Kavitha Impact: చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అయ్యిందట బీఆర్ఎస్ పరిస్థితి. పార్టీకి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్న కూడా అది బెడిసికొడుతుందట. చివరికి పార్టీ పై మచ్చను తొలగించుకునేందుకు కుటుంబంలోని సొంత మనిషి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను బయటకు పంపించిన కూడా పార్టీ పైన పడ్డ మచ్చ మాత్రం ఇంకా అలాగే ఉందట. ఆ క్రమంలో వరుస ఓటములతో తల్లడిల్లుతున్న గులాబీపార్టీలో అంతర్మధనం మొదలైందా?
లిక్కర్ కుంభకోణం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో బీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది. కవితను పార్టీకి దూరం చేసుకుని తప్పు చేశామా? అన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఆమెపై మద్యం కుంభకోణం కేసు పెట్టినప్పుడు బీఆర్ఎస్ తొలుత సానుకూలంగానే ఉన్నా.. ఆమె జైలు నుంచి విడుదలయ్యాక పార్టీలో ప్రాధాన్యం తగ్గించారు. బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు వచ్చాక.. ఆ పార్టీ నేతలు కొందరు … లిక్కర్ క్వీన్ అంటూ ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. కొద్దిరోజుల క్రితం కవితని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఏకంగా, అడ్డంగా బుక్కై జైలుకెళ్లిన లిక్కర్ రాణి అని తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా ఆమె బీఆర్ఎస్ పార్టీని నిండా ముంచిందని, ఆమెకు సభ్యత, సంస్కారం లేవని ధ్వజమెత్తారు.
మరోవైపు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా కవితపై ఇష్టానుసారం చెలరేగిపోయారు. ‘నువ్వు జైలుకెందుకెళ్లావ్ ? తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు నీ అవినీతి బాగోతం నాకు తెలుసు. నీ కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టుకున్నావు. ఢిల్లీలో కేజ్రీవాల్ను నాశనం చేశావు.. తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ను, బీఆర్ఎస్ ను నాశనం చేయాలని చూస్తున్నావు’ అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ కు చెందిన మరికొందరు ఇతర నేతలు కూడా కవితను మద్యం కేసు విషయంలో విమర్శించారు. అయితే.. ఇప్పుడు ఆమెకు అదే కేసులో క్లీన్చిట్ రావడం బీఆర్ఎస్ కు మింగుడుపడని విధంగా మారిందని ఆ పార్టీలోని కొందరు నేతలే అంటున్నారు.
కేసీఆర్ కుటుంబానికి చెందిన ఆడబిడ్డ, పార్టీలో ఒకప్పుడు కీలకంగా ఉన్న నాయకురాలిని అంత ఘాటుగా విమర్శించడం, ఇప్పుడు ఆమెకు అనుకూలంగా తీర్పు రావడం పార్టీలోని కొందరిని ఉక్కిరి బిక్కిరి చేస్తుందట . కవితపై రాజకీయపరమైన విమర్శలు చేసినా, లేదంటే ఆమె చేసిన ఆరోపణలకు సమాధానాలు చెప్పినా ఫర్వాలేదని, కానీ.. మద్యం కుంభకోణంలో ఆమె తప్పు చేశారని, అవినీతికి పాల్పడ్డారంటూ మాట్లాడటమే ఇప్పుడు పార్టీకి ఇబ్బందికరంగా మారిందన్న చర్చ బీఆర్ఎస్లో నడుస్తోంది.
మరోవైపు.. తనపై ఇలాంటి విమర్శలు చేయడం వెనక ఒక పెద్ద నాయకుడు ఉన్నారని కవిత ఆరోపించారు. ఆయన తనపై చేస్తున్న కుట్రలు చివరకు ఆయనకే తిరిగి తగులుతాయన్నారు అసలు కవిత పై కుట్రలు చేసిన ఆ పెద్ద నాయకుడు ఎవరూ అంటూ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది ఓ సందర్భంలో తన బావ హరీష్ రావుపై, సంతోష్ కుమార్ పై బలమైన ఆరోపణలు చేశారు. అయితే వీరే కవిత పై కుట్రలు చేసి కవితను పార్టీ నుండి బయటకు పంపారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయట..
ఈ నేపథ్యంలో ‘కవితకు కోర్టులో న్యాయం జరిగింది’ అనే కేటీఆర్ ట్వీట్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే కవిత మాత్రం తనను పార్టీ నుండి బయటకు పంపించి మంచి పనే చేశారు, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే అవకాశం బీఆర్ఎస్ పార్టీ నాయకులే కల్పించారంటున్నారు. దీంతో కవితను పార్టీ నుండి బయటకు పంపించి తప్పు చేశామా అన్న చర్చ గులాబీ పార్టీ లో జోరందుకుందట. చూడాలి మరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో .. ఆమె ఇంపాక్ట్ గులాబీ పార్టీపై ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో?
Also Read: తమ్మినేని చాప్టర్ క్లోజ్? సీపీఎం హైకమాండ్ సంచలన నిర్ణయం!
Story by: Apparao, Big Tv