GHMC Division: భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ల పంచాయితీ నడుస్తోంది. గ్రేటర్ హైదదాబాద్ పరిధిలో కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుపై బీజేపీ నేతల డిమాండ్లతో ఆ పార్టీ పరిస్థితి ముందు గొయ్యి, వెనక నుయ్యి అన్నట్టు తయారైందంట. సికింద్రాబాద్ కార్పొరేషన్ కావాలి, కాదు కాదు మల్కాజిగిరినే కార్పొరేషన్ కావాలి అన్న పంచాయితీ ఆ పార్టీలో ఆ ఇద్దరి ఎంపీల మధ్య తీవ్రమవుతోందంట.. దాంతో వారిలో ఎవరిది పై చేయి అవుతుందో అన్న చర్చ మొదలైంది.
గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ పాలిటిక్స్ మొత్తం సికింద్రాబాద్ చుట్టూనే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేపట్టినా రాష్ట్రంలో బీజేపీ నేతలు ప్రభుత్వ నిర్ణయాలపై వారిలోవారే సిగపట్లకు దిగుతుండటం హాట్ టాపిక్గా మారింది. తాజాగా ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ ను మూడు కార్పొరేషన్లుగా చేయాలనే ప్రతిపాదన ముందుకు తెచ్చింది. ఆ కొత్త కార్పొరేషన్ల ప్రతిపాదన తెలంగాణ బీజేపీలో నేతల మధ్య తగవులు తెచ్చిపెట్టిందన్న టాక్ వినిపిస్తోందట.
సికింద్రాబాద్ను కాదని, మల్కాజిగిరిని మున్సిపల్ కార్పొరేషన్గా ఎట్లా ఏర్పాటు చేస్తారని సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…సికింద్రాబాద్లో ఏముంది కంటోన్మెంట్ తప్ప, మినీ ఇండియాగా ఉన్న మల్కాజిగిరిని కార్పొరేషన్ చేయడమే ఉత్తమమని అక్కడి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేయడం చర్చనీయంశంగా మారింది. సికింద్రాబాద్ను కార్పొరేషన్ చేయడం వల్ల ఒరిగేదేమీ లేదని ఈటల రాజేందర్ అంటున్నారు.
ఈ ఇద్దరి నేతల మధ్య కార్పొరేషన్ల పంచాయితీతో ఎవరికి మద్దతిస్తే ఏమవుతుందో అన్న కన్ఫ్యూజన్ పార్టీ పెద్దల్లో కనిపిస్తోందంటున్నారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మల్కాజిగిరి కార్పొరేషన్ నిర్ణయంపై సంతృప్తి వ్యక్తం చేస్తే…సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి మాత్రం సికింద్రాబాద్ కార్పొరేషన్ గురించి ప్రతిపాదించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు రెండు విభిన్న అభిప్రాయాలతో ముందుకు రావడంతో క్యాడర్ అంత అయోమయంలో పడిందట.
ఇక తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి రామచంద్ర రావు సైతం ఈ అంశంపై స్పందించారు. ఈటల రాజేందర్, కిషన్ రెడ్డిల కామెంట్లను ప్రస్తావిస్తూనే, కార్పొరేషన్ల మీద ప్రభుత్వ ప్రకటన తర్వతా పార్టీలో చర్చించుకొని స్టాండ్ ప్రకటిస్తామని చాలా సింపుల్ గా జారుకున్నారు. మొత్తమ్మీద కార్పొరేషన్ల పంచాయితీ బీజేపీలో మరోసారి చిచ్చు పెట్టిందనే టాక్ నడుస్తోంది. ఇద్దరు కీలకంగా ఉన్న రెండు సెగ్మెంట్లకు ఎంపీలుగా కొనసాగుతుండటంతో ఎవరి సెగ్మెంట్ ప్రయోజనాలను వారు దృష్టిలో పెట్టుకొని మాట్లాడక తప్పని పరిస్థితి తలెత్తిందంట. సికింద్రాబాద్ కార్పొరేషన్పై అందరితో చర్చించి ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలని కోరిన కిషన్ రెడ్డి, ప్రజలతో కలిసి పోరాటానికి సిద్ధమంటూ హెచ్చరిక కూడా చేశారు. సికింద్రాబాద్ విషయంలో ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ చేసిన కామెంట్లపై నోరేందుకు మెదపడం లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి అయితే కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం బీఆర్ఎస్ చేస్తున్న నిరసనలకు మద్దతు తెలిపారని, అందుకు భిన్నంగా మల్కాజిగిరిని కార్పొరేషన్ చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు ఈటల రాజేందర్ జై కొట్టారన్న టాక్ ఆ పార్టీలో నడుస్తోంది.
ఈ ఇద్దరి నేతల గోల ఆ విధంగా ఉంటే రాష్ట్ర నాయకత్వ తిరు మరో రకంగా ఉండటంతో క్యాడర్ డైలమాలో పడినట్టయింది. మొత్తం మీద గ్రేటర్లలో కార్పొరేషన్ల అంశం బీజేపీలో అంతర్గత విభేదాలను కూడా బహిర్గతం చేసింది. మరి కమలం పార్టీలో ఈ పంచాయితీ ఎటు దారి తీస్తుందో చూడాలి.
Story by: Apparao, Big Tv