YCP Plenary Meeting: వైసీపీ ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్యాలెస్లకే పరిమితమవుతున్నారు. పార్టీ కీలక నేతలు కూడా యాక్టివ్ మోడ్లో లేకపోవడంతో క్యాడర్ పూర్తిగా ఢీలా పడిపోతోంది. వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపడానికి ఈ ఏడాదైనా ప్లీనరీ నిర్వహిస్తారనుకుంటే జగన్ దాన్ని కూడా వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. దాంతో వైసీపీ నాయకులు, అభిమానులు ఈసురోమంటున్నారంట. అసలు వైసీపీ అధ్యక్షుడి లెక్కలేంటి?
ఆవిర్భావం తర్వాత 2 ప్లీనరీలను ఘనంగా నిర్వహించిన వైసీపీ
టీడీపీకి మహానాడు ఎంత పెద్ద పార్టీ పండుగో… అన్ని పార్టీలకు ప్లీనరీ అన్నది అంతే ప్రత్యేకం.. వైసీపీ ఆవిర్భావం తర్వాత రెండు ప్లీనరీలను గట్టిగా నిర్వహించారు. వైసీపీ విపక్షంలో ఉన్నపుడు 2017లో ప్లీనరీని నిర్వహించింది. ఆ ప్లీనరీలో రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ని పార్టీ క్యాడర్ కి పరిచయం చేశారు జగన్. ఆ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయంతోనే 2017 నవంబర్ 6 నుంచి జగన్ పాదయాత్ర స్టార్ట్ చేశారు. జగన్ పాదయాత్ర వైసీపీని అధికారంలోకి తేవడానికి దోహదపడింది
అధికారంలోకి వచ్చాక 2022లో మరోసారి వైసీపీ ప్లీనరీ
2019లో అధికారంలోకి వచ్చాక 2022లో మరోసారి వైసీపీ ప్లీనరీని అధికారికంగా నిర్వహించింది. ఈ ప్లీనరీలోనే జగన్ని పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించారు. దానికి కేంద్ర ఎన్నికల సంఘం ఒప్పుకోలేదన్న ప్రచారం జరిగింది. పార్టీ శాశ్వత అధ్యక్షుడి ఎంపికపై రాజకీయంగా పెద్ద దూమారమే నడిచింది. వైసీపీ కొత్త రాజ్యంగం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. మళ్లీ నాలుగేళ్ళ గ్యాప్తో అంటే 2026లో ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారట.
బూత్ లెవ్ నుంచి పార్టీని పటిష్టం చేయాలని చూస్తున్న జగన్
ఈ లోగా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. సంస్థాగతంగా చేపట్టిన కార్యక్రమాలు అన్నీ చేయాల్సి ఉంది. ఇదే విషయాన్ని జగన్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకులతో చర్చించారంట. వైసీపీని బూత్ లెవెల్ దాకా పటిష్టం చేయడానికి జగన్ చూస్తున్నారని పార్టీ వర్గాలు చెపుతున్నాయ. బూత్ స్థాయి దాకా పార్టీ కమిటీలు వేసిన తర్వాత 2026 జూలైలో వైసీపీ ప్లీనరీని నిర్వహిస్తారంట. అదలా ఉంటే పార్టీ పార్లమెంటరీ పరిశీలకులు రీజనల్ కో ఆర్డినేటర్లు కలసి ప్రతీ జిల్లాలో పార్టీని పటిష్టం చేయాలని జగన్ సూచిస్తున్నారు.
పార్టమెంటరీ పరిశీలకులకు పార్టీ పటిష్ట బాధ్యతలు
నియోజకవర్గాలలో ఇన్చార్జ్లు నిరంతరం ప్రజలలో ఉండేలా బాధ్యత తీసుకోవాల్సింది పార్లమెంటరీ పరిశీలకులే అని జగన్ స్పష్టం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి గత ఎన్నికల్లో అధికారం కోల్పేయే వరకు వైసీపీలో జగన్ ఒన్ మాన్ షో చేశారన్న అభిప్రాయం ఉంది. తన బొమ్మ చూసి జనం ఓట్లేస్తారన్న ధీమాతో ఆయన కనిపించేవారు. అలాంటాయన ఇప్పుడు నాయకులకు బాధ్యతలు అప్పచెపుతుండటం చూస్తూ పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారంట
నాయకులు ఎలా ఉండాలో వైసీపీని చూసి నేర్చుకోవాలంట
ఓటమి తర్వాత అయితే బెంగళూరు, లేకపోతే తాడేపల్లి అని షట్లింగ్ చేస్తున్న జగన్.. పార్టీ నేతలతో తాడేపల్లిలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో దిక్కుమాలిన రాజకీయాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. సంఖ్యాబలం లేకపోయిన కౌన్సిలర్ ఎన్నికలకు, ఎంపీపీ ఎన్నికలకు ప్రేరేపిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్పోరేటర్లను ప్రలోబాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. నాయకుడు ఎలా ఉండాలనేదానికి వైసీపీ నిదర్శనమన్న ఆయన.. ఎన్ని కష్టాలున్నా చిరునవ్వుతో ఇచ్చిన హామీలు నెరవేర్చామన్నారు. కోవిడ్ లాంటి కష్టాల్లో కూడా ఏరోజు బటన్ నొక్కడానికి వెనుకడుగు వేయలేదన్నారు జగన్.
