CM Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి అయినా తరువాత ఎమ్మెల్యే ల పనితీరుపై సర్వే జరిగిందన్న ప్రచారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆసక్తిగా మారింది. అయితే ఎలాంటి సర్వే జరుగలేదని జిల్లాలోని కొంతమంది ఎమ్మెల్యే లు కొట్టిపారేస్తుంటే.. కొంతమంది ఎమ్మెల్యే లు మాత్రం సర్వే జరిగిన విషయం నిజమేనని నిర్ధారిస్తున్నారు. దాంతో తమ ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి నివేదికలు అందాయో అని వారి అనుచరుల్లో టెన్షన్ మొదలైందంట. తమ ఎమ్మెల్యే రెడ్ జోన్ లో ఉన్నాడా, ఆరెంజ్ జోన్ లో ఉన్నాడా లేక గ్రీన్ జోన్ లో ఉన్నాడా అని సదరు ఎమ్మెల్యేల అనుచరులు, శ్రేయోభిలాషులు అరా తీస్తున్నారట.
కాంగ్రెస్ ఎమ్మెల్యే ల ఏడాది పనితీరు మీద ఓ థర్డ్ పార్టీ తో ముఖ్యమంత్రి సర్వే చేయించారన్న ప్రచారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో జరుగుతుంది. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ఉన్నారు. వారిలో పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు మంత్రులుగా కొనసాగుతున్నారు. ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్కుమార్లు ప్రభుత్త విప్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఆ నలుగురితో పాటు చొప్పదండి నుండి మేడిపల్లి సత్యం, మానకొండూర్ నుండి కవ్వంపల్లి సత్యనారాయణ , పెద్దపల్లి నుండి విజయరమణరావు, రామగుండము నుండి మక్కాన్ సింగ్ ఠాగూర్ ఎమ్మెల్యే లుగా విజయం సాధించారు. జగిత్యాలలో బీఅర్ఎస్ అభ్యర్ధిగా గెలిచిన సంజయ్కుమార్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యే ల పనితీరు ఎలా ఉంది అని ఓ థర్డ్ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి సర్వే చేయించుకుని రిపోర్ట్ తెప్పించుకున్నట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో ప్రచారం జరుగుతుంది.
అయా నియోజకవర్గాల్లో ఇసుక వ్యాపారం, అక్రమ మైనింగ్, పోలిసుల పోస్టింగ్ లలో డబ్బులు తీసుకోవడం, పనులకు కమిషన్లు దండుకోవడం, నియోజకవర్గంలోని ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండి సత్సంబంధాలు కొనసాగించడం.. అలాగే నియోజకవర్గం లో తిరుగుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడం వంటి అంశాలపై సర్వే నిర్వహించినట్లు చెప్తున్నారు. ఆ సర్వేల్లో అవినీతి కి ఆమడ దూరంలో ఉన్నట్లు తేలిన వారిని గ్రీన్ జోన్లో, వివాదాలు, ప్రజలతో సంబంధాలు కొనసాగించలేని వారిని అరెంజ్ జోన్లో, ఇసుక, మైనింగ్ దందాలు చేస్తూ, ఉద్యోగుల విషయంలో పైరావీలు చేసేవారిని రెడ్ జోన్లో పెడతారంట.
నియోజకవర్గంలోని అయా మండలాలు, గ్రామాల్లో ఎమ్మెల్యేల వ్యవహార తీరుపై ఇంటలిజెన్స్, ఎస్బీ విభాగం నుండి సమాచారం సేకరించనట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే బీఅర్ఎస్ నుండి గెలుపొందిన ఎమ్మెల్యే పనితీరుపైనా కూడ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్వే నివేదిక తెప్పించుకున్నారంట. ఈ సర్వే రిపోర్టు ఆధారంగానే ఇటీవల ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసారన్న అంశం ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్ అయింది. జిల్లాలోని అయా నియోజకవర్గాలలో ఎక్కడ నలుగురు కలిసినా ఎమ్మెల్యేల సర్వే రిపోర్ట్ల గురించే మాట్లాడుకుంటున్నారు.
నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరైనా ఇసుక, మైనింగ్ మాఫియాలకి అండగా నిలుస్తే దానిపైనే చర్చలు జరుగుతున్నాయి. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నుండి గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యే లు, జగిత్యాల నుండి గెలిచిన సంజయ్ కుమార్ లలో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా ప్రజలకి చాల దగ్గరగా ఉంటూ నిత్యం వారితో సత్సంబంధాలు కొనసాగిస్తూ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, వేములవాడ ఎమ్మెల్యే, విప్ అది శ్రీనివాస్, ధర్మపురి ఎమ్మెల్యే, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్ ఠాగూర్, విజయరమణారావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లు నిత్యం ఎదో ఒక కార్యక్రమంతో నియోజకవర్గం లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై ఉంటున్నారు.
