Bandi Bhagirath: మొన్నటి నుంచి ఇవే తరహా ప్రశ్నలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. రాజకీయ నాయకుల వారసులు అంటే.. సమాజానికి రోల్ మోడల్గా ఉండాలి. కానీ తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా మాజీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పేరు ఇప్పుడు వైరల్గా మారుతోంది. ఏదైనా ఘనకార్యం చేసినందుకు కాదు.. వివాదాలకు కేంద్ర బిందువు అయినందుకు. ముఖ్యంగా మైనర్ల పట్ల అమానుషంగా ప్రవర్తించారనే ఆరోపణలతో నమోదైన పోక్సో కేసు ఇప్పుడు సంచలనంగా మారింది.
బండి భగీరథ్.. బీజేపీ ప్రముఖ నేత, ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమారుడు. నిజానికి బండి భగీరథ్ పేరు గతంలోనే బయటికి వచ్చింది. మహీంద్రా యూనివర్సిటీలో తోటి విద్యార్థిపై ఆయన దాడి చేసిన వీడియోలు గతంలో తెగ వైరల్గా మారాయి. అప్పట్లోనే భగీరథ్ పేరు మారుమోగింది. కానీ ఇది చిన్న గొడవ.. ఫ్రెండ్స్ మధ్య జరిగిన చిన్న వివాదం అంటూ అప్పట్లో లైట్ తీసుకున్నారు. నిజానికి సాధారణంగా స్టూడెంట్స్ మధ్య ఇలాంటి గొడవలు జరిగితే.. కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తారు. కానీ భగీరథ్ విషయంలో రాజకీయ రక్షణ కవచం అడ్డుగా నిలిచిందనే విమర్శలు ఉన్నాయి.
గతంలో జరిగింది చిన్న గొడవ. కానీ ప్రస్తుతం కథ వేరు. ఏకంగా భగీరథ్పై పోక్సో నమోదైంది. మాములుగా వేధింపులకు సంబంధించిన సెక్షన్లతో పాటు.. బాధితురాలి స్టేట్మెంట్ తర్వాత ఏకంగా రేప్ కేసుకు సంబంధించిన సెక్షన్లను కూడా చేర్చారు. ఈ నెల 8న బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీఎన్ఎస్ 74, 75తో పాటు మైనర్పై లైంగిక వేధింపులకు సంబంధించి పోక్సో చట్టంలోని 11 రెడ్ విత్ 12 సెక్షన్ల కింద పేట్ బషీరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఎప్పుడైతే బాధితురాలి స్టేట్మెంట్ నమోదు చేశారో.. ఆ తర్వాత పోక్సో యాక్ట్లోని 5(1) రెడ్విత్ 6 సెక్షన్లు కూడా చేరాయి. దీంతో భగీరథ్ ఇప్పుడీ కేసులో మరింత ఇరుక్కున్నారు.
సాధారణ ఐపీసీ సెక్షన్లు వేరు.. పోక్సో కేసు వేరు. మైనర్లపై లైంగిక దాడులు లేదా వేధింపులకు పాల్పడినప్పుడు ఈ కఠిన చట్టాన్ని ఉపయోగిస్తారు. ఇలాంటి కేసులో ఒక కీలక నేత, కేంద్రమంత్రి కొడుకు ఉండటం సమాజానికి తప్పుడు సంకేతాలను పంపుతుందనే చెప్పాలి. ఒకవైపు బండి సంజయ్ ధర్మం, సంస్కృతి గురించి మాట్లాడుతుంటే.. ఆయన కొడుకు ఇప్పుడు ఓ మైనర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఈ కేసులో బండి భగీరథ్ ఇప్పటి వరకు అరెస్ట్ కాకపోవడం ఇప్పుడు మరో చర్చకు తెర లేపింది. మాములుగా పోక్స్ కేసులు నమోదైతే బెయిల్ కూడా రాదు. పోలీసులు వెంటనే నిందితులను అరెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఇక్కడే వివాదం పెరిగిందని చెప్పాలి. సామాన్యుడికి ఒక న్యాయం.. రాజకీయ నేతకు మరో న్యాయమా? అనే ప్రశ్నలు ప్రజల నుంచి మొదలయ్యాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పోలీసులు చెబుతున్నా.. భగీరథ్ కేసులో విచారణ నత్తనడకన సాగుతోందనేది అసలు విమర్శ. అధికార పార్టీలో ఉన్నా లేకపోయినా, రాజకీయ బలం ఉంటే చట్టం చుట్టం అవుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఈ కేసులో అసలు పోలీసులు ఏం చేయలేదా? అంటే చేశారు. కానీ ఎప్పుడూ అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. మాములుగా కేసు నమోదుకాగానే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. రెండు రోజుల పాటు కాలయాపన చేశారు. విపక్షాలు ప్రశ్నించడం.. సాధారణ ప్రజల ప్రశ్నల తర్వాత.. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయి ఆదేశాలు ఇస్తే కానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు కాలేదు. ఇప్పుడు విచారణ జరుగుతున్నా కానీ.. ఇంత రచ్చ జరిగితే కానీ విచారణ ప్రారంభించరా? అనేది ఇప్పుడు ప్రజలు వేస్తున్న ప్రశ్న.
