Fuel Price Hike: ఆయిల్ బాయిల్ అవుతోంది.. ఫ్యూయల్ మండిపోతోంది.. పెరుగుతున్న గ్యాస్, పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు.. సామాన్యుల బడ్జెట్ని తలకిందులు చేసేస్తున్నాయ్. ఇటీవలే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 3 రూపాయల చొప్పున పెంచితేనే.. అంతా గగ్గోలు పెడుతున్నారు. 48 గంటల్లోనే.. సీఎన్జీ రేట్లు రెండు సార్లు పెరిగాయ్. పెట్రోల్, డీజిల్తో సమానంగా సీఎన్జీ కూడా 3 రూపాయలు పెరిగింది. ఇలాంటి సమయంలో.. ఇండియాలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయనే అంచనాలు.. అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయ్. ఆయిల్ కంపెనీల నష్టాలు తగ్గాలంటే.. మరో 10 రూపాయల మేర పెంచే అవకాశముందని రిపోర్టులు వస్తున్నాయ్. దాంతో.. సామాన్యులకు భారీ షాక్ తప్పదనే ప్రచారం టెన్షన్ పెడుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో.. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోతున్నాయ్. ఫలితంగా దేశంలోనూ ధరలు పెంచకపోతే ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నష్టాలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను 3 రూపాయల మేర పెంచింది. అంతకుముందే ప్రభుత్వం ఇంధనాలపై ఎక్సైజ్ డ్యూటీలో లీటరుకు 10 రూపాయలు కోత పెట్టింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నష్టాలను సగానికైనా తగ్గించుకునేందుకు.. వచ్చే రెండు, మూడు వారాల్లో లీటరుకు మరో 10 రూపాయల చొప్పున పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ పెంపు ఒకేసా ఉంటుందా? విడతల వారీగా ఉంటుందా? అనే దానిమీదే సస్పెన్స్ నెలకొంది. 48 గంటల గ్యాప్లోనే సీఎన్జీ రేట్లు రెండు సార్లు పెరిగాయ్. ఈ నెల 15న.. సీఎన్జీ రేట్లు కిలోకు 2 రూపాయలు పెంచారు. లేటెస్ట్గా.. కిలో సీఎన్జీపై మరో రూపాయి పెంచారు. 3 రోజుల గ్యాప్లోనే సీఎన్జీ వాహనదారులపై మూడు రూపాయల అదనపు భారం పడింది.
పెంచిన రేట్లతో హైదరాబాద్లో సీఎన్జీ కిలో ధర వందకు చేరింది. ఈ రేట్ల పెంపుతో వాహనదారులపై ఇంధన భారం మరింత పెరిగింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలే.. ఆకస్మిక ధరల పెంపునకు మెయిన్ రీజన్. ఇప్పటికే ఫ్యూయర్ ఫైర్ తట్టుకోలేకపోతున్న సామాన్యులకు.. ఈ రేట్లు.. బల్లెం పోట్లలా మారాయ్. పశ్చిమాసియాలో యుద్ధం, హర్మూజ్ జలసంధిలో విధించిన ఆంక్షలతో.. గ్యాస్, చమురు ట్యాంకర్ల రవాణా నిలిచిపోయింది. ఈ పరిణామాలతో.. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భారీగా పెరిగిపోయాయ్. దేశీయంగానూ ఇంధన ధరలను పెంచక తప్పట్లేదు. నిరంతరం పెరుగుతున్న ధరలు.. సామాన్య, మిడిల్ క్లాస్ వాహనదారుల జేబులు చిల్లు పెడుతున్నాయ్.
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 10 డాలర్ల మేర పెరిగితే.. ఇండియాలో ద్రవ్యోల్బణం 0.3 శాతం మేర పెరుగుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. కరెంట్ అకౌంట్ లోటు కూడా 0.3 శాతం మేర పెరుగుతుందని చెబుతున్నారు. ముడి చమురు ధరల్లో పెరుగుదల కారణంగా.. ఇప్పటికే జీడీపీ కుదింపునకు సంబంధించిన అంచనాలు బయటకొస్తున్నాయ్. దేశీయంగా ఇంధన ధరలు 3 నుంచి 5 శాతం మేర పెరిగితే.. రిటైల్ ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. మన దేశంలో లీటరు పెట్రోల్ 3 రూపాయలు పెరిగితేనే.. తెగ ఫీలైపోతుంటాం. వాహనాలు బయటకు తీయాలంటే.. ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం.
Also Read: జుట్టు చూస్తే ట్రంప్.. రూపం చూస్తే దున్నపోతు.. సోషల్ మీడియాను ఊపేస్తున్న వింత జీవి!
