Maganti Sunitha: తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చూస్తుండగానే అయిపోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కాంగ్రెస్ అభ్యర్థికే అనుకూలంగా వచ్చాయి. జూబ్లీహిల్స్ ఓటర్లు అధికార పార్టీకే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అనేక సర్వే సంస్థలు ప్రకటించాయి. అసలు మాగంటి సునీత వెనుకంజలో ఉండటానికి కారణాలేంటి? ఆమె విజయానికి అడ్డుపడ్డ అంశాలేంటి?
మాగంటి మరణం తర్వాత అనివార్యంగా వచ్చిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అందరికంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ తమ క్యాండిడేట్ని అనౌన్స్ చేసి ప్రచారం మొదలుపెట్టింది. సిట్టింగ్ సీట్ను ఎలాగైనా దక్కించుకునేందుకు, తిరిగి మాగంటి కుటుంబానికే జూబ్లీహిల్స్ టికెట్ కన్ఫర్మ్ చేసింది బీఆర్ఎస్ అధిష్టానం… సెంటిమెంటే తమ అస్త్రంగా మాగంటి సునీత, ఆమె కుటుంబసభ్యులు ప్రచారం చేశారు. అయినా కూడా మాగంటి సునీతకు పెద్దగా ప్రజాదరణ దక్కలేదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. దీనికి అనేక కారణాలున్నాయంటూ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది..
వరుసగా జూబ్లీహిల్స్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాగంటి గోపినాథ్ కు అనేకమంది అనుచరులు, అభిమానులున్నారు. అయితే ఆయన అకాల మరణం తర్వాత వచ్చిన ఈ ఉపఎన్నికలో మాత్రం గోపినాథ్ భార్యకు అతని అనుచరులు గ్రౌండ్ లెవల్ లో సహకరించలేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. మాగంటి ఎన్నికల్లో నిలబడుతున్నారంటే చాలు ఆయన అభిమానులే ఎన్నికల భారమంతా తమ భుజాల మీద మోస్తూ గోపీనాథ్ ను గెలుపించుకునేవారు. కానీ, ఈ ఉపఎన్నికలో మాత్రం వారంతా నామమాత్రంగానే పనిచేశారని, అందుకే సునీత వెనుకంజలో ఉన్నారని గులాబీ పార్టీలో టాక్ నడుస్తోంది.
మాగంటి సునీత గెలుపును ప్రెస్టీజియస్ గా తీసుకున్న గులాబీ పార్టీ ఎలాగైనా ఆమెను గెలుపించుకోవాలని శతవిధాల ప్రయత్నించింది. ప్రచార బాధ్యతను మొత్తం ఒంటిచేత్తో లాక్కొచ్చిన కేటీఆర్.. కింది స్థాయి నాయకత్వాన్ని సమన్యయపర్చడానికి సరైన కార్యచరణ చేయలేకపోయారని, మాగంటి గోపీనాథ్ అనుచరులను సునీత గెలుపు కోసం పనిచేయించడంలో విఫలమయ్యారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.. అయితే సునీత గెలుపు కోసం తీవ్రంగా కష్టపడ్డ కేటీఆర్ నాయకుల్లో సమన్వయం తీసుకురావడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయారట.
మాగంటి గోపీనాథ్ది సహజమరణం కాదంటూ, ఆయన మరణం వెనుక ఏదో కారణం ఉందంటూ.. గోపీనాథ్ అభిమానుల పేర్లతో జూబ్లీహిల్స్ లో వెలిసిన పోస్టర్లు.. మాగంటి మొదటి భార్య, కొడుకు హైదరాబాద్ కు వచ్చి చేసిన ఆరోపణలు, గోపీనాథ్ తల్లి మహానంద కుమారి ఏకంగా కేటీఆర్ పైనే ఆక్రోశం వెల్లగక్కడం.. ఇవన్నీ సునీత ఓటమికి కారణాలు అవ్వొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. వీటన్నింటిని గోపీనాథ్ అభిమానులు, అనుచరులు అడ్డుకోకపోవడం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగా మారిందని ఆ పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.. మరి చూడాలి ఈ ఉపఎన్నికల్లో మాగంటి సునీతకు ఎంతమేర ఓటు పర్సెంటేజ్ నమోదవుతుందో?
Story by Apparao, Big Tv