ఇక భగీరథ్ తీరు కూడా వివాదస్పదమవుతోంది. రాజకీయ వారసత్వం అనేది బాధ్యతను పెంచాలి కానీ.. ఇతరులను వేధించే లైసెన్స్ కాకూడదనే చర్చ మొదలైంది. బండి భగీరథ్ తీరు పట్ల విద్యార్థి లోకం, సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టం పట్ల భయం లేని ప్రవర్తన భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారుతుందంటున్నారు. రాజకీయ నాయకుల వారసులు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి, వరుస వివాదాలతో వార్తల్లో నిలవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆందోళన కలిగించే అంశం. ఒకవైపు తండ్రి ప్రజాప్రతినిధిగా వ్యవస్థలో మార్పు కోసం పోరాడుతున్నామని చెబుతుంటే, మరోవైపు ఆయన కొడుకు తీరేమో ఇలా ఉంది. హింసకు ప్రేరేపించడం లేదా మైనర్లతో ముడిపడి ఉన్న సున్నితమైన కేసుల్లో ఇరుక్కున్నారు.
రాజకీయ బలం ఉంటే ఏమైనా చేయవచ్చనే ధీమా భగీరథ్ ప్రవర్తనలో కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. ఇది కేవలం ఒక స్టూడెంట్ గొడవ కాదు, అధికారం తలకెక్కిన అహంకారానికి నిదర్శనమనే చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలలో భగీరథ్ తోటి విద్యార్థులను తిడుతూ, కొడుతూ కనిపించినప్పుడే రాజకీయ అహంకారం అతడిలో ఉందనే చర్చ మొదలైంది.
అంతేకాదు చదువుకోవాల్సిన వయసులో కోర్టులు, స్టేషన్ల చుట్టూ తిరుగుతూ తండ్రి రాజకీయ భవిష్యత్తును ఇబ్బందుల్లోకి నెట్టాడు భగీరథ్. అంతేకాదు రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తిపై ఫిర్యాదు చేయడానికి బాధితులు భయపడేలా చేయడం కూడా వివాదాన్ని పెద్దది చేసింది. ప్రస్తుతం బండి సంజయ్ ఈ వ్యవహారాన్ని ఎలా సమర్థించుకోవాలో అర్థం కానీ పరిస్థితుల్లో ఉన్నారు.
ఇదీ కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్ పరిస్థితి. కానీ ఇక్కడ అందరు గమనించాల్సింది ఒకటి ఉంది. ఈ కేసు ఇంత పాపులర్ అవ్వడానికి కొన్ని కారణాలున్నాయి. కేంద్రమంత్రి కొడుకు ఇందులో నిందితుడిగా ఉండటం.. కొన్ని పార్టీలు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం.. కొన్ని పార్టీలు ఈ ఇష్యూని ప్రముఖంగా ప్రచారం చేయడం.. సోషల్ మీడియా హ్యాండిల్స్లో వైరల్ చేయడం.. నిజానికి ప్రతిరోజూ చాలా పోక్సో కేసులు నమోదవుతున్నాయి.. కానీ వాటికి ఈ స్థాయి ప్రచారం ఉండదు. కానీ ఈ కేసు అలా కాదు. దానికి కారణాలు అనేకం. అంటే ఈ కేసును లైట్ తీసుకోవాలా? అంటే కాదు. కానీ దీని వెనక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయనేది బండి సంజయ్ చెబుతున్న మాట. తన పొలిటికల్ కేరీర్ను ఇబ్బందుల్లోకి నెట్టడానికి తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగుతున్నారనేది ఆయన ఆరోపణ. కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని.. అతిగా స్పందిస్తూ రాజకీయంగా తనను డ్యామేజ్ చేయాలని చూస్తున్నారంటూ మండిపడుతున్నారు.