కానీ, మార్చ్ నెల నుంచే ప్రపంచవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ ధరలని చూస్తే.. మైండ్ బ్లాంక్ అవుతుంది. మిగతా దేశాలతో పోలిస్తే.. మన దగ్గర పెరిగిన 3 రూపాయలు చాలా తక్కువని అర్థమవుతుంది. పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం మొదలయ్యాక.. ప్రపంచంలోనే అత్యధికంగా పెట్రోల్ ధరలు పెరిగిన దేశాల్లో.. మన పొరుగున ఉన్న మయన్మార్, పాకిస్థాన్.. మొదటి వరుసలో ఉన్నాయ్. ఫిబ్రవరి నుంచి ఇక్కడ లీటర్ పెట్రోల్ రేటు ఏకంగా 54 నుంచి 67 రూపాయల దాకా పెరిగింది. అక్కడ నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, ఇంధన కొరత కారణంగా.. జనాలు పెట్రోల్ కొనాలంటేనే భయపడే స్థాయిలో రేట్లు పెంచేశారు.
అగ్రరాజ్యం అమెరికా, కెనడాలోనూ.. ఫ్యూయర్ ఫైర్ గట్టిగానే తగిలింది. మన కరెన్సీలో చెప్పాలంటే.. ఈ రెండు దేశాల్లో లీటరుకు 38 రూపాయల వరకు పెరిగింది. మలేషియాలోనూ లీటర్పై 36 రూపాయలు పెరిగింది. ఇక, ఎప్పుడూ ఇంధన నిల్వలు పుష్కలంగా ఉండే గల్ఫ్ దేశం యూఏఈలోనూ.. లీటరుకు 28 రూపాయలు పెరిగింది. చైనాకు కూడా ఇంధన ధరల సెగ గట్టిగానే తగిలింది. డ్రాగన్ కంట్రీలో.. లీటరుకు 27 రూపాయలు పెరిగింది. ఇక యూరప్ దేశాల విషయానికొస్తే.. ఫ్రాన్స్లో 13, యూకేలో 11 రూపాయల చొప్పున పెట్రోల్ రేట్లు పెరిగాయ్. వీటితో పోల్చి చూస్తే.. ఇండియాలో పెరిగిన 3 రూపాయలు తక్కువే అనిపిస్తోంది.
కానీ, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. రాబోయే రోజుల్లో.. మన దగ్గర కూడా ఇంధన ధరలు మరింత మండిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, క్రూడ్ ఆయిల్ రేట్ల పెరుగుదలతో.. అన్ని దేశాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తెగ మండిపోతున్నాయ్. మన దగ్గర 3 రూపాయలు పెరిగితేనే.. బడ్జెట్ తలకిందులవుతోందని జనం అప్పుడే గగ్గోలు పెడుతున్నారు. కానీ, మిగతా దేశాల్లో లీటరుకు 30 నుంచి 60 రూపాయల దాకా పెరిగినా.. అక్కడి జనం భరిస్తున్నారు. అతి త్వరలోనే.. ఇండియాలోనూ ఫ్యూయల్ వైల్డ్ పైర్ చూడబోతున్నామనే సంకేతాలు కనిపిస్తున్నాయ్.
ఇంధన పొదుపు అంటూ ప్రధాని మోడీ నేషనల్ మిషన్ ప్రకటించేశారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. అతి త్వరలోనే యుద్ధ సంక్షోభం భారీ స్థాయిలో ముంచెత్తబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయ్. భారతీయులంతా పొదుపు మంత్రం జపించాలని, ఆచితూచి అడుగులు వేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చినప్పుడు.. చాలా మంది సీరియస్గా తీసుకోలేదు. కానీ, అదెంత సీరియస్ ఇష్యూనో ఒక్కొక్కరికీ ఇప్పుడు అర్థమవుతోంది. ఆయన అన్న మాటల వెనుక, రాబోయే ఆర్థిక తుఫాను గురించి ఇచ్చిన ముందస్తు హెచ్చరికలు.. ఇప్పుడు సామాన్యుడికి కళ్ల ముందు కనిపిస్తున్నాయ్. మనం చూస్తున్న ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం.. కేవలం ట్రైలర్ మాత్రమే అంటున్నారు. అసలైన ఆర్థిక సంక్షోభం, సవాలుతో కూడుకున్న రోజులు.. ముందున్నాయని ఆర్థిక నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.
Also Read: బండి సంజయ్ టార్గెట్గా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు.. కేంద్రమంత్రి పదవి ఊడాల్సిందే!
