విలాసాలు చేస్తున్నారని ముక్కున వేలేసుకుంటున్నారట.
Story By Kishan, Big Tv