పోలీసులు కూడా ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడికి నోటీసులు ఇచ్చారు. బాధితురాలి స్టేట్మెంట్ తర్వాత మరిన్ని బలమైన సెక్షన్లు నమోదు చేశారు. డీసీపీ రితూరాజ్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. నిందితుడి కోసం ఐదు బృందాలు గాలింపు కూడా చేపట్టాయి. భగీరథ్ తప్పు చేశాడా? లేదా? అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. కానీ ఈ ఘటన మాత్రం ఇప్పుడు బండి సంజయ్ పొలిటికల్ కెరీర్లో ఓ మాయని మచ్చగా మిగిలిపోవడం మాత్రం ఖాయం. దీనికి కారణం అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదవడమే. అసలీ చట్టం ఎందుకింత కఠినంగా ఉంది?
రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. బాధితుల్లో అనేక మంది చిన్నారులు కూడా ఉంటున్నారు. మైనర్లపై రోజురోజుకు పెరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకే కేంద్రం తీసుకొచ్చిన బ్రహ్మస్త్రం పోక్సో చట్టం. 2012లో Protection of Children from Sexual Offences పేరుతో ఈ చట్టాన్ని తీసుకు వచ్చారు. నార్మల్గా ఉండే సెక్షన్లకు.. ఈ చట్టం కింద నమోదయ్యే సెక్షన్లకు చాలా తేడా ఉంటుంది. శిక్షలు కఠినంగా ఉంటాయి. అమలు చేయడంలో కూడా కొన్ని తేడాలు ఉంటాయి.
Also Read: కేంద్రం తీరుపై రాఘవులు నిప్పులు.. శ్రీలంక గతే భారత్కు పడుతుందా?
ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రెన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ చట్టం ఉద్దేశం లైంగిక దాడుల నుంచి బాల బాలికలకు రక్షణ కల్పించడం. దేశంలో మహిళలపై, ముఖ్యంగా చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాలను అరికట్టడం. మైనర్లను మోసం చేయడం, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధాలు పెట్టుకోవడం, ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడడం వంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు భారతదేశం అత్యంత కఠినమైన చట్టాలలో ఒకటైన పోక్సోను అమలు చేస్తున్నది. ఈ చట్టం కింద 18 ఏళ్ల వయస్సు నిండని బాలబాలికలంతా మైనర్లే. మైనర్లపై జరిగే లైంగిక దాడుల కేసులను పోలీసులు ఈ చట్టం ప్రకారం నమోదు చేస్తారు. చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి నేరాలను కూడా ఈ చట్టం కవర్ చేస్తుంది. పోక్సో చట్టం ప్రకారం మైనర్ ఇష్టపూర్వకంగా లైంగిక సంబంధం పెట్టుకున్నా.. దానిని అత్యాచారం కిందనే పరిగణిస్తారు. ఎందుకంటే శారీరక, మానసిక, సామాజిక భద్రతను అర్థం చేసుకునే స్థితిలో మైనర్లు ఉండరని ఈ చట్టం చెబుతోంది. ఈ చట్టం అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది. అంటే బాలురు, బాలికలు ఇద్దరికీ రక్షణ ఉంటుంది.
2012లో భారత ప్రభుత్వం పోక్సో చట్టం తీసుకొచ్చింది. పిల్లల రక్షణ, వేగవంతమైన విచారణ, బాధితులకు మానసిక భరోసా, వారి ఐడెంటిని కాపాడటం, నిందితులకు కఠిన శిక్షలు ఈ చట్టం ప్రధాన లక్ష్యాలు. ఇది సాధారణ క్రిమినల్ చట్టాలకు భిన్నంగా, ప్రత్యేకంగా చిన్నారుల భద్రత కోసం రూపొందించిన చట్టం. పోక్సో చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం మైనర్తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం. ఈ నేరానికి కనీసం పదేళ్ల పాటు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు, జరిమానా ఉంటాయి. కేసు తీవ్రతను బట్టి కోర్టులు శిక్షను నిర్ణయిస్తాయి. పదేపదే దాడి చేయడం, బెదిరింపులు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం, మైనర్ గర్భం దాల్చడం, మోసం చేయడం వంటి సందర్భాల్లో కేసు సెక్షన్ 5 కింద నమోదవుతుంది. ఈ నేరానికి కనీసం 20 ఏళ్ల పాటు జైలు, లేదా జీవిత ఖైదు, అత్యంత తీవ్రమైన సందర్భాల్లో మరణశిక్ష కూడా పడుతుంది.
అంతేకాదు పోక్సో చట్టం ప్రకారం అసభ్యకరమైన సందేశాలు పంపడం, న్యూడ్ ఫొటోలు పంపాలని అడగడం, ఫోన్, సోషల్ మీడియాలో వేధించడమూ నేరమే. ఇలాంటి నేరాలకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటాయి. ఈ చట్టం ప్రకారం పెళ్లి చేసుకుంటానని అబద్ధపు హామీ ఇచ్చి శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని తీవ్రమైన నేరం. చాలా సందర్భాల్లో బాధితులు ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు నిందితులు బెదిరింపులకు పాల్పడుతారు. వీటిని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది.
