KCR vs Kavitha: బీఆర్ఎస్పై జాగృతి అధ్యక్షురాలు కవిత ముందు నుంచి విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. గులాబీ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు ….పార్టీ నేతలపై కవిత సీరియస్గానే కామెంట్స్ చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నాయకత్వం వ్యవహారించిన తీరును ఎండగడుతున్నారు. ఎకవిత లెవనెత్తుతున అంశాలపై బీఆర్ఎస్ నేతలు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. నేరుగా కేటీఆర్ను టార్గెట్ చేస్తున్న కవిత కామెంట్స్ పార్టీలోను చర్చనీయంశంగా మారి, గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయంట
జాగృతి అధ్యక్షురాలు కవిత ఉగాదికి కొత్త పార్టీ పెడతానంటున్నారు. ఆ క్రమంలో కవిత వర్సెస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్గా రాజకీయం మారుతోంది. పార్టీ సస్పెండ్ చేయడంతో … తర్వాత కవిత ఎమ్మెల్సీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి… గులాబీ పార్టీపైనా..నేతలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె గత కొంతకాలంగా విమర్శలు చేస్తున్నా పార్టీ అగ్రనేతలు ఎవరు స్పందించలేదు. కేవలం కొంతమంది మాజీ మంత్రులు.. మాజీ ఎమ్మెల్యేలు.. ఒకరిద్దరు ప్రస్తుత ఎమ్మెల్యేలు.. అదికూడా తమపై ఆరోపణలు చేస్తే కౌంటర్ ఇస్తున్నారు. కవిత ప్రధానంగా హరీష్ రావు, సంతోష్ లతో పాటు కేటీఆర్ పైనా, పార్టీపైనా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నా మిగిలిన నేతలు సైలెంట్గానే ఉంటున్నారు. కనీసం ఆమెను పరిగణలోకి తీసుకోనవసరం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.
కేటీఆర్ను ఉద్దేశించి కవిత తాజాగా మీడియా చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్కు క్యాడర్ గుర్తుకు వస్తోందని కవిత యద్దేవా చేశారు. గతంలో కేటీఆర్ ఎవరికీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని.. ప్రస్తుతం సర్పంచ్ లను కూడా కలుస్తున్నారని కవిత విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కేటీఆర్ సైతం తనదైన శైలీలో కౌంటర్ ఇచ్చారు. కవిత వ్యాఖ్యలకు కౌంటర్గా కేటీఆర్ స్పందిస్తూ సర్పంచులను, నేతలను కలవడం కొత్తేమీ కాదు.. తెలంగాణ భవన్ కు వచ్చిన అందరినీ గతంలో కలిశాం, ఇప్పుడూ కలుస్తామన్నారు. కవిత కావాలని ఆరోపణలు చేస్తున్నట్లు మండిపడ్డారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సికింద్రాబాద్ అస్థిత్వాన్ని దెబ్బతీశారని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా సికింద్రాబాద్ జిల్లా కావాలని అడిగిన వాళ్లను గత పదేళ్లలో బీఆర్ఎస్ అణిచివేసిందని ఆరోపించారు. కానీ ఇప్పుడు మాత్రం సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా కావాలని కేటీఆర్ అడగటం విచిత్రంగా ఉందన్నారు. జిల్లాల పునర్విభజన అనేది ఇప్పుడు జరగటం సాధ్యం కాదని, కానీ ఎప్పుడు పునర్విభజన జరిగినా సరే సికింద్రాబాద్ ను జిల్లా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
అదే విధంగా మాజీ ప్రధాని పీపీ నర్సింహారావు పేరును ఏదైనా ఒక జిల్లాకు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలకు కేటీఆర్ సైతం సమాధానం చెప్పారు. తామెప్పుడూ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించలేదని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. లేని ఫ్యూచర్ సిటీ తీసుకొచ్చి జంట నగరాల అస్తిత్వం దెబ్బతీస్తున్న రేవంత్ రెడ్డిని దానిపై నిలదీయాలని కేటీఆర్ సూచించారు. సికింద్రాబాద్ లో స్థానికులు చేస్తున్న ఉద్యమానికి సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో కవిత వ్యాఖ్యలు గులాబీ పార్టీకి నష్టం చేకూరుస్తాయనే ఆందోళనతో కేటీఆర్ స్పందించారా? అన్న చర్చ మొదలైందిప్పుడు. పురపాలక ఎన్నికలను గులాబీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. నేతలు, కేడర్ సైతం పార్టీ మారకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇలాంటి తరుణంలో ప్రతి అంశాన్ని కవిత ప్రస్తావించడం బీఆర్ఎస్ పదేళ్లలో ఏం చేయలేదన్నట్లు చేస్తున్న వ్యాఖ్యలు, తప్పిదాలను ఎత్తి చూపుతుండటంతో దానికి కేటీఆర్ కౌంటర్ ఇవ్వక తప్పడం లేదంటున్నారు. పార్టీలోనే కొంతమంది నేతలు మాత్రం ఆయన కవిత వ్యాఖ్యలపై స్పందించకుండా ఉండాలని సూచిస్తుండగా.. కొందరు మాత్రం కౌంటర్ ఇస్తేనే మరోసారి విమర్శలు చేయడానికి ఆలోచిస్తారని పేర్కొంటున్నారు. మొత్తానికి తన చెల్లి విమర్శలపై కేటీఆర్ ఇప్పటికైనా కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
Story by: Apparao, Big Tv