Tammineni: తమ్మినేని వీరభద్రంపై సీపీఎం అభిశంసన పత్రం వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సీపీఎంలో తమ్మినేని వీరభద్రం పంచాయితీ కలకలం రేపుతోంది. ఏళ్ల తరబడి ఆ కమ్యునిస్టు పార్టీలో అన్నీ తానై చక్రం తిప్పిన సీనియర్ నేత పార్టీ నియమాలకు విరుద్ధంగా క్రమశిక్షణ ఉల్లంఘిస్తూ.. పార్టీ నిర్ణయాలను పట్టించుకోలేదన్న ఆరోపణలతో హై కమాండ్ కు రాష్ట్ర నేతలు ఫిర్యాదులు చేశారు. ఆయన హయాంలో పదేళ్ల పాటు సీపీఎంని కేసీఆర్ కు జీ హుజూర్ అనిపించారన్న విమర్శలున్నాయి. తెలంగాణలో సీపీఎం ఉనికి లేకుండా పోవడానికి ప్రధాన కారణం తమ్మినేనే అన్న చర్చ కూడా జరుగుతున్న తరుణంలో ఆయన అభిసంశన ఎపిసోడ్ హాట్ టాపిక్ అయింది.
తెలంగాణలో పార్టీ ప్రతిష్ట మసకబారడం, ఎన్నికల్లో వరుసగా ఘోర పరాజయాలు, అగ్రనేతలపై వస్తున్న అవినీతి ఆరోపణలను సీపీఎం కేంద్ర నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించడం, ఏకపక్ష నిర్ణయాలతో పార్టీని దెబ్బతీయడం వంటి అంశాలపై దృష్టి సారించి.. రాష్ట్రానికి చెందిన ముగ్గురు నేతలపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు, ప్రసాద్పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు.
తెలంగాణ సీపీఎం సీనియర్ నేత, పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంపై ఆ పార్టీ కేంద్ర కమిటీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఆయన్ను అభిశంసిస్తున్నట్లు పార్టీ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. 2024లో జరిగిన రాష్ట్ర పార్టీ నూతన కార్యదర్శి ఎన్నికల సమయంలో ఆయన అనుసరించిన తప్పుడు రాజకీయ వైఖరి, పార్టీ నిబంధనల ఉల్లంఘనలే ఈ చర్యకు కారణంగా పేర్కొంది.
రాష్ట్ర కార్యదర్శి ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యయుత చర్చకు బదులుగా లాబీయింగ్, ప్రలోభాలు, అస్తిత్వవాద రాజకీయాలు నడిచాయని కేంద్ర కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది. ఈ పరిణామాలతో పార్టీ రాష్ట్ర కమిటీ నిట్టనిలువునా చీలిపోయిందని, ముఠాతత్వం ఆందోళనకర స్థాయికి చేరిందని తన నివేదికలో స్పష్టం చేసింది. పార్టీలో ఐక్యతను నెలకొల్పేందుకు పొలిట్బ్యూరో సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, తమ్మినేని సహా నాయకత్వంలోని ఒక వర్గం వివాదానికి సంబంధించి వెనక్కి తగ్గకపోవడాన్ని కేంద్ర నాయకత్వం తప్పు పట్టింది.
తాజాగా హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సీపీఎం పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో తమ్మినేనితోపాటు మరో ఇద్దరిపై కేంద్ర కమిటీ అభిశంసన తీర్మాన ప్రతులను రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులకు అందజేశారు. కాగా, మధురైలో జరిగిన సీపీఎం పార్టీ జాతీయ సదస్సులో కేంద్ర కమిటీ పనితీరుతోపాటు, లోపభూయిష్ట విధానాల వల్లే తెలంగాణలో పార్టీ ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చిందని తమ్మినేని విమర్శలు చేసినట్లు సమాచారం.
దాంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందనేదానిపై సెంట్రల్ కమిటీ శ్రీదీప్ భట్టాచార్య, బాలకృష్ణన్లతో ద్విసభ్య కమిటీ వేసింది. తెలంగాణలో పార్టీ తీరు, గతంలో తమ్మినేని రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినప్పుడు పార్టీ నడిపిన విధానంపై లోతైన విచారణ చేపట్టినట్లు తెలిసింది. సుదీర్ఘకాలం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన తమ్మినేని వీరభద్రం తీసుకున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ అస్తిత్వానికే ముప్పు తెచ్చాయని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. ఒకప్పుడు శాసనసభలో బలమైన గళం వినిపించిన సీపీఎం.. తమ్మినేని సారథ్యంలో రెండు పర్యాయాలు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోల్పోవడంపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది.
తమ్మినేని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరిట చేసిన ప్రయోగం విఫలమవడం.. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఊగిసలాట, చివరి నిమిషంలో ఒంటరిపోరు నిర్ణయం వంటివి పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేశాయి. ఇదంతా తమ్మినేని స్వయంకృతాపరాధమేనని హైకమాండ్ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యదర్శి ఎంపిక ప్రక్రియలోనూ తమ్మినేని వీరభద్రం వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పార్టీపై తన పట్టును నిలుపుకునేందుకు తనకు అనుకూలమైన వ్యక్తినే కార్యదర్శిగా నిలబెట్టారని ఆరోపణలు వచ్చాయి. కేంద్ర కమిటీ ఓ వ్యక్తి పేరు ప్రతిపాదించినప్పటికీ లెక్క చేయకుండా మరో వ్యక్తిని నియమించి ఓటింగ్కు దారితీశారనే విమర్శ ఉంది. దీనివల్ల పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం దెబ్బతిందని, గ్రూపు రాజకీయాలు పెరిగాయని సెంట్రల్ కమిటీ గుర్తించి ఆయనపై చర్యలకు దిగింది.
దీనిపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులును ప్రశ్నిస్తే విచిత్రంగా స్పందించారు కేంద్ర కమిటీ అభిశంసన నోటిసులు తన దృష్టికి కూడా వచ్చాయని. అవన్నీ తమ పార్టీ అంతర్గత విషయాలని, తాను రాజకీయ అంశాలపై మాత్రమే స్పందిస్తానన్నారు . తమ పార్టీ నిర్మాణ పరమైన అంశాలపై బహిరంగంగా మాట్లాడబోనని స్పష్టం చేశారు. ఒకవైపు తెలంగాణలో తమ్మినేని ఎపిసోడ్ వార్తల్లో నలుగుతుంటే.. ఏపీకి చెందిన సిపిఎం పార్టీ కార్యవర్గంపై కూడా అనేక ప్రచారాల వెలుగు చూస్తుండటం ఆ పార్టీ క్రమశిక్షణకు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది.
Also Read:బెజవాడ కోటలో బాబుకు చెక్! జగన్ వేస్తున్న ‘మాస్టర్ ప్లాన్’ ఇదే!
Story by: Apparao, Big Tv