Also Read: మానుకోటలో మూతపడ్డ బీఆర్ఎస్.. అందరూ జంపే?
ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే హైదరాబాదు ఉన్నప్పుడు తప్ప హుస్నాబాద్ నియోజకవర్గంలో గల్లిగల్లి తిరుగుతూ ప్రజలతో మమేకమవుతుంటారు. ఇక మంత్రి శ్రీధర్ బాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం లో కీలకపాత్ర పోషిస్తూనే చాలా సమయం నియోజకవర్గం ప్రజలకి కేటాయిస్తున్నారు. మంత్రులిద్దరు అటూ ప్రభుత్వం లో కీలకంగా ఉంటూ, ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటూనే తమ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిపెట్టి ఎప్పటికప్పుడు మానటరింగ్ చేస్తూ.. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే లకి సలహాలు , సూచనలు ఇస్తున్నారు.
అయితే కొంతమంది ఎమ్మెల్యే లు నియోజకవర్గం లో విస్తృతంగా పర్యటిస్తూ నిత్యం ప్రజలలో ఉంటున్నా వారు రెడ్ , అరెంజ్ జోన్లలో ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది.. ఉమ్మడి జిల్లాలోని బీఅర్ఎస్ ఎమ్మెల్యేతో పాటు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కొందరు అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకుంటున్నారని.. కొన్ని నియోజకవర్గాలలో ఇసుక మాఫియా, ల్యాండ్ సమస్యలలో, పోలీసు స్టేషను ఫైరావీలలో కొంతమంది ఎమ్మెల్యేలు,వారి అనుచరులు తలదూరుస్తున్నారని సర్వేలో తేలిందంట. అలాంటి వారు అరెంజ్, రెడ్ జోన్లలోకి వెళ్ళారన్న ప్రచారం జరుగుతుంది.
ఇటూ ముఖ్యమంత్రి కూడా ఇటీవల నేను మారాను, మీరు మారండి. మనం ఒక్కసారి ఎమ్మెల్యే అయితే సరిపోదు. ఇంకో పదేళ్లు మీమీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా గెలిచేలా ప్రజలకి దగ్గర ఉండి సేవలు చేయాలని ఎమ్మెల్యేలకి, మంత్రులకి సూచించారంటున్నారు. సీఎం అంత ప్రత్యేకంగా ఆ అంశాన్ని ప్రస్తావించినట్లు జరుగుతున్న ప్రచారంతో జిల్లాలో ఎమ్మెల్యే గ్రాఫ్ పై థర్డ్ పార్టీ ద్వారా రహస్యంగా సర్వే చేయించింది నిజమేనన్న అభిప్రాయంతో నియోజకవర్గం ప్రజలు తమ ఎమ్మెల్యే ల గురించి మాట్లాడుకుంటున్నారు.
మరోవైపు జిల్లాలోని ఎమ్మెల్యే లు తాము ఇంత బాగా ప్రజలకి దగ్గర ఉంటూ నిత్యం నియోజకవర్గం లో పర్యటిస్తూ పైరవీలకు దూరం ఉంటున్నాంమని.. తాము అయితే గ్రీన్ లేదంటే అరెంజ్ జోన్ లో ఉంటాం. తామెందుకి రెడ్ జోన్ లో ఉంటామని అనుకుంటున్నారంట. కొందరూ ఎమ్మెల్యే మాత్రం అనవసరంగా దందాలలో వేలు పెట్టాం. దాని గురించి ఎవరికి తెలియదనుకున్నాం. ఏడాది కాకముందే తమ పనితీరు, దందాల గురించి ఇంటలిజెన్స్, థర్డ్ పార్టీ సర్వే ముఖ్యమంత్రి చేయించి రిపోర్ట్ తెప్పించుకుంటారని ఊహించలేదని మదన పడుతున్నారంట. ముఖ్యమంత్రి ఎక్కడ మందలిస్తారో?, ఒకవేళ సర్వే రిపోర్టు తమ ముందు పెడితే ఇంకో నాలుగేళ్ళ సమయం ఉంది మార్చకుంటామని చెప్దామని దందాలకు పాల్పడ్డ ఎమ్మెల్యే లు అనుకుంటున్నారంట. మొత్తానికి ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే మేటర్ జిల్లాలో హాట్ టాపిక్గా మారిందిప్పుడు.