Nalgonda: ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మంత్రి పదవుల కేటాయింపు అంశం కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. జిల్లాలో ఇద్దరు సీనియర్లు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాబినెట్ లో ఉన్నారు. ఇద్దరు మంత్రులు జిల్లా నుంచి ఉండగానే మరో ఇద్దరు మంత్రి పదవి కావాలని పోటీ పడుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎస్టీ కోటాలో బాలునాయక్ ఇద్దరూ క్యాబినెట్ రేసులో ఫోకస్ అవుతున్నారు. ఒక్క జిల్లాకే నలుగురు మంత్రులు అనేది ప్రాక్టికల్గా అసంభవం అంటున్నారు .ఇప్పటికే కొన్ని జిల్లాలకు మంత్రి వర్గం లో అసలు ప్రాతినిధ్యం లేదు. మరిలాంటి పరిస్థితుల్లో నల్లగొండ జిల్లాలో అమాత్య పదవుల పోరు ఎలా సెట్రైట్ చేస్తారు?
ఉమ్మడి నల్గగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకం. రాష్ట్ర విభజన ముందు నుంచి ఆ జిల్లాలో కాంగ్రెస్ ఆధిపత్యమే కొనసాగుతోంది. కాంగ్రెస్కు అంత పట్టున్న ప్రాంతం కావడంతో ప్రభుత్వం ఏర్పడిన దగ్గర జిల్లాలో అమాత్య పదవులు పంచాయితీ నడుస్తూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డిలు మొదటి విడతలోనే కీలక మంత్రి పదవులు దక్కించుకున్నారు. అయితే మధ్యలో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరి, ఎన్నికల ముందు కాంగ్రెస్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు.
రాజగోపాల్ కాంగ్రెస్లోకి తిరిగి వచ్చిన సమయంలోనే అధిష్టానం ఆయనకు మంత్రి పదవిపై హామీ ఇచ్చింది. అయితే మంత్రివర్గ ఏర్పాటు సమయంలో రాజగోపాల్కు సమీకరణలు కలిసి రాలేదు. తర్వాత లోక్ సభ ఎన్నికలప్పుడు, భువనగిరి ఎంపీ సీటుతో లింకు పెట్టి ఆయనకు మరోసారి హైకమాండ్ క్యాబినెట్ బెర్త్పై హామీ ఇచ్చింది. ఆ ఎంపీ సీటుని కాంగ్రెస్ వశం చేయడంలో కీలక పాత్ర పోషించిన రాజగోపాల్రెడ్డి మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు రెడ్డి వర్గీయులు మంత్రులుగా ఉండటంతో.. రాజగోపాల్రెడ్డి విషయం ఎప్పటికప్పుడు పెండింగ్లో పడుతూనే ఉంది. ఆ క్రమంలో ఇటీవల అన్న అవుట్ తమ్ముడు ఇన్ అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి ఖాయమని, ఆయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని క్యాబినెట్ నుంచి తొలిగించి రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి ఇస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ అలా జరిగే పని కాదంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి రాష్ట్రం లో మంత్రి గా పని చేసి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి. ఒక దశలో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడిన నాయకుడు. అలాంటి సీనియర్ని తప్పించి తమ్ముడికి మంత్రిపదవి ఇవ్వడం అంటే .. అది అసాధ్యమే అంటున్నారు.
అదే విషయం పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చాలా క్లారిటి తో కనిపిస్తున్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన సోదరుడు వెంకటరెడ్డిని పదవి నుంచి తొలిగించి, తనకు మంత్రి పదవి ఇస్తానంటే అంగీకరించేది లేదని సన్నిహితుల వద్ద ఇప్పటికే స్పష్టం చేశారంట. తామిద్దరం అన్నదమ్ములమని తెలిసే.. కాంగ్రెస్ హైమాండ్ తమకు హామీ ఇచ్చిందని, అలాంటిది ఇపుడు అన్న ని తొలిగించి తనకు ఇవ్వడం సరైంది కాదని రాజగోపాల్ రెడ్డి అంటున్నారంట.
రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి ఇచ్చినా, వెంకటరెడ్డిని మంత్రిగా తొలిగించే సాహసం అధిష్టానం చేయలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్లపై కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వెంకటరెడ్డి బహిరంగ విమర్శ విమర్శలతో కలకలం రేపారు. నల్లగొండ జిల్లాలో సీనియర్ లీడర్ గా ఉంటూ పేద ప్రజల కోసం కుమారుని పేరిట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఫైర్ బ్రాండ్ వెంకన్న ని అధిష్ఠానం పక్కన పెట్టడం అంటే దుస్సాహసమే అన్న టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే కరీంనగర్ జిల్లా జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మజీమంత్రి జీవన్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్గా మారింది.మాజీ మంత్రి జీవన్ రెడ్డి విషయంలోనే అలా ఉంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయం లో ఏదైనా జరిగితే మాత్రం, పార్టీకి తీవ్ర నష్టం తప్పదని కాంగ్రెస్ వర్గాలే టెన్షన్ పడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి రెండున్నర ఏళ్లు పూర్తయింది. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే మిగిలిఉన్న పదవీకాలం ఎంతో కీలకమైంది. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ మంత్రి గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని తొలగించడం అనేది జరగని పని. మరోవైపు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వకుంటే ఆగేలా లేరు. ఆయన పార్టీకి వ్యతిరేకంగా ఏదైనా డెసిషన్ తీసుకుంటే అప్పుడు కూడా అది కాంగ్రెస్కు మైనస్ అయ్యే పరిస్థితి. అదే ఇపుడు అధిష్టానం కు తలనొప్పిగా మారిందంట.
కోమటిరెడ్డి సోదరుల విషయం పక్కన పెడితే ఇక జిల్లా నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మంత్రి రేసులో ఉన్నారు. ఎస్టీ వర్గానికి చెందిన బంజారాల కోటా నుంచి బాలునాయక్ కి మంత్రి పదవి దక్కుతుందని ఆయన వర్గం నమ్మకంతో కనిపిస్తోంది. కానీ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి మంత్రి కోసం ఫైట్ చేస్తుండటం బాలునాయక్ కి మైనస్ గా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలునాయక్ కి మంత్రి దక్కితే, జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు అవుతారు. కానీ ఆయన ఎస్టీ కావడంతో పార్టీకి ఎలాంటి నష్టం జరగదంటున్నారు. అలాగని రాజగోపాల్కు హ్యాండ్ ఇస్తే చోటు చేసుకునే పరిణామాలు ఊహించడమే కష్టమంటున్నారు. పోనీ బాలునాయక్ని పక్కనపెడితే.. అది విపక్షాలకు ప్రధాన ఆయుధంగా మారుతుంది.ఇలా నల్లగొండ జిల్లాల్లో మంత్రి పదవుల సెట్టింగ్ హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా మారిందంట. మరి ఈ సమస్యలకు ఎలాంటి పరిష్కారం వెతుకుతారో చూడాలి.
Also Read: నేనే రాజు.. నేనే మంత్రి అంటే కుదరదు.. టీడీపీ నేతలకు లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్!
Story by: Apparao, Big Tv