BRS Vs Congress: తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల హడావుడి దాదాపు ముగిసింది. ఎన్నిక జరనగున్న రెండు స్థానాలకు కాంగ్రెస్ నుంచి మాత్రమే అభ్యర్ధులు పోటీలో ఉండటంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం ఖాయమైంది. అయితే ఈ ఎన్నికల్లో ఒక స్థానం నుంచి పోటీపై సస్పెన్స్ మెయిన్టెయిన్ చేస్తూ వచ్చిన బీఆర్ఎస్.. నామినేషన్ల గడువ చివరిరోజున చేతులెత్తేసింది. తగినంత బలం లేకుండా పోటీకి దిగితే.. ఎలాగూ ఓడిపోతామని.. ఉన్న పరువు కూడా పోతుందని చాపచుట్టేసింది. కనీసం పార్టీ మారిన ఎమ్మెల్యేలను విప్ జారీ చేసి ఇరుకున్న పెట్టే అవకాశం ఉన్నా.. గులాబీ నేతలు పోటీకి దూరంగా ఉండటంపై.. ఇంటా, బయటా వినిపిస్తున్న కామెంట్స్ ఏంటి?
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి వీరు నామినేషన్ పత్రాలు సమర్పించారు. సింఘ్వీ.. మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా.. వేం నరేందర్ రెడ్డి నాలుగు సెట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి సాయి.. ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
నిబంధనలు ప్రకారం 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకుండా ఇండిపెండెంట్గా ఒక అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నికల అధికారులు దాన్ని తిరస్కరించారు. దాంతో అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్ధిని బరిలోకి దింపకపోవడంతో కాంగ్రెస్ క్యాండెట్ల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. గతంలో తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లిన అభిషేక్ మను సింఘ్వీ పదవి కాలం మరికొద్ది రోజుల్లో ముగియనుండటంతో దాన్ని రెన్యువల్ చేసినట్లైంది. ఇక రెండో స్థానం కోసం కాంగ్రెస్లొ తీవ్ర పోటీ నెలకొన్నా.. చివరకు వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారైంది.
ఇక బీఆర్ఎస్ రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్ధిని నిలపకుండా ఓటమిని ముందుగానే అంగీకరించినట్లైంది. 119 మంది ఎమ్మెల్యేలున్న తెలంగాణలో రాజ్యసభ అభ్యర్థిగా గెలవాలంటే 40 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. అయితే గులాబీపార్టీకి రికార్డుల ప్రకారం ప్రస్తుతం 37 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. వారిలో 9 మంది కారు దిగేయడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ బలం 28 మాత్రమే. అయితే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ పెడతామంటూ కొంతకాలంగా బీఆర్ఎస్ నేతలు ఊదరగొట్టారు. అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా పోలింగ్ జరిగేలా చూడాలని ప్రయత్నించారు. పోలింగ్ జరిగితే కాంగ్రెస్ పార్టీని టెన్షన్ పెట్టొచ్చని భావించారు.
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంఐఎం ఆ పార్టీకి పరోక్ష మిత్రపక్షంగా వ్యవహరించింది. అయితే ఈ సారి మజ్లీస్ కాంగ్రెస్ వైపే మొగ్గుచూపే పరిస్థితి ఉండటంతో… పోటీ చేద్దామని కొందరు నేతలు ప్రతిపాదించినా… ఓడిపోయి పరువు పోగొట్టుకోవడం ఎందుకని మాజీ సీఎం వారి ప్రతిపాదనను తిరస్కరించారంట. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారం కోల్పోయిన గులాబీపార్టీ… తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కనీసం బోణీ కొట్టలేక పరువు పోగొట్టుకుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత కంటోన్మెంట్, జుబ్లీహిల్స్ బైపోల్స్లో సిట్టింగు సీటులు కూడా దక్కించుకోలేకపోయింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే అభ్యర్ధినే నిలబెట్టలేదు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లోనూ పోటీకి దిగి ఓడితే మరింత డ్యామేజ్ జరుగుతుందనే .. చేతులెత్తేసిందంట.
ఒక వేళ రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దింపి, ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసినా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు విప్కు కట్టుబడి ఉంటారన్న గ్యారెంటీ లేదు. దానికి తోడు ఉన్న ఎమ్మెల్యేల్లో కొందరు క్రాస్ ఓటింగుకు పాల్పడితే పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందనే గులాబీబాస్ పోటీకి దూరంగా ఉండాలని నేతలతో చెప్పారంట.
పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టాలంటే రాజ్యసభకు అభ్యర్థిని బరిలో నిలపాలని పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారంట. పార్టీ నుంచి విప్ జారీ చేస్తే ఆ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారనేది స్పష్టమవుతుందని దీంతో వారిపై ఒత్తిడి పెంచవచ్చని, కోర్టులో సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించవచ్చని కేసీఆర్ ముందు ప్రస్తావించారంట. అయినా కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో బీఆర్ఎస్ సీనియర్లు కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట.
బీఇర్ఎస్లో ట్రబుల్ షూటర్గా పేరున్న మాజీ మంత్రి హరీష్రావుని రాజ్యసభకు అభ్యర్థిని బరిలో నిలుపుతున్నారా? అని అడిగితే చివరివరకు సస్పెన్స్ అంటూ విచిత్రమైన సమాధానం ఇచ్చారు. అయితే ఎలాంటి సస్పెన్ లేకుండా ఆ పార్టీ ముందే ఓటమిని అంగీకరించడంతో… కాంగ్రెస్కు ఎలాంటి ట్రబుల్ లేకుండా పోయిందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
Also Read: రాజగోపాల్ రెడ్డి యూ-టర్న్.. రేవంత్ పై పొగడ్తల వెనుక అసలు గుట్టు ఇదేనా!
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల్లో ఒక్కస్థానంలో కూడా బీఆర్ఎస్ విజయం సాధించలేదు. దీంతో లోక్ సభలో బీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇక రాజ్యసభలోనూ గులాబీ పార్టీ ప్రాతినిధ్యం తగ్గింది. గతంలో రాష్ట్ర నుంచి ఉన్న 7 స్థానాల్లో నాలుగు బీఆర్ఎస్ ఖాతాలో ఉండేవి. ఇప్పుడు సురేష్ రెడ్డి పదవీ కాలం ముగియనుండటంతో రాజ్యసభలో ఆ పార్టీ బలం మూడుకి తగ్గింది. ఆ ముగ్గురిలో కూడా ఇద్దరి పదవీకాలం మరో రెండేళ్లలో ముగియనుంది. మొత్తానికి తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ పరిస్థితి అలా తయారైందిప్పుడు.