హైడ్రా ఏర్పాటైన తరువాత మంచి కీర్తిని తెచ్చిపెట్టిన ఆపరేషన్ ఏదైనా ఉన్నదంటే.. మొట్టమొదటి కోవలోకి వచ్చేది బతుకమ్మ కుంట. అవును.. దీనికి పునరుజ్జీవం కల్పించిన తీరు.. రూపు రేఖలు మార్చిన వైనంపై పార్టీలకతీతంగా కొనియాడారు. అక్కడి జాగాల రేట్లు ఆమాంతం పెరిగాయి. ఆ పరిసర ప్రాంతాల జన జీవనంలో కొత్త మార్పులను తీసుకొచ్చిందా కుంట. నిత్యం జాగింగు, వాకింగు.. బతుకమ్మ ఆడే వేళ కనుల పండువగా ఉత్సవాలు.. ఇవన్నీ అక్కడి పరిసరాలకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి.
హైడ్రాను విమర్శించిన నోళ్లు కూడా ఈ బతుకమ్మ కుంట విషయంలో వేనోళ్లా పొగిడాయి. వారెవ్వా.. రేవంతు.. నువ్వు చేసిన మంచిపనేదైనా ఉందంటే… అది ఇదే! అని ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా కొనియాడాయి. అయితే ఇది మొదటి నుంచి భూ వివాదంలో ఉంది. కోర్టు పరిధిలో ఈ కేసు నడుస్తున్నది. ఈ కుంట జాగా తనదేనంటూ మొదటి నుంచి బీఆరెస్ అంబర్పేట్ మాజీ ఎమ్మెల్యే ఎడ్ల సుధాకర్రెడ్డి కోర్టులో కేసు వేశాడు. కానీ దీనిపై సర్కార్ దూకుడుగానే ముందుకు పోయింది. మరి కొందరు కూడా ఈ కుంట జాగాను కబ్జా చేసుకున్నారు. దాదాపు 7 ఎకరాల వరకు వివాదంలో ఉంది. కబ్జాదారులందరి చెర నుంచి హైడ్రా ఈ కుంట భూమిని విడిపించింది. వెంటనే మంచి ప్లానింగుతో పనులకు ఉపక్రమించింది.
వడివడిగా యుద్ధ ప్రాతిపదికన చుట్టూ ప్రహారీ గోడను.. లోపల వాకింగ్ ఫ్టాట్ ఫామ్ను, కోనేరును తలపించేలా కుంటను మంచినీటితో నింపి.. గోడలకు ప్రకృతి, పూలతో రంగులద్ది జిగేలమనిపించేలా తీర్చిదిద్దారు. కొత్తగా పురుడు పోసుకున్న ఈ బతుకమ్మ అందరినీ ఆకట్టుకున్నది. అలరించింది. ఎక్కడెక్కడి వాళ్లో ఇక్కడికి వచ్చి దీన్ని సందర్శించి పోవడం.. కాసేపు అలా సేద తీరడం.. వాకింగు చేసుకుంటూ అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గ్రోలుతూ కాలాన్ని మైమరిపోవడం.. ఇవన్నీ నిత్యకృత్యమే అయ్యాయి. దీని ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ కూడా వచ్చారు. విమలక్క తదితరులు వచ్చి హైడ్రాకు సంఘీభావంతో పాటు సర్కార్ చర్యలను కొనియాడి వెళ్లారు. ప్రస్తుతం అంబర్ పేట్ బీఆరెస్ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న ఎడ్ల సుధాకర్రెడ్డి మళ్లీ దీనిపై కోర్టు కెళ్లారు.
సుప్రీం కోర్టు ఈ మేరకు దీన్ని స్వాధీనం చేసుకోవాలనే తీర్పు నివ్వడంతో పాటు.. మూడు వారాల గడువును కూడా ఇచ్చింది హైడ్రాకు. వెంటనే నిన్న హైడ్రా .. బతుకమ్మ కుంట గోడలపై రాసిన హైడ్రా పేర్లను తొలగించేసింది. తీర్పుననుసరించి.. దీన్ని ఎడ్ల సుధాకర్రెడ్డి కైవసం చేసుకోనున్నారా? ఎంత మేర అతనికి చెందుతుంది? అలా అయితే బతుకమ్మ కుంట మళ్లీ ప్రైవేటు పరం కానుందా? అక్కడ ఇంత వరకు చేసిన ప్రయత్నాలన్నీ వృథానేనా అనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదిలా కొనసాగుతున్న వేళ.. తొందరపడి ఓ కోయిలా.. అన్నట్టుగా బీఆరెస్ అఫీషియల్ ట్విట్టర్లో ఇవాళ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇది కేటీఆర్కు తెలియకుండా చేయరు. బతుకమ్మ కుంట గోడలపై .. మెయిన్ ఎంట్రెన్స్ పై ఉన్న హైడ్రా పేరును తొలగించేసి బ్లాక్ రంగు వేసిన వీడియో అది. దీనికి.. ప్రచార ఆర్బాటం కోసం ప్రజాధనాన్ని వృథా చేస్తున్న హైడ్రా…అని ఓ టైట్ల్ పెట్టి మరీ వీడియో వదిలారు.
వాస్తవానికి ఇది ప్రచారార్బటం కాదు. ప్రజావసరం. ఎంతంగా అంటే.. అక్కడి జనజీవనంలో ఇది కలిసిపోయేంతలా. అక్కడ బతుకమ్మ కుంట తొలగిస్తామని ఎవరైనా వస్తే.. వారినే తరిమికొట్టేంతగా. అంతలా ఇది జనంతో పెనవేసుకుపోయింది. ఇక్కడ బీఆరెస్ సెల్ఫ్గోల్ అయింది. హైడ్రాను బద్నాం చేద్దామనే వారి ట్రిక్కు ఇక్కడ పనిచేయకపోగా.. రివర్స్ అయ్యింది. అయితే కేటీఆర్ .. బీఆరెస్ ఎక్కడా ఆ పార్టీ పేరుగానీ, ఎడ్ల సుధాకర్రెడ్డి పేరుగానీ తెరపైకి తేవడం లేదు. దీని వెనుక బీఆరెస్సే ఉందని ప్రజలు అనుకుంటే.. గ్రహిస్తే.. సీఎం దీన్ని బాగు చేస్తే.. బీఆరెస్ దీన్ని కూల్చేసి.. బిల్డింగులు కట్టేందుకు రెడీ అయ్యిందనే సంకేతం వెళ్లనుంది.
అదే జరిగేలా ఉంది. ఎంత హైడ్రాపై దుష్ప్రచారం చేద్దామని అనుకున్నా.. ఇది సర్కార్కు, హైడ్రాకు మైలేజీని తగ్గించేలా లేదు. అదే సమయంలో దీని జోలికి వెళ్లిన బీఆరెస్సే ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబడే అవకాశాలే కనిపిస్తున్నాయి. తగుదునమ్మా అని అన్నింట్లో వేలు పెట్టి నోటిదురుసును ప్రదర్శిస్తే అంతిమంగా ఫలితాలు ఎలా ఉంటాయో.. దాని ప్రభావం ఎలా ఉంటుందో….ఈ బతుకమ్మ కుంటే ఓ గుణపాఠంలా మారనుంది బీఆరెస్కు. కేటీఆర్కు.