AP liquor scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైఎస్ భారతి ఆర్థిక వ్యవహారాలు చూసుకునే గోవిందప్ప పోషించిన పాత్రపై వైసీపీ వర్గాలే బిత్తరపోతున్నాయి. గోవిందప్ప బాలాజీ రిమాండ్ రిపోర్ట్లో సెట్ పేర్కొన్న సంచలన విషయాలు అందర్నీ షాక్కు గురి చేస్తున్నాయి. బాలాజీ అరెస్టుతో ఈ కుంభకోణంలో అసలైన కుట్రదారులు, సూత్రధారుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత నిందితురాలిగా ఉంటే.. ఏపీ లిక్కర్ స్కాంలో మాజీ సీఎం జగన్ భార్య భారతి ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప అరెస్ట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ భారతి ఆర్థిక వ్యవహారాలు చూసుకునే గోవిందప్ప బాలాజీ
ఏపీ లిక్కర్ స్కాంలో భారతి సిమెంట్స్ డైరెక్టర్, మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే గోవిందప్ప బాలాజీ లీలలన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఆయన రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ సిండికేట్లో గోవిందప్ప బాలాజీ సభ్యుడిగా ఉన్నారని, మద్యం ఆర్డర్ ఆఫ్ సప్లై, గుర్తింపు పొందిన బ్రాండ్లు నిలిపివేతలో గోవిందప్ప కీలకంగా వ్యవహరించారని సిట్ తేల్చింది. ప్రముఖ బ్రాండ్ల లిక్కర్ ను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి కోట్ల రూపాయలు ఆర్జించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
జగన్కు సన్నిహితులైన రాజ్ కేసిరెడ్డి, గోవిందప్ప
డిస్టలరీస్ నుంచి ముడుపులు వసూలు చేసే నెట్ వర్క్లో గోవిందప్ప కీలకంగా వ్యవరించారని రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించారు. డబ్బులు వసూలు చేయటానికి ఒక వ్యవస్థను తయారు చేసి తతంగం నడిపించారని .. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఏ 1 నిదింతుడు రాజ్ కేసిరెడ్డికి గోవిందప్ప బాలాజీ అత్యంత సన్నిహితుడని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. అటు రాజ్ కేసిరెడ్డి, ఇటు గోవిందప్ప ఇద్దరూ మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితులే కావడం గమనార్హం
లిక్కర్ స్కాం కేసులో అయిదుగురి అరెస్ట్
లిక్కర్ కేసులో గోవిందప్ప బాలాజీ A 33గా ఉన్నారు. ఈయన అరెస్ట్తో లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ల సంఖ్య ఐదుకు చేరింది. ఇదే కేసులో ఇప్పటికే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఇన్నాళ్లూ సిట్ విచారణకు హాజరుకాకుండా, తప్పించుకుని తిరుగుతున్న జగన్ మాజీ సెక్రటరీ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తాజాగా లాయర్ల సమక్షంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే.. చాణక్య, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణ తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను నిందితులుగా చేరూస్తూ సిట్ అధికారులు మెమో దాఖలు చేశారు. వసూళ్ల నెట్వర్క్ ద్వారా వచ్చిన డబ్బును షెల్ కంపెనీలకు మళ్లించి చివరికి అంతిమ లబ్దిదారులకు చేర్చడంలో గోవిందప్ప క్రియాశీలక పాత్ర పోషించారన్నది సిట్ ప్రధాన అభియోగం.
నెల రోజులుగా పరారీలో ఉన్న గోవిందప్ప
గోవిందప్ప బాలాజీ మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడే కాదు, జగన్ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలన్నీ చూస్తుంటారన్నది బహిరంగరహస్యమే. నెల రోజులుగా పరారీలో ఉన్న భారతీ సిమెంట్స్ శాశ్వత కాల డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ కోసం మూడు రాష్ట్రాల్లో గాలించిన సిట్ బృందాలు.. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని చామరాజనగర జిల్లా బీఆర్హిల్స్ అటవీ ప్రాంతంలో ఉన్నారని గుర్తించి అక్కడే అదుపులోకి తీసుకున్నాయి. ట్రాన్సిట్ వారంట్ కోసం ఆయన్ను ఎలందూరు కోర్టులో హాజరుపరిచి, విజయవాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరు పరిచారు.
అసలు కుట్రదారులు, సూత్రధారుల పేర్లు బయటకొచ్చే అవకాశం
బాలాజీ అరెస్టుతో ఈ కుంభకోణంలో అసలైన కుట్రదారులు, సూత్రధారుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది. అత్యధికంగా ఆర్డర్లు కట్టబెట్టిన లిక్కర్ సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజ్ కెసిరెడ్డి బృందం ప్రతి నెలా 50 నుంచి 60 కోట్ల ముడుపులు వసూలు చేసేదని సిట్ దర్యాప్తులో తేలింది. తాము గోవిందప్పకు లంచాలు ఇచ్చామని కొంతమంది డిస్టిలరీల యజమానులూ సిట్కు వాంగ్మూలాలిచ్చారు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో ఆయన హైదరాబాద్, తాడేపల్లిల్లో తరచూ సమావేశమయ్యేవారని సిట్ ఐడెంటిఫై చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈనెల 11న విచారణకు రావాల్సిందిగా గోవిందప్పకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. గైర్హాజరవడంతో ఆయన కదలికపై నిఘా పెట్టి అరెస్ట్ చేశారు.
Also Read: పాకిస్తాన్ నీ పిలక పీకిస్తాన్.. కాశ్మీర్ గడ్డపై రాజ్నాథ్ సాలిడ్ వార్నింగ్
సాయిరెడ్డి ద్వారా జగన్ ఫ్యామిలీకి దగ్గరైన గోవిందప్ప
గోవిందప్ప చార్టర్డ్ అకౌంటెంట్. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ద్వారా జగన్ కుటుంబానికి దగ్గరయ్యారంటారు. గోవిందప్పది చిత్తూరు జిల్లా వి.కోట మండలం పట్రపల్లి. సీఏ అయ్యాక బెంగళూరులో ఆడిటర్గా పనిచేశారు. కొన్నాళ్లు ఆస్ట్రేలియా వెళ్లి, భారత్కు తిరిగొచ్చారు. 2010 ఏప్రిల్ 30 నుంచి భారతి సిమెంట్స్లో పూర్తికాలపు డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాలు, కొనుగోళ్లు, ఐటీ బాధ్యతలు చూస్తారు. అయితే ఈ లిక్కర్ స్కాంలో అంతిమ లబ్దిదారు ఎవరు అనే అంశాలపై సిట్ ఆయన్ను ప్రశ్నించనుంది. అక్కడ వచ్చిన సమాచారం ఆధారంగా ఎవిడెన్సులతో సహా మ్యాటర్ బయటపెట్టనుంది. మొత్తానికి ఈ కేసులో వైఎస్ భారతి ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప కీలకంగా మారడం చర్చనీయాంశంగా మారింది.