మళ్లీ అధికారంలోకి వచ్చేది తానే అన్న ధీమా
మళ్లీ అధికారంలోకి వచ్చేది తానే అన్న ధీమాతో పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగులు ఇస్తున్నారు జగన్. తమ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోబోమని, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే ఏపీకి రప్పించి సినిమా చూపిస్తామని హెచ్చరిస్తూ క్యాడర్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. తమ కార్యకర్తలని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదలమని హెచ్చరిస్తున్నారు
ప్లీనరీని ఈ ఏడాది కూడా వాయిదా వేయడంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ
జగన్ అంత నమ్మకంతో ధీమాగా చెప్తున్నా వైసీపీ నాయకులు, ఆయన క్యాడర్లో మాత్రం ఆ ఊపు కనిపించడం లేదంట. దానికి కారణం.. ప్లీనరీ వాయిదా పడటమే అంటున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి అంగ రంగ వైభవంగా నిర్వహించాల్సిన వైసీపీ ప్లీనరీని ఈ ఏడాది కూడా వాయిదా వేయడం వారికి మింగుడు పడటం లేదంట. తాజాగా వచ్చే ఏడాది ప్లీనరీని వైభవంగా నిర్వహిద్దామని.. వైసీపీ నాయకులకు జగన్ సూచించారు. దీంతో నాయకులు డీలా పడిపోతున్నారు.
వచ్చే ఏడాది జూలై 8న ప్లీనరీని నిర్వహించాలని నిర్ణయం
వాస్తవానికి వైసీపీ ప్లీనరీ అనేది అధికారంలో ఉన్నా.. లేకున్నా ఘనంగా నిర్వహించాల్సిన పార్టీ పండుగ. టీడీపీ మహానాడు ప్రతిసారి అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది. అలాగే జూలై 8న దివంగత సీఎం వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని వైసీపీ ప్లీనరీని నిర్వహించాలని పార్టీలో తీర్మానం చేశారు. అయితే.. గత ఏడాది పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో ప్లీనరీ ఊసే లేకుండా పార్టీ అవిర్భావ కార్యక్రమాలు సాదాసీదాగా నిర్వహించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం అయినా..పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించి క్యాడర్కు దిశానిర్ధేశం చేస్తారని భావించారు.
Also Read: రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అరెస్ట్?
జిల్లా పర్యటనల ఊసే మర్చిపోయిన జగన్
పార్టీ వారి ఆలోచన ఎలా ఉన్నా.. జగన్ మాత్రం దాన్ని నీరుగార్చేశారు. వచ్చే ఏడాది జూలై 8న ప్లీనరీని నిర్వహించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలకు చెప్తుతున్నారంట. దీంతో అప్పటి వరకు ఉత్సాహంగా ఉన్న నాయకులు కూడా డీలా పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నాయకులు బయటకు రావడం లేదు. కార్యకర్తల పరిస్థితి దారుణంగా ఉంది. దీనికితోడు జగన్ కూడా పెద్దగా బయటకు వచ్చి.. కార్యకర్తల కు భరోసా ఇస్తున్నారా? అంటే అది కూడా లేదు. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి తర్వాత జిల్లా పర్యటనలు మొదలు పెడతానని ప్రకటించిన జగన్, అసలు దాన్ని పట్టించుకోవడమే మానేశారు.
వివిధ నియోజకవర్గాల్లో వైసీపీకి నేతల కరువు
ఈ నేపథ్యంలో వైసీపీ ప్లీనరీపై చాలా ఆశలు పెట్టుకున్నారు కార్యకర్తలు. తద్వారా పార్టీకి దశ-దిశ ఏర్పడుతుందని.. తమకు ఊపు వస్తుందని అనుకున్నారు. కానీ, ప్లీనరీని వాయిదా వేయడంతో పూర్తిగా నీరుగారిపోతున్నారు. అయితే.. దానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గాల స్థాయిలో అన్ని చోట్ల వైసీపీకి నాయకులు లేరు. ఉన్నవారిలోనూ ఊపు కనపడటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు జగన్కు నమ్మినబంట్లుగా చెలరేగిపోయిన నాయకులు సైతం ప్రస్తుతం ప్రజలకు ముఖం చాటేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్లీనరీ పెట్టినా.. నవ్వుల పాలవుతామన్న ఆందోళనతోనే జగన్ ఈసారికి వాయిదావేశారని అంటున్నారు. వచ్చే ఏటికి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేసి.. అప్పుడు ప్లీనరీ పెట్టాలన్న యోచనలో ఉన్నారంటున్నారు. మొత్తానికి అలాసాగిపోతోంది వైసీపీ రాజకీయం.