చాలామంది పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే కేవలం వాహనాలు వాడే వారికే నష్టం అనుకుంటారు. కానీ.. అది పచ్చి అబద్ధమని త్వరలోనే తెలుస్తుంది. ఇంధన ధరల పెరుగుదల అనేది ఓ చైన్ రియాక్షన్ లాంటిది. దేశంలో.. నిత్యావసర వస్తువుల సరఫరా అంతా రోడ్డు రవాణాపైనే ఆధారపడి ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధర పెరిగితే రవాణా ఛార్జీలు పెరుగుతాయి. దాని వల్ల.. పొలం నుంచి మార్కెట్కు వచ్చే కూరగాయలు, మిల్లుల నుంచి వచ్చే పప్పులు, ఉప్పు, నూనెలు.. ఇలా వంట గదిలో వాడే ప్రతి వస్తువు ధర ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఇప్పటికే పెరిగిన గ్యాస్ సిలిండర్ రేట్లు, నిత్యావసరాల ధరలు.. సామాన్యుడి బడ్జెట్ని తలకిందులు చేస్తున్నాయ్. ఆదాయం పెరగడం లేదు గానీ, ఖర్చులు మాత్రం రెక్కలు కట్టుకొని ఎగురుతున్నాయ్. దాంతో.. మిడిల్ క్లాస్ మొత్తం ఫ్రై అయిపోతోంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం, మిడిల్ ఈస్ట్లో అమెరికా-ఇరాన్ యుద్ధ సంక్షోభంతో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇతర అంతర్జాతీయ పరిణామాలు జరిగినన్ని రోజులు.. భారత్ తన వ్యూహాత్మక దౌత్యంతో.. క్రూడ్ ఆయిల్ సరఫరాని మేనేజ్ చేస్తూ.. కొంతవరకు తట్టుకోగలిగింది. తక్కువ ధరకు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం లాంటి చర్యలు తాత్కాలిక రిలీఫ్ ఇచ్చాయి. కానీ, యుద్ధాల ప్రభావం కేవలం చమురు సరఫరాపైనే కాదు, అంతర్జాతీయ సప్లై చైన్, ఎరువుల లభ్యత, డాలర్తో రూపాయి మారకపు విలువ లాంటి అనేక అంశాలపై పడింది. యుద్ధం సృష్టించిన దీర్ఘకాలిక ఆర్థిక నష్టాలు ఇప్పుడు నెమ్మదిగా దేశ ఆర్థిక వ్యవస్థపై పంజా విసురుతున్నాయ్. దాంతో.. అసలైన సంక్షోభం ముందుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయ్.
అయితే, ఈ సవాల్ని ఎదుర్కొనేందుకు.. ఇండియా ఎంతవరకు సన్నద్ధంగా ఉందనేదే.. ఇప్పుడు బిగ్గెస్ట్ డౌట్. ఈ విషయంలో ప్రభుత్వం కొంతవరకు సన్నద్ధంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కొన్నేళ్లుగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావడం, జీఎస్టీ వసూళ్లు పెరగడం, బలమైన బ్యాంకింగ్ రంగం వల్ల భారత్ కొంతవరకు స్థిరంగా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఇథనాల్ బ్లెండింగ్, గ్రీన్ హైడ్రోజన్ వైపు.. భారత్ వేగంగా అడుగులు వేస్తుంది. ఇవన్నీ.. భవిష్యత్లో చమురుపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయ్. కానీ.. పరిస్థితి ఇప్పుడేమిటనేదే.. అసలు మ్యాటర్!
మరోవైపు.. మధ్యతరగతి, పేద ప్రజల చేతుల్లో డబ్బు నిల్వలు తగ్గిపోతున్నాయి. ఓ వైపు ఉద్యోగ అవకాశాల కొరత, మరోవైపు ఆకాశాన్నంటున్న ధరల లాంటి పరిస్థితుల సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయ్. ఈ పరిస్థితుల్లో.. పెరుగుతున్న ఇంధన ధరలు.. సాధారణ, మధ్యతరగతి ప్రజల జేబుకు చిల్లు పెడుతున్నాయ్. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారతాయనే సంకేతాలు కనిపిస్తున్నాయ్. అందువల్ల.. ప్రధాని మోడీ చెప్పినట్లు రాబోయే రోజుల్లో సంక్షోభాన్ని తట్టుకోవాలంటే.. దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడు, ప్రతి కుటుంబం ఆర్థిక క్రమశిక్షణ పాటించక తప్పదు.
అనవసరపు ఖర్చులకు అడ్డుకట్ట వేయడం, లగ్జరీల కంటే అత్యవసరాలకే ప్రాధాన్యత ఇస్తేనే.. రాబోయే ఆర్థిక తుఫానుని తట్టుకోగలమంటున్నారు. ప్రభుత్వం కూడా ధరల నియంత్రణ, ఉపాధి కల్పనపై యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టకపోతే.. ప్రజలకు మరింత ఊహించని నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉందంటున్నారు. ఈ పరిస్థితుల్లో.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు గనక భారీగా పెరిగితే.. సగటు సాధారణ భారతీయుడికి తగిలే రేటు పోటు మామూలుగా ఉండదు.
Also Read: స్వచ్ఛాంధ్ర నుండి రక్షణ రంగం వరకు.. ఏపీ ప్రగతి పథంలో సీఎం చంద్రబాబు వారోత్సవాల సమీక్ష
Story by: Anup, Big Tv