Telangana MLC Elections: తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకా రేపుతున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు సార్లు అధికారం వెలగబెట్టిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో చేతులెత్తేయడంతో.. గ్రాడ్యుయేట్లు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు నెలకొంది. 7 ఉమ్మడి జిల్లాల పరిధిలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో ఎవరి స్ట్రాటజీలు వారు, ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల నుంచి బీఆర్ఎస్ ఔట్ అవ్వడంతో పట్టభద్రులు, ఉపాధ్యాయులు కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఉత్కంఠ రేపుతోంది.
ఢిల్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి ఫుల్ జోష్ మీద ఉంది బీజేపీ.. ఢిల్లీ ఫలితాలే రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీని గెలిపిస్తాయనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్కు కొంత నిరాశ మిగిల్చినప్పటికి తెలంగాణలో ఆ ప్రభావం ఏ మాత్రం ఉండదనే అంచనా వేస్తున్నాయి అధికార పార్టీ శ్రేణులు. కచ్చితంగా రాష్ట్రంలో ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలల్లో తమదే పై చేయి అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరమని ప్రకటించింది. ఏ ఈక్వేషన్స్తో ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరితో ఏ ఒప్పందం చేసుకుంది. పరోక్షంగా ఏ పార్టీకి మద్దతు తెలుపుతుంది. ఇన్ సైడ్గా ఎవరికి సహకరిస్తుంది అన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో జోరుగా సాగుతోంది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇన్డైరెక్ట్గా బీజేపీకి సహకరించిందన్న ప్రచారం ఉంది. ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ నడపించిన ఎపిసోడ్ .. తరువాత ఎమ్మెల్సీ కవిత నిందితురాలిగా ఉన్న లిక్కర్ స్కాంలు దేశవ్యాప్తంగా సంచలం సృష్టించాయి. లిక్కర్ స్కాంలో కీలక నిందితురాలిగా ఉన్న కల్వకుంట్ల కవితను బయటకు పడేసేందుకు కేసీఆర్ బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారన్న ప్రచారం ఉంది.
ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు స్కాం, లిక్కర్ స్కామ్ లు అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ లను రాష్ట్రంలో బానే డ్యామేజ్ చేశాయి. అదీకాక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రిమాండ్ ఖైదీగా అయిదు నెలలు తీహార్ జైల్లో ఉండ వచ్చిన కవితకు కేరళ లిక్కర్ బిజనెస్లో కూడా పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగానే రహస్య ఒప్పందం జరిగి బీజేపీని గెలిపించేందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ దూరమైందనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.
ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ ఎస్సీ, బీసీ ల ఫార్ములా ప్రయోగించాలని చూస్తుంది. ఒకవైపు బీసీ నేత ఆర్ కృష్ణయ్యను , మరోవైపు మాదిగ నేత మందకృష్ణ మాదిగను ముందు పెట్టి రాష్ట్రంలో చక్రం తిప్పడానికి స్కెచ్ గీస్తుంది. అందులో భాగంగానే ఆర్ కృష్ణయ్యకు మరోసారి రాజ్యసభ సభ్యత్వం, మందకృష్ణకు పద్మ అవార్డ్ దక్కాయంటున్నారు. ఇక ఒప్పందం ప్రకారం బీఆర్ఎస్ కనుక బీజేపీతో కలిసిసొస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ దూకుడుకు చెక్ పెట్టవచ్చనే అంచనాల్లో బీజేపీ ఉంది. ఆ క్రమంలోనే కేంద్రం కారు పార్టీ స్టీరింగు రిమోట్ని తన చేతుల్లో పెట్టుకుందంటున్నారు.
ఏదేమైనా ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరమని బీఆర్ఎస్ ప్రకటించడంతో .. కచ్చితంగా రాబోయే జనరల్ ఎలెక్షన్స్ నాటికి బీఆర్ఎస్, బీజేపీ ల మధ్య రహస్య ఒప్పందాలు బయట పడతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. గత పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్తో కుదిరిన ఒప్పందం కారణంగానే రాష్ట్రంలో బీజేపీ 8 ఎంపీ స్థానాలను గెలుచుకుందని.. ఎవరూ ఊహించని విధంగా బీఆర్ఎస్ ఎనిమిది స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందన్న టాక్ ఉంది. ఇప్పుడు అదే ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తున్న బీజేపీ.. బీఆర్ఎస్ని పోటీకి దూరం చేసి మూడు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు భారీ స్కెచ్ వేసిందనే విమర్శలు కాంగ్రెస్, వామాపక్షవాద ఉపాధ్యాయ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి.
Also Read: అక్కడ నుంచి ఎమ్మెల్యేగా కవిత పోటీ.!
ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో కుట్రలు ఎవరివో, కుతంత్రాలు ఎవరివో కానీ, లిక్కర్ స్కాంలో మాత్రం కూతురు కింగ్ పిన్గా దొరికిపోవడంతో కేసీఆర్ జనానికి ముఖం చూపించలేని పరిస్థితుల్లో ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు.. అంతే కాదు ఫోన్ ట్యాపింగ్ స్కాంలో కల్వకుంట్ల ఫ్యామిలీ అడ్డంగా బుక్ అయ్యే పరిస్థితి ఏర్పడటంతో అందులోంచి బయటపడేందుకు మళ్ళీ లోకల్ సెంటిమెంట్ రగిల్చేందుకు బీజేపీతో జత కట్టాలనే ఆలోచనలో కారు పార్టీ అధినేత ఉన్నట్టు తెలుస్తోంది.
బీఆర్ఎస్ ప్రాంతీయ సెంటిమెంట్, బీజేపీ మతతత్వం ఆ రెండింటితో పాటు అటు బీసీ, ఇటు ఎస్సీ ఈక్వేషన్స్ కలిసొస్తే తెలంగాణలో అధికారంలోకి రావొచ్చని కమలనాథులు భావిస్తున్నట్లు చెప్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరమని ప్రకటించి, బీజేపీకి మద్దతు తెలపడానికి ఫిక్స్ అయిందంట. కచ్చితంగా బీజేపీ అభ్యర్థులకే ఓట్లు వేయాలని, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ని గెలవనీయ కూడదని పార్టీ శ్రేణులను గులాబీ పెద్దలు గైడ్ చేస్తున్నారంట.
ఎవరు కాదన్న అవునన్నా గ్రాడ్యుయేట్లు, టీచర్లలో బీఆర్ఎస్పై తీవ్ర వ్యతిరేకత ఉందనేది వాస్తవం. రెండు సార్లు రాజ్యాధికారం చెలాయించిన గులాబీ బాస్.. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకుండా గ్రాడ్యుయేట్లను ఇబ్బంది పెట్టారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై కూడా దృష్టి సారించలేదు. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ పరోక్ష పద్దతు బీజేపీకి మైనస్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అధికార కాంగ్రెస్లో కూడా అదే ధీమా కనిపిస్తుంది . మరి కాంగ్రెస్ వర్సెస్ కమలం పోరులో గెలుపు గుర్రాలు ఎవరు..? ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఎవరి వైపుకు నిలబడతారు అనేది చూడాలి.