పోక్సో కేసులు సాధారణంగా నాన్ బెయిలబుల్ కేసులే. పోలీసులు కోర్టు వారంట్ లేకుండానే నిందితుడిని అరెస్ట్ చేయవచ్చు. చట్టపరమైన విచారణలో సాక్షాలు చాలా కీలకం. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సందేశాలు, కాల్ రికార్డింగ్స్, ఫొటోలు, వీడియోలు, ఒకవేళ బాధితురాలు గర్భం దాల్చితే మెడికల్ రిపోర్ట్స్, సాక్షుల స్టేట్మెంట్స్, హోటల్, ట్రావెల్ రికార్డ్స్, సీసీ కెమెరా దృశ్యాలు కేసులో ఆధారాలుగా ఉపయోగపడుతాయి. డిజిటల్ ఆధారాలు ఇప్పుడు కోర్టుల్లో చాలా కీలకమనే చెప్పాలి. ఈ కేసుల్లో బాధితురాలి స్టేట్మెంట్ను మేజిస్ట్రేట్ ముందు నమోదు చేస్తారు. కేసు తీవ్రతను బట్టి నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి. పోలీసులు విచారణ పూర్తి చేసి పూర్తి ఆధారాలతో చార్జిషీట్ను కోర్టుకు సమర్పిస్తారు. ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతుంది.
Also Read: చంద్రబాబు కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీలో పొదుపు ఫార్ములా, వారానికి ఒకరోజు ‘నో వెహికిల్ డే’
చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకం. వారిది ఏ కుటుంబం? వారి రాజకీయ నేపథ్యం ఏంటి? ఆర్థిక స్థితి ఏంటి? అనేది విచారణ సమయంలో అనవసరం. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా కోర్టులో తనను తాను రక్షించుకునేందుకు పూర్తి హక్కు ఉంది. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి, బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని చెప్పినా నేర తీవ్రత తగ్గదు. పోక్సో చట్టం స్పెషాలిటీ ఏంటంటే.. సాధారణ చట్టాల్లో నేరం జరిగినట్లు బాధితుడు నిరూపించాలి. కానీ పోక్సో చట్టంలోని ప్రత్యేకత ఏంటంటే నిందితుడు తాను నిర్దోషిని అని నిరూపించుకోవాలి. కోర్టు ప్రాథమికంగా బాధితుల స్టేట్మెంట్ను నిజమని నమ్ముతుంది. అంతేకాదు విచారణ సమయంలో పిల్లలు భయపడకుండా ఉండటానికి నిందితుడిని నేరుగా ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక కోర్టులు ఉంటాయి. కేసు నమోదైన ఏడాది లోపు విచారణ పూర్తి కావాలనే నిబంధన కూడా ఉంది.
2019లో ఈ చట్టానికి కొన్ని మార్పులు చేశారు. అంతకుముందు కఠిన శిక్షలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మరణశిక్షను కూడా చేర్చారు. ముందు కనీసం 7 సంవత్సరాలుగా ఉన్న శిక్షను.. ఇప్పుడు కనీసం 10 సంవత్సరాలుగా మార్చారు. 16 ఏళ్ల లోపు పిల్లలపై దాడికి కనీసం 20 సంవత్సరాల జైలు లేదా జీవితఖైదును చేర్చారు. అంతేకాదు ఎవరైనా పిల్లలపై లైంగిక దాడి జరిగిన విషయం తెలిసినా పోలీసులకు చెప్పకపోతే, వారిపైనా చర్యలు తీసుకునే అవకాశాన్ని ఈ చట్టం ఇచ్చింది.
పోక్సో చట్టం ఇంత పటిష్టంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వ్యక్తిగత కక్షల కోసం ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మందికి ఈ చట్టంపై అవగాహన లేకపోవడంతో నేరాలు బయటకు రావడం లేదు. కానీ ఈ చట్టం వచ్చిన తర్వాత సమాజంతో పాటు రాజకీయాల్లో కూడా కొన్ని మార్పులు వచ్చాయి.
అందుకే మైనర్ల పట్ల మాత్రమే కాదు.. మహిళల పట్ల కూడా చాలా గౌరవంగా ఉండాలి. లేదంటే మన జీవితాలను అధఃపాతాళానికి తొక్కేసే చట్టాలు ఉండనే ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
Also Read: బంగారం కొనొద్దు.. ప్రయాణాలు వద్దు! సామాన్యుడిపై యుద్ధ సెగ.. మోడీ మాస్టర్ ప్లాన్ ఇదే!
Story by: Anup